Friday, October 18, 2024
HomeదైవంSrisailam: భ్రమరాంబికా అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

Srisailam: భ్రమరాంబికా అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

ఈ అలంకారం ఎంతో విశిష్టమైనది

లోకకల్యాణం కోసం ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని జూలై 21వ తేదీన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో అమ్మవారి మూల మూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించనున్నారు. అమ్మవారికి ఉత్సవ సంబంధిత విశేష పూజలు ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఇంకా దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరిస్తారు.
ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఉత్సవ మూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవికి, గ్రామ దేవత అంకాళమ్మకు ప్రత్యేక పూజలు, విశేషంగా నిర్వహిస్తారు.

- Advertisement -

శాకాలంకరణ
ఈ ఉత్సవములో ఆయా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల పండ్లు వినియోగిస్తారు. ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించ వచ్చని పురాణాలు చెబుతున్నాయి.
కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి, క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీ దేవి.
ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News