Nagula Chavithi 2025:దీపావళి అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే కార్తీకమాసంలో జరిగే మొదటి పెద్ద పండుగల్లో నాగుల చవితి కూడా ఒకటి. ఈ పండుగ హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందింది. నాగులను పూజించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా చాలా మంది భక్తులు ఇంట్లో పూజలు జరిపి పుట్టల్లో పాలు పోసి నాగ దేవతలను ఆరాధిస్తారు.
పురాణ కథల్లో నాగుల చవితి గురించి అనేక కథలు వినపడుతుంటాయి. పాత శాస్త్రాలు చెబుతున్నదేమిటంటే, నాగులు భూమి రక్షక దేవతలుగా భావిస్తారు. భూమిలోని జలశక్తిని, పంటల వృద్ధిని వారు కాపాడతారనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు నాగుల పూజను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
నాడుల వ్యవస్థ …..
యోగశాస్త్ర దృష్టిలోనూ నాగుల చవితికి ప్రత్యేక అర్థం ఉంది. మనిషి శరీరంలో నాడుల వ్యవస్థ పాము ఆకారంలో ఉంటుందని యోగులు చెబుతారు. మూలాధార చక్రంలో కుండలినీ శక్తి పాము ఆకారంలో నిద్రిస్తుందని భావన ఉంది. ఈ శక్తి మేల్కొంటే శరీరంలోని విషగుణాలు నశించి, మానసిక సమతుల్యత ఏర్పడుతుందని యోగ తత్వం వివరిస్తుంది. నాగుల చవితి రోజున విషసర్పాన్ని ఆరాధించడం ఈ ఆధ్యాత్మిక భావనకు సంకేతం అని పండితులు అంటారు.
కుజుడు, రాహువు సంబంధిత…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు, రాహువు సంబంధిత దోషాలు ఉన్నవారు ఈ రోజున పుట్టల్లో పాలు పోసి నాగ దేవతను పూజిస్తే ఆ గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుందని చెబుతారు. అదేవిధంగా కుటుంబ సమస్యలు, శారీరక రుగ్మతలు తగ్గి మానసిక శాంతి లభిస్తుందని నమ్మకం ఉంది.
2025 సంవత్సరంలో నాగుల చవితి అక్టోబర్ 25 శనివారం రోజున వస్తుంది. ఈ రోజు నాగ దేవత పూజకు అనుకూల సమయాలు ఉన్నాయి. అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల 1 నిమిషం నుంచి చవితి తిథి ప్రారంభమై, అక్టోబర్ 25 శనివారం రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకు కొనసాగుతుంది.
పుట్టలో పాలు పోసి…
ఆ రోజున దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది. అందువల్ల భక్తులు ఉదయం 7.30 తర్వాత నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు లేదా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పుట్టలో పాలు పోసి నాగ పూజ చేయవచ్చు.
భూమిలో నివసించే నాగ దేవతలకు…
ఈ రోజున పుట్టలో పాలు పోసే సంప్రదాయం చాలా పురాతనమైనది. భూమిలో నివసించే నాగ దేవతలకు పాలు సమర్పించడం పవిత్రంగా భావిస్తారు. కొందరు ఈ రోజు సర్పాల చిత్రాలను గీశి పాలు, పండ్లు, పూలు సమర్పిస్తారు. ఇంట్లో లేదా దేవాలయంలో నాగప్రతిమల ముందు దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించడం ద్వారా పాప పరిహారం కలుగుతుందని నమ్మకం ఉంది.
భర్త దీర్ఘాయుష్షు కోసం…
నాగుల చవితి సందర్భంగా వివాహిత మహిళలు కుటుంబ సౌఖ్యం, భర్త దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేకంగా పూజ చేస్తారు. పిల్లల ఆరోగ్యానికి కూడా ఈ పూజ శుభప్రదమని పెద్దలు చెబుతారు. పాపపరిహారార్థం ఉపవాసం ఉండి పాలు, పండ్లు మాత్రమే తీసుకునే వారు కూడా ఉంటారు.
ఈ పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాగేంద్రస్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలతో కదిలిపోతాయి. పూజ అనంతరం పాలు పోసిన తరువాత భక్తులు నాగ దేవతకు నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.


