Thursday, September 19, 2024
HomeదైవంInavolu Mallanna: ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

Inavolu Mallanna: ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

ఉత్తర తెలంగాణ ప్రజల కొంగు బంగారం ఈ మల్లన్న

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి లక్షలాదిమంది తరలివస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాల తో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు సౌకర్యాలను అధికారులు కల్పించారు.

- Advertisement -

ఉదయం నుంచే పూజలు మొదలు

ధ్వజారోహణంతో మల్లికార్జున స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం స్వామివారికి పూజలు మొదలయ్యాయి. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగ నేపథ్యంలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రానున్నారు. ఈ ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నాయి. ఆదివారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు

చారిత్రక పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. భక్తుల కోసం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల తరపున ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు భారీకేడ్లను ఏర్పాటు చేసి క్యూలైన్లలో వచ్చి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను చేశారు. ఆలయంతో పాటు చుట్టుపక్కల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నీటి సౌకర్యాన్ని కల్పించారు. ఉత్సవాల సందర్భంగా నిరంతర వైద్య సేవలను అందించేందుకు ఆ శాఖ అధికారులు వైద్యులు సిబ్బందితోపాటు అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు హనుమకొండ, వరంగల్ నుండి జాతరకు వచ్చే భక్తుల కోసం బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాది మంది తరలి వస్తారు కనుక పోలీసు అధికారులు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పలు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు వందలాది మంది పోలీస్ సిబ్బంది బందోబస్తును నిర్వహిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో మహిళా పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతరం భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చెక్ పోస్టులు,పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మీడియా కోసం ఆలయ ఆవరణలో మీడియా పాయింటును ఏర్పాటు చేశారు. ఇంకా వివిధ శాఖలు పలు ఏర్పాట్లను చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News