Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శ్రీశైల క్షేత్రపాలకుడికి ప్రదోషకాల అభిషేకం

Srisailam: శ్రీశైల క్షేత్రపాలకుడికి ప్రదోషకాల అభిషేకం

బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం శ్రీశైల క్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేష పూజలను జరిపించింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజుల్లో బయలు వీరభద్రస్వామి వారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తారు. వీరభద్రస్వామివారు శివభక్త గణాలకు అధిపతి. శ్రీశైల క్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలు వీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్న వదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపులో కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని. వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమ సంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్ట దోషాలు, దుష్ట గ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News