ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ( Tirumala laddu) ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు.

డిప్యూటీ ఈవో (జనరల్) శ్రీ శివప్రసాద్, ఏఈవో శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.

కడపజిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.