Saturday, October 5, 2024
HomeదైవంVeldurthi-Bramhagundeswaram: పాము మనిషిగా మారిన క్షేత్రం ఇదే

Veldurthi-Bramhagundeswaram: పాము మనిషిగా మారిన క్షేత్రం ఇదే

శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్ర చరిత్ర

ప్రముఖ పుణ్యక్షేత్రాలలో బ్రహ్మగుండం పురాతన క్షేత్రం, చాలా మహిమలు గల క్షేత్రం. వెల్దుర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బ్రహ్మగుండ క్షేత్రం. ఇక్కడ కామేశ్వరి సహిత బ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నాడు. చాలా మహిమాన్విత ప్రాంతంగా బ్రహ్మగుండాన్ని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ క్షేత్రమహిమలు విన్నవారికి పుణ్యం లభించునని పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

బ్రహ్మగుండ క్షేత్రం మహిమలు
ఎందరో మునులు ఋషులు పరమేశ్వరుని సేవ కోసం ఇక్కడికి వచ్చినట్లు పూర్వీకుల కథనం, అలాగే లలిత సాహిత్యంలో కూడా ఇందుకు ఆధారాలు కనబడుతున్నాయి. చెమికుల చెన్నారెడ్డి అనే కవి 1935లో బ్రహ్మగుండ క్షేత్ర మహిమను కావ్యంగా రాశాడు. వాటిద్వారా బ్రహ్మగుండ క్షేత్రం అద్భుత మహిమలు గలదిగా తెలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనంతో పూర్వజన్మలో కానీ, ఈ జన్మలోగానీ తెలిసీ చేసినవి, తెలియక చేసిన మన పాపాలు ఏమైనా పటాపంచలు అవుతాయనే గొప్ప సత్యం, దైవ లీలలు చాలా ఉన్నాయి. అంతేకాదు దశరథ మహారాజుకు అక్కడ కలిగిన శాపం కూడా తర్వాతి కాలంలో శుభమైనదట.

పాండవుల్లో ఒకడైన అర్జునుడికి సుభద్రకు పుట్టినవాడు అభిమన్యుడు, ఆ అభిమన్యు మనుమడు పరీక్షిత్తు అంటే పాండవుల మనుమడు, అతని కుమారుడు జయమేజయ మహారాజు, పాండవుల ముని మనవడు. అది కలియుగం ప్రారంభమవుతున్న రోజులు, పరీక్షిత్ మహారాజు ఒకరోజు బయటకు వెళ్ళాడు. వేటాడంలో అలసిపోయి ఒక ముని ఆశ్రమానికి వచ్చాడు. అది శ్రామికుడు అనే ముని ఆశ్రమం. ముని ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. రాజు తనకు దాహంగా ఉందని మహర్షిని అడిగాడు. ధ్యానంలో ఉన్న శమీక మహర్షికి రాజు మాటలు వినపడలేదు. ఎంతకూ వినిపించకపోయేసరికి పరిషత్ మహారాజుకు కోపం వచ్చింది. వినుగుతో అక్కడ పడి ఉన్న ఒక పామును ధ్యానం చేస్తున్న ముని మీద వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి అది తెలిసి కోపంతో ఊగిపోయాడు. తక్షణమే పాముకాటుతో 7 రోజులలో మరణిస్తావంటూ పరిక్షిత్ మహారాజుకు శాపం ఇచ్చాడు. సమీక మహర్షి అది తెలుసుకున్నాడు. కోపంతో తమ కుమారుడు పరిక్షిత్ మహారాజును శపించాడు. ఇప్పుడు ఎలా అని విచార పడి, కొడుకును మందలించాడు. పరిషత్ మహారాజు చాలా గొప్పవాడని, అది విధి వశాత్తూ జరిగినదే తప్ప మరొకటి కాదని పరిక్షిత్ మహారాజు శాప విషయాన్ని తెలియజేశాడు. ముని శాపానికి పరిక్షిత్ మహారాజు దుఖించాడు. వెంటనే తేరుకొని మునుల సలహా అడిగాడు, గంగా నది తీరాన పాము బారిన పడకుండా, ఒంటి స్తంభం మేడలో ఉండసాగాడు. సరిగా ఏడు రోజులకు ఒక క్రిమిలా పండులో ప్రవేశించి, పరిక్షిత్ మహారాజు వద్దకు చేరాడు. తర్వాత మహా విష సర్పంలా మారి, పరిక్షిత్తు మహారాజును కాటు వేశాడు. అలా తక్షకుడి కాటు చేత రాజు మరణించాడు. తన తండ్రి ఇలా దారుణంగా పాముకాటుకు గురైన సంగతి తెలుసుకున్నాడు జనమే జయ మహారాజు. అక్కడితో భూమి మీద ఉన్న పాములని చంపివేయాలని పంతం పట్టాడు. సర్పయాగం చేశాడు. ఆయాగంలో లక్షల పాములు వచ్చి అగ్నిగుణంలో పడి మరణించాయి. ఇదంతా మహాభారతంలో చెప్పిన కథనం. సర్ప దోషం వలన ఆయనకు కుష్టు వ్యాధి వచ్చింది. ఇందుకు పరిహారంలో భాగంగా వేదమూర్తుల ఆజ్ఞచే 108 శివలింగాలను పవిత్రమైన చోట్లలో ప్రతిష్టించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇలా చేస్తే సర్పదోషం పోతుందని ఋషుల వాక్కు. అలా ఈ క్షేత్రానికి బ్రహ్మగుండ క్షేత్రగా చాలా ప్రసిద్ధిలోకి వచ్చింది.

కలియుగ ప్రారంభంలో జరిగిన ఈ పురాణం ఆధారంగా ఈ క్షేత్రం కలియుగ ప్రారంభంలోనే వెలసిన క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడి స్వామి మహిమలు అశేషం, అందుకే నేటికీ భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు.
ఇక్కడి కొలను దేవతలకు క్రీడా సరస్సు. ధర్మానగదుడు అనే రాజు పరమ దైవ భక్తుడు, కానీ అతనికి సంతానం లేదు. అతని భార్య మహా స్వాధ్వి, సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు, పుణ్యక్షేత్రాలు తిరిగారు. కొన్నాళ్లకు దేవుని వరాన ఇల్లాలు గర్భవతి అయింది. అదేంటో పాపం చివరకు ఆమె కడుపున పాము జన్మించింది. తలరాత తప్పించుకోవడం ఎవరితో కాదని పుట్టిన పాములు చూసి విపరీతంగా ఏడ్చింది. తండ్రి ధర్మాంగదుడు చింతిస్తూనే నాగు పాము అయినంత మాత్రాన తల్లిదండ్రులు సంతానాన్ని చంపుకుంటారా, కడుపున పుట్టిన తర్వాత ఏదైనా సంతానం కాకుండా పోతుందా, అని వారు ఎవరికీ తెలియకుండా పామును కుమారునిగా పెంచసాగారు. ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు ఆ రాజ్యానికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు చాలా జ్ఞాని అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను దర్శించగలరు. ధర్మాంగంలోని సన్యాసి చూశాడు అతని గొప్పతనాన్ని గ్రహించాడు. అతని సంతానాన్ని గూర్చి ఆయనతో చెప్పసాగాడు. అలా కడుపున పాము పుట్టిందని, ఈ విపరీతమేమిటో చెప్పమని కోరాడు. సన్యాసి.. రాజా ఆ పాము రూపంగా ఉన్న నీ బిడ్డ మహాపురుషుడుగా మారగలడు, చింతించవద్దని ఆశీర్వదించారు. కొన్నేళ్ల తర్వాత రాజు పెళ్లికి వచ్చిన తన కుమారుడికి ఒక ఉత్తమురాలితో పెళ్లి జరిపించాడు. ఆమె పేరు సత్యవతి. పూర్వం కత్తికి తలంబ్రాలు పోసే వారిని అంటారు కదా. అలా చేసి రహస్యం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి అయ్యాక ఈ విషయం తెలిసి ఏడ్చింది, అత్తమామలు ఆమెకు సర్ది చెప్పారు. మహా గుణవంతుడై యువకుడిగా మారతాడని అత్తమామలు తెలిపారు. ఇవన్నీ విన్న సత్యవతి ఒక నిర్ణయానికి వచ్చి, ఒక పిట్టలో మెత్తని గుడ్డపర్చి అందులో పాములు పెట్టింది. పెట్టె తలకెత్తుకుని ఎంతమంది చెప్పినా వినకుండా సత్యవతి పామును చూచుకొని ఎంతో దుఃఖించిపోయింది. తలరాతకు దైవాన్ని తిట్టింది, ఎక్కడికెళ్ళినా ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సత్యవతి రాజ్యంలోని అన్ని గుళ్ళు తిరిగింది. గోపురాలు చుట్టింది, అన్ని తీర్థాలలో స్నానాలు చేసింది. పవిత్ర తీర్థాలలో తనతో పాటు మునిగింది. అందరి దేవుళ్లను మొక్కుకున్నది ఒక బ్రహ్మగుండం తప్ప ఆమె పోని క్షేత్రం గానీ, మునుగని తీర్థం గానీ లేదంటే ఆశ్చర్యం లేదు. అన్ని క్షేత్రాలకు ఉత్తమరాలు కాలినడకనే నడిచింది, అయితే ఏ అడవి ముందు గానీ ఆటవికులు గాని భూత-ప్రేశ-పిశాచాలు గానీ ఆమె దగ్గరకు రాలేదు. అలా నెత్తిన పెట్టుకుని ఆ మహాతల్లి తదేకనిష్టతో నడిచి నడచి, కడకు ఇక్కడికి రాగానే ఆమె మనసు కుదుటపడింది. సత్యవతికి ఏదో శుభ శకునాలు అగుపించాయి ఈ బ్రహ్మగుండ క్షేత్రంలో. అంతే ఈ పుణ్యక్షేత్రంలో ఏదో మహిమ ఉందని సత్యవతి పెట్టలో ఉన్న భర్తకు చెప్పింది. ఈ కోనేరులో మునిగి ఆ తర్వాత ఇక్కడ వెలిసిన పరమశివుని ప్రార్థిద్దాం అంది. మాటలు చెబుతున్నంతలోనే ఆమెకు శాంతం అనిపించింది. సత్యవతి తలపై ఉన్న పెట్టెను ఒడ్డున పెట్టి, ఆలయానికి సమీపంలో ఉన్న కోనేరు దగ్గరికి వెళ్ళి.. తండ్రీ పరమశివా ఏమిటయ్యా నాకు ఇంత కష్టం? తల్లి జగన్మాత పార్వతి దేవి మీరు తప్ప కష్టాన్ని తీర్చే వారు ఎవరూ లేరు. నా భర్తను శాప విముక్తిని చెయ్యమ్మా, లోకంలో మా బోటి వాళ్ళ కష్టాలు ఇచ్చే దాతలు దైవాలు మీరుగాక ఇంకెవరు ? కన్నీళ్ళతో ప్రార్థిస్తూ ఆ పుష్కరిణి నీళ్లలోపు దిగింది, నీళ్లు ఎంతో చల్లగా ఉన్నాయి. సత్యవతి ఆశ్చర్యపోయింది. తిరిగి తిరిగి 108 దివ్య తిరుపతిలలో స్నానమాడాను, కానీ ఎక్కడా నా మనసు ఇంకా చల్లబడలేదు కారణం ఏమిటి? అని ఆలోచించింది. ఇంతలో ఆమె ఎడమ కన్ను శుభ సూచికంగా అదిరింది. మహా స్వాధ్వి సత్యవతి కోనేటిలో స్నానం చేసింది. ఆ తర్వాత భర్తను అంటే పామును కూడా చేర్చి కోనేటి నీళ్లలో ముంచింది. మూడుసార్లు బ్రహ్మగుండేశ్వరా! భక్తిగా ఆమె పాముతో పాటు మునిగి పైకి లేచింది. అద్భుతం, ఆమె చేతిలో ఉన్న పాము ఒక అందమైన నవవనంలో ఉన్న పురుషుడిగా మారిపోయింది. ఇంకేముంది పరమాత్సర్యం, పరమానందం. ఆ ఇల్లాలు బ్రహ్మగుండేశ్వరుని కరుణకు మనసులోనే వెయ్యి దండాలు పెట్టింది. యువకుడు నల్లని వెంట్రుకలు, తెల్లని చంద్రబింబం లాంటి ముఖం, విశాలమైన కళ్ళు బాగా ప్రకాశవంతంగా మిసమిసలాడుతున్న ఒళ్ళుతో చాలా అందంగా కోనేరు మధ్యలో నిలబడ్డాడు. ఆ పురుషుని చూడగానే సత్యవతి ఆనందానికి అవధులు లేవు. ఎంత అద్భుతం కదా! అతనే కదా నా భర్త, పదేపదే చూసుకొని మురిసిపోయింది. సత్యవంతున్ని దక్కించుకున్న సావిత్రిగా పరమ ప్రేమతో భర్తను చూసుకుంది. ఆ ఇల్లాలు భర్తతో కలిసి పరుగున వెళ్లి అక్కడ ఉన్న పరమ మహేశ్వరుడైన బ్రహ్మగుండేశ్వరునికి సాష్టాంగ పడింది. తన ఆవేదనంతా స్వామి వారికి చెప్పుకుంది. తండ్రి సాంబశివా! ఇన్ని క్షేత్రాలలోనూ ఇది గొప్ప క్షేత్రం కనుక్కునే కదా నా భర్త శాపం విముక్తి ఇక్కడ కలిగినది నీవేనయ్యా దయామూర్తి. అప్పుడే సప్త రుషులు ఈమె ముందు నిలబడ్డారు. సత్యవతి దంపతులు వారికి నమస్కరించారు. శుభమంటూ దీవించారు. అప్పుడు సప్త ఋషులు ఇలా అన్నారు.. అమ్మా పూర్వం ఒక ముని కన్య సర్వ గుణ సంపన్నుడైన ఒక బ్రహ్మచారిని చూసి ఇష్టపడింది, పెళ్లాడమని కోరింది. అప్పుడు ఆమెను ఇష్టపడ్డట్టే కనిపించాడు కానీ ఎందుకో పెళ్లికి మాత్రం అంగీకరించక కాలం వెళ్లబుచ్చసాగాడు. దాంతో ఆమెకు కోపంతో అతన్ని శపించింది. నన్ను అనవసరంగా శపించావు కాబట్టి ఇందుకు ప్రతిగా నీవు కూడా మరుజన్మలో నా వెంటే ఉంటావు చాలాకాలం దుఃఖాలపాలవుతావు పొమ్మని అన్నాడు. ఇలా వారిద్దరూ ఒకరికొకరు శపించుకున్నారు. ఆ యువకుడే ఈ పాము, ఈ వనకన్య ఎవరో కాదు నీవే అని వాస్తవాన్ని వివరించారు. ఇది లోకంలో అందరికీ తెలుస్తుంది, ధైర్యంగా ఉండమని చెప్పి వాళ్లు అదృశ్యమయ్యారు. ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా వారి నగరానికి వెళ్లిపోయారు. వారిని చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రాన్ని చూసినా, విన్నా, చెప్పినా, చదివినా పరిహారం పొంది సంపదలు పొందగలరని పండితులు ఇప్పటికీ చెబుతున్నారు. ఇది ఈ బ్రహ్మగుండం క్షేత్ర స్థల పురాణం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News