Tuesday, September 17, 2024
HomeదైవంMedaram Bangaram by RTC Cargo: భక్తుల చెంతకే, బంగారం

Medaram Bangaram by RTC Cargo: భక్తుల చెంతకే, బంగారం

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం

కార్గో సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న సందర్భంగా,టీఎస్ ఆర్టీసీ అధికారులు మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దే ప్రసాదం(బంగారం) అందజేయాలని నిర్ణయించారు. గతంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలను విజయ వంతంగా చేరవేయగా.. భక్తులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా బంగారం(బెల్లం)తో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందించనున్నారు. గత జాతర సందర్భంగా భక్తుల నుంచి అమ్మవారికి సమర్పించే బంగారం, చీర తీసుకెళ్లి మేడారం గద్దెల వద్ద పెట్టి తిరిగి తీసుకొచ్చే విధానం అమలుచేశారు. అయితే,భక్తుల రద్దీ కారణంగా ఇది సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈసారి జాతరలో గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని దేవాదాయ శాఖ ద్వారా సేకరించి భక్తులకు అందిచేందుకు ఆ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -

మొదలైన బుకింగ్
రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో(లాజిస్టిక్స్) కౌంటర్లలో ప్రసాదం కోసం బుకింగ్ మొదలుకాగా, ఈనెల 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల బంగారం పసుపు, కుంకుమ కావాలనుకునే భక్తులు ఆర్టీసీ కార్గో(లాజిస్టిక్స్) కౌంటర్లలతో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను నేరుగా సంప్రదించవచ్చు. ఒకవేళ కౌంటర్లకు వెళ్లలేని వారైతే పేటీఎం ఇన్సైడర్ పోర్టల్ లేదా ఆర్టీసీ యాప్ లోనూ బుక్ చేసుకోవచ్చు. ఇందు కోసం రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 25వ తేదీ వరకు భక్తులు ప్రసాదం కోసం బుక్ చేసు కునే వీలుండగా… దేవాదాయ శాఖ ద్వారా బంగారం (200 గ్రాముల నుంచి 250 గ్రాములు), పసుపు, కుంకుమ సేకరించి భక్తులకు చేరవేస్తారు.

తొలుత హనుమకొండకు
ఆర్టీసీ కార్గో సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ లభించడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కల్యాణ తలంబ్రాలను గత ఏడాది 1.50 లక్షల కుటుంబాలకు అందజేసి రికార్డ్ సృష్టించారు. అదే స్థాయిలో గిరిజన కుంభమేళాగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని లక్ష కుటుం బాలకు చేరవేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. భక్తులు బంగారం బుకింగ్ కోసం 25వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఆ తర్వాత గణాంకాల ప్రకారం దేవాదాయ శాఖ నుంచి సేకరిస్తారు. అనంతరం ప్రసాదాలను హనుమకొండకు చేర్చి అక్కడి నుంచి డిపోలకు, ఆపై భక్తుల ఇళ్ల చిరునామాకు చేరుస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News