Navaratri – Auspicious Items:భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో నవరాత్రి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ పండుగను ఒక్కసారే కాదు, ఏడాదిలో నాలుగు సార్లు వివిధ ఋతువులలో జరుపుకుంటారు. చైత్ర మాసంలో జరిగే వసంత నవరాత్రి, ఆషాఢ మాసంలో జరుపుకునే గుప్త నవరాత్రులు, శీతాకాలంలో జరిగే మాఘ నవరాత్రి, అలాగే శరదృతువులో జరిగే శారదీయ నవరాత్రి. వీటిలో శరదీయ నవరాత్రిని అత్యంత ప్రధానంగా పరిగణిస్తారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.
తొమ్మిది అవతారాల్ని..
నవరాత్రి తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది అవతారాల్ని భక్తులు పూజిస్తారు. ప్రతి రోజూ ప్రత్యేకమైన శక్తిరూపాన్ని ఆరాధిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అమ్మవారికి ఇష్టమైన కొన్ని ప్రత్యేక వస్తువులను ఈ పండుగకు ముందే ఇంట్లోకి తీసుకువస్తే అదృష్టం, ఆరోగ్యం, ధనసమృద్ధి కలుగుతాయని చెబుతారు.
నవరాత్రి ముందు కొనాల్సిన శుభ వస్తువులు
వెండి నాణెం
నవరాత్రి ప్రారంభానికి ముందు కొన్ని ముఖ్యమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. వాటిలో మొదటగా వెండి నాణెం ప్రాముఖ్యత కలిగి ఉంది. వెండి నాణెాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చూస్తారు. దానిని ఇంటికి తీసుకువచ్చి పూజించటం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతుందని విశ్వాసం ఉంది.
కలశం
ఇంకో ప్రధాన వస్తువు కలశం. మట్టి, ఇత్తడి, వెండి లేదా బంగారంతో తయారైన కలశాన్ని పూజ సమయంలో ఉపయోగించడం పవిత్రంగా భావిస్తారు. కలశం ఇంట్లో ఉంచితే శుభఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు.
దుర్గామాత విగ్రహం లేదా చిత్రం
దుర్గామాత విగ్రహం లేదా చిత్రం కూడా నవరాత్రి సమయంలో ఇంటికి తీసుకురావడం మంచిదిగా పరిగణించబడుతుంది. పూజామందిరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, వాస్తు సమస్యలు తొలగుతాయని విశ్వాసం ఉంది.
శ్రీ యంత్రం
అలాగే శ్రీ యంత్రాన్ని నవరాత్రికి ముందే ఇంటికి తీసుకురావడం శుభప్రదం. ఇది ఒక శక్తివంతమైన యంత్రంగా పరిగణించబడుతుంది. శ్రీ యంత్రం ఇంట్లో ఉంటే విజయం, ధనలాభం, సౌభాగ్యం కలుగుతాయని అంటారు.
అలంకరణ సామగ్రి
మహిళల కోసం ప్రత్యేకంగా చెప్పే వస్తువుల్లో పదహారు అలంకరణ సామగ్రి ప్రాముఖ్యం ఉంది. వీటిని ఇంటికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ద్వారా సౌభాగ్యం, ఆయుష్షు లభిస్తాయని నమ్మకం. దీన్ని చాలా మంది దీర్ఘ సుమంగళి కావడానికి శుభకార్యంగా చూస్తారు.
ఎర్ర చందనం..
అదనంగా ఎర్ర చందనంతో తయారైన జపమాలను నవరాత్రి ముందు కొనడం శ్రేయస్కరం. ఈ జపమాలతో అమ్మవారి మంత్రాలు జపిస్తే దుర్గామాత ఆశీర్వాదం సులభంగా దక్కుతుందని భక్తులు నమ్ముతారు.
నవరాత్రికి ముందు ఇంటి నుంచి తొలగించాల్సినవి
శుభ వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం ఎంత ముఖ్యమో, కొన్ని వస్తువులను బయటకు పంపించడం కూడా అంతే ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.
విరిగిపోయిన వస్తువులు..
విరిగిపోయిన వస్తువులు, పాడైన గాజు పాత్రలు, పాత చెప్పులు, బూట్లు వంటి వాటిని నవరాత్రి ప్రారంభానికి ముందే ఇంటి నుంచి తొలగించాలి. వీటిని ఉంచితే ప్రతికూల శక్తులు పెరుగుతాయని అంటారు.
పాత విగ్రహాలు లేదా చిత్రాలను..
అలాగే పాత విగ్రహాలు లేదా చిత్రాలను కూడా ఇంట్లో ఉంచకూడదు. అవి దెబ్బతిన్నా, పగిలినా వాటిని పూజామందిరంలో నిల్వ చేయడం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జుట్టు, గోర్లు, గడ్డం కత్తిరించడం…
నవరాత్రి రోజుల్లో శరీర సంబంధిత కొన్ని విషయాలపైనా నియమాలు ఉన్నాయి. జుట్టు, గోర్లు, గడ్డం కత్తిరించడం నిషేధం. కాబట్టి ఆ పనులను పండుగ ప్రారంభానికి ముందే పూర్తి చేయడం ఉత్తమం.
Also Read: https://teluguprabha.net/devotional-news/neem-tree-remedies-for-shani-and-pitru-dosha-relief/


