Friday, September 20, 2024
HomeదైవంKeesara Gutta: శ్రీరాముడు ప్రతిష్టించిన స్వయంభూ లింగం - కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం

Keesara Gutta: శ్రీరాముడు ప్రతిష్టించిన స్వయంభూ లింగం – కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం

గ్రేటర్‌ హైదరాబాద్‌గా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహానగరం చరిత్ర .. ఒక ఆలయ చరిత్రతో మొదలవుతుంది. ఆ ఆలయమే కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం. నగరంలోని అత్యంత ప్రాచీన ఆలయంగా పేరున్న కీసరగుట్టకు ఘన చరిత్ర ఉంది.ఈ ప్రాంతం ఒకప్పుడు విష్ణుకుండినుల వంశానికి రాజధాని అని చారిత్రక ఆధారాలున్నాయి. పురాణాల ప్రకారం రామ రావణ యుద్ధానంతరం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. బ్రాహ్మణుడైన రావణాసురుడిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరాముడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు రాముడి కోసం శివుడే స్వయంగా ప్రత్యక్షమై ప్రతిష్టించడానికి శివలింగాన్ని ఇచ్చాడని అందుకే .. కీసరలోని దేవుడు రామలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నారని ప్రతీతి.

- Advertisement -

కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయ చరిత్ర
హైదరాబాద్ నగరం యొక్క తూర్పు వైపున ఉన్న ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామం కీసర. ఈ గ్రామాన్ని కీసరగుట్ట అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉంది కీసరగ్రామం. హైదరాబాద్ శివారు గ్రామమైన కీసరగుట్ట తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకు ప్రధానకారణం ఈ గ్రామంలోని అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వరస్వామి ఆలయం. ఆదిదంపతులైన శివపార్వతులు నిత్యపూజలందుకుంటున్న ఈ ఆలయం ఒక కొండపై ఉంది. హిందువులు అత్యంత భక్తిప్రపత్తులతో ద ర్శించే ఈ ఆలయానికి కార్తీకమాసంలో భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు కీసరగుట్ట ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.

హైదరాబాదుకు సుమారు 40కిమల దూరంలో ఉంది కీసరగుట్ట. ఇది ఒక చారిత్రాత్మక పురాతన పుణ్యక్షేత్రం. దీనిని కేసరగిరి క్షేత్రం లేదా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం త్రేతాయుగం నుండి ఉందని హిందువులు భావిస్తున్నారు. త్రేతాయుగంలో సీతాదేవిని చెరబట్టిన లంకేశ్వరుడు రావణాసురుడితో శ్రీరామచంద్రుడు యుద్ధం చేస్తాడు. ఆయుద్ధంలో రావణాసురుడిని రామబాణంతో సంహరిస్తాడు శ్రీరామచంద్రుడు. అనంతరం రాముడు కీసరగుట్టకు వచ్చాడు. బ్రాహ్మణుడైన రావణాసురుడిని సంహరించినందువల్ల ఆ పాపాన్ని ప్రాయశ్చితం చేసుకోవాలని రాముడు భావిస్తాడు. అందుకోసం ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని శ్రీరాముడు నిర్ణయించుకుంటాడు. శివలింగ ప్రతిష్టాపన కోసం కాశీ నుండి 101 శివలింగాలను తీసుకురావల్సిందిగా రాముడు హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు. శివలింగం కోసం వాయువేగంతో కాశీకి వెళతాడు హనుమంతుడు. అయితే, లింగ ప్రతిష్టాపన సమయం గడుస్తున్నా హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముడు ఆందోళన చెందుతాడు. దీంతో .. శివుడు స్వయంగా రాముని ఎదుట సాక్షాత్కరించాడని, స్వయంగా శివలింగాన్ని రాముడికి ఇచ్చి ప్రతిష్టించాలని కోరినట్లు పురాణాల కథనం. శివుడు స్వయంగా ఇచ్చిన స్వయంభు లింగాన్ని రాముడు కీసరగుట్టలో ప్రతిష్టించి పూజలు చేశారని చరిత్రకారులు వెల్లడించారు. హనుమంతుడిని శాంతింపజేయడానికి, రాముడు ఆలయంలో పూజలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వమని ఆదేశించాడని అందుకే, దేవత ప్రతిష్టించిన కొండకు హనుమంతుడి పేరు ఉంటుందని అంటారు. అతను కేసరి కుమారుడు కాబట్టి ఆ ప్రాంతానికి కేసరగిరి అని రాముడు ప్రకటించాడని కథనం. అందుకే ఆ ప్రాంతానికి కీసరగా, కొండకు కీసరగుట్టగా రూపాంతరం చెందినట్లు చరిత్రకారులు అంటారు. హనుమంతుడు విసిరేసిన శివలింగాలు ఇప్పుడు కూడా ఆలయం వెలుపల ఉన్నాయని అంటారు. ఐదు , ఆరు శతాబ్దాలలో విష్ణుకుండిన్ రాజులు కీసరగుట్టలో పదకొండు అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో రాజసూయ, పురుష్మేధ, సర్వమేధ మొదలైన వైదిక ఉత్సవాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
పురావస్తు ప్రాముఖ్యత
కీసరగుట్టకు గొప్ప పురావస్తు ప్రాముఖ్యత కూడా ఉంది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం వద్ద 1970వ దశకం చివర 80వ దశకాల్లో త్రవ్వకాలు జరిగాయి. రామలింగేశ్వర ఆలయానికి ఉత్తరాన ఇటుక నిర్మాణాల పురాతన అవశేషాలు బైటపడ్డాయి. ఇవి కొండ వాలులు నీటి వనరుగా పనిచేస్తాయని వారు గుర్తించారు. ఆ అవశేషాలు విష్ణుకుండిన్ కాలం నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ త్రవ్వకాలలో కోట గోడలు, యాగ శాల, ప్రార్థనా మందిరం కూడా బయటపడ్డాయి. ఇక్కడ జైనమతం, బౌద్ధమతం రెండూ వృద్ధి చెందాయని సూచించే కొన్ని అవశేషాలు, రాతితో చేసిన నీటి తొట్టెలు కూడా పురావస్తు శాఖ పరిశోధనలో వెలుగు చూశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News