Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Bathukamma state festival: తెలంగాణ కొండ గురుతు- బతుకమ్మ

Bathukamma state festival: తెలంగాణ కొండ గురుతు- బతుకమ్మ

బతుకమ్మ ఓ పూల జాతర, ఓ పాటల జాతర

తరతరాల ఆచారాలను ఒకరి నుండి ఒకరికి అం దిస్తూ ఒక ప్రత్యేక సందర్భంలో చేసేవే పండుగలు. ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రత్యేకంగా అన్నింటికంటే పెద్ద పండుగ బతుకమ్మ.
తెలంగాణ ప్రజల ఆశకు, యాసకు, భాషకు, మాండ లికానికి బతుకమ్మ పాట వేదిక. ప్రకృతి శక్తిని ఆవిష్కరించే వేదిక. భారతీయులంతా సాంప్రదాయ పూజ పద్ధతిలో దేవుళ్లను పూలతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పువ్వుల్లోనే దేవతను దర్శిస్తారు. ఇక్కడ పువ్వే దేవతా రూపం పొంది బతుకమ్మ అయింది.
బతుకు+ అమ్మా బతుకమ్మ, బ్రతుకునిచ్చే అమ్మ గనుక బతుకమ్మ అయ్యింది. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఒక దానివెంట ఒకటి జరుపుకునే పండుగలు. భాద్రపద బహుళ పంచమి నుండి మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. బొడ్డెమ్మ అంటే బొట్టె, బొడప, బొటిమ, పొట్టి అనే అర్ధాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. బొడ్డెమ్మ అంటే ధాన్యపు రాశి, ధాన్యపు కుప్ప అని కూడా అంటారు.
మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు జరుపుకునే పండుగ బతుకమ్మ. పెళ్లి కావలసిన పిల్లలు బొడ్డెమ్మను ఆడి తే… సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తయిదువలు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ. సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని ఇంత స్పష్టంగా చెప్పిన పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ స్త్రీల హృదయమే బతుకమ్మ. పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లిన చిన్ననాటి జ్ఞాపకాలను కలకాలం పదిలంగా దాచిపెట్టి పండుగ బతు కమ్మ. బతుకమ్మ గురించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
బతుకమ్మ నేపథ్యం
చోళరాజు దంపతులైన ధర్మాంగుడు, సత్యవతిలకు నూరుమంది కొడుకులు. వారంతా యుద్ధంలో చనిపోయారు. దుఃఖంలో ఉన్న ఆ దంపతులు మళ్లీ సంతానం కావాలని లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగగా ఆమెను తమ బిడ్డగా పుట్టమని కోరుకుంటుంది. వారి కోరిక ప్రకారం లక్ష్మీదేవి వారి బిడ్డగా పుడుతుంది. ఆ సమయానికి అత్రి, వశిష్ట, కశ్యప, అంగీరస మహామునులు వచ్చి ఆ బిడ్డను బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు. ఆ విధంగా లక్ష్మీదేవి బతుకమ్మగా పెరిగి పెద్దదై చక్రాంగుడనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్లాడుతుంది. కోరిన వారందరికీ సంతానం సిరిసంపదలను ప్రసాదిస్తూ అనేక వేల ఏండ్లుగా లక్ష్మీదేవియే బతుకమ్మగా పూజలందుకుంటుంది అని ఒక కథ ప్రచారంలో ఉంది.
మహిషాసురునితో యుద్ధం చేసి అతన్ని చంపి అలసిపోయిన పార్వతీ దేవి స్పృహ కోల్పోతుంది. ఆమె ప్రాణాలను కోల్పోతుందేమోనని స్త్రీలందరూ దేవిని చుట్టుముట్టి బతుకమ్మ….. బతుకమ్మ…. అని ప్రార్ధిస్తుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు స్పృహ కోల్పోయిన దేవి దశమి రోజున స్పృహలోకి వస్తుంది. ఆనాటి నుండి పార్వతీదేవిని బతుకమ్మగా తొమ్మిది రోజులు పాటల్లో కీర్తిస్తూ పండుగ జరుపుకున్నట్లు ఒక కథ ప్రచారంలో ఉన్నది.
ఒక కాపు రైతుకు ఒక కొడుకు ఆరుగురు బిడ్డలు పుట్టి చనిపోయారు. ఏడవ బిడ్డగా పుట్టిన బిడ్డను నీవైనా బతుకమ్మ…. బతుకు… అని పెద్దలందరూ ఆశీర్వదించారు. ఆమె పెరిగి పెద్దైన తర్వాత ఒకరోజు వదిన ఆడపడుచులు చెరువుకు స్నానానికి వెళ్లారు, అక్కడ వారి బట్టలు ఒకరివి ఒకరికి తారుమారైపోతాయి. నా బట్టలు నీవెందుకు కట్టుకున్నావని వదిన ఆడపడుచును గొంతు నులిమి చంపి, చెరువు గట్టున పాతి పెడుతుంది. ఎక్కడ వెతికినా బతుకమ్మ దొరకలేదు, తన తండ్రికి ఆమె కలలో కనిపించి వదిన తనను చంపి చెరువు గట్టున పాతిపెట్టిందని ఆమె తంగేడు చెట్టుగా వెలిసినానని చెప్పింది. ఆమెను పాతిపెట్టిన ప్రదేశంలో తంగేడు చెట్టు మొలచి విరగ బూసింది. తండ్రి దుఃఖాన్ని తీర్చడానికి తన పువ్వుతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చుకొని ఆడుకోవాలని చెప్పింది. ఆమె కోరిక ప్రకారమే బతుకమ్మ వెలిసిందని ఒక ఐతిహ్యం.
యోధానుయోధులు అయినా ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క చెల్లెలు, ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వదినలకు ఆమె అంటే కోపం. అన్నలు అంతా వేటకు పోయి చాలా రోజుల వరకు తిరిగి రాలేదు, వదినలు ఆడబిడ్డకు ఇంటి పనులు బయటి పనులు అన్నీ చెబుతూ వారికి లొంగి ఉండాలని భయపెట్టేవారు. ఈ బాధలన్నీ భరించలేక ఊరి చివర ఉన్న బావిలో పడి చనిపోతుంది. ఆ బావిలో ఆమె తామర పువ్వుగా ఉద్భవిస్తుంది. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్నలు చెల్లెలి కోసం వెతికి వెతికి అలసిపోయి, ఆ బావి వద్ద కూర్చొని చర్చించుకుంటారు. వారికి దాహం వేయగా బావిలోకి దిగి నీళ్లు తాగుదామని చూడగా వారికి పెద్ద తామర పువ్వు కనిపించింది, ఎన్నడూ లేనిది ఈ బావిలో ఈ తామర పువ్వు ఏమిటి?? అనుకునేలోపే అది అన్నలను చూసి ఒడ్డుకు వస్తుంది. పట్టుకోబోతే ఆ పువ్వు దూరం పోతుంది. ఇది మన చెల్లెలు కావచ్చు, మనలను చూసి కలుగుతుంది అని అనుకొని ఆ బావి గట్టున కూర్చొని ఉండగా, అప్పుడు అటు దిక్కు ఆరాజ్య మేలే రాజు నీళ్లు తాగుదామని మెట్ల ద్వారా ఆ బావిలోకి దిగుతాడు. ఆరాజును చూసి పువ్వు దగ్గరకు వస్తుంది. దాన్ని చేతులకు తీసుకొని చూసి తన రాజభవనాన్ని ఆనుకొని ఉన్న కొలనులో వేస్తాడు. అప్పుడు అక్కడున్న మిగతా తామరపూలతో మాట్లాడుతుంది. తనను తీసుకుపోను దేవుడు వస్తాడని, దేవుడే తనను వివాహం చేసుకుంటాడని చెప్తుంది. కొలను చుట్టూ తంగేడు చెట్లు ఉన్నాయి. కొంతకాలానికి విష్ణు మూర్తి వస్తాడు తామర పువ్వును మనిషిగా చేసి ఆమెను వివాహమాడతాడు, ఆమెయే లక్ష్మీదేవి….. లక్ష్మీదేవియే గౌరమ్మ. రాజు కొలువులో వివాహమాడి దేవతా లోకానికి తీసుకుని పోతాడు. జానపదులు ఈ కథను యాది చేసుకుంటూ ప్రతి ఏడు దసరా పండుగకు ముందు తొమ్మిది రోజులు తంగేడు పువ్వుతో బతుకమ్మను పేర్చి ఆడుతూ…. పాడుతూ…. పూజలు చేస్తారు. ఇది జనంలో ఉన్న ప్రచారం లోని కథ.
సమస్త దేవతల సమాహార రూపమే ఆదిశక్తి
అని నమ్మిన జానపదులు ఆమెను గౌరీదేవిగా, లక్ష్మీ గా, సరస్వతిగా, భావించి ప్రార్థిస్తారు. గౌరీ దేవి జానపదుల బతుకమ్మలో పసుపు ముద్ద రూపంలో ‘పసుపు గౌరమ్మ‘ అయింది ప్రతి పూజ, ఆరాధనలో పసుపు కుంకుమలు స్త్రీల ప్రాణశక్తిని మరింత ఇనుమడింప చేస్తాయి. స్త్రీలంతా బతుకమ్మలతో చెరువు గట్టు మీద చేరి ఒకే రీతి కంఠస్వరంతో తమ తమ జీవితానుభవాలను అనుభూతులను పౌరాణిక గాధలను తాను విన్నా.. చూసిన సంఘటనలను పాటల్లో వర్ణిస్తూ లయబద్ధంగా పాడుతారు. ఇందులో శివపార్వతుల పాటలు రాముని కృష్ణుని పాటలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి.
అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు అత్తవారింట్లో మెలగవలసిన పద్ధతులను బోధించేవిగా ఉంటాయి. స్త్రీలు మాతృత్వాన్ని ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. సంతానం కోసం నోములు వ్రతాలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ఆహార నియమాలు కూడా ఈ పాటల్లో వ్యక్తమవుతాయి.
ఒకటవ మాసం నెలతన గర్భిణి- ఓనగాయ కోరే చెలియా
రెండవ మాసం నెలతన గర్భిణి- రేగుపండ్లు కోరే చెలియా
గర్భిణి స్త్రీలు ఇష్టంగా తినే ప్రకృతి సిద్ధమైన ఆహారాలను తెలియజేస్తుంది.
బతుకమ్మను పూల తోట ఎందుకు జరుపుకుంటారు అనే విషయంలో మరో కోణం కూడా వినిపిస్తుంది. పుష్పం పునరుత్పత్తికి ప్రతీక ప్రకృతి స్త్రీకి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి, ఈ కారణం చేతనే పూలను బతుకమ్మగా పేరుస్తారు. బతుకమ్మలో ప్రతి పువ్వుకు విశిష్టత ఉంది. కానీ తంగేడు పూలకు రంగు రంగుల పూలేవి సాటి రావు. తంగేడు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా విరబూస్తుంది. తమ సంతానం మరియు సంసారం కూడా అట్లా పచ్చగా పుష్టిగా ఉండాలనే కోరికతో తంగేడు పువ్వు బతుకమ్మలో ప్రత్యేకతను సంతరించుకున్నది. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడంలో స్త్రీల కళా నైపుణ్యం వ్యక్తమ వుతున్నట్లు మరే పండుగలోను వ్యక్తం కాదు.
శిష్టులైన వారు మామూలుగా వాసనలేని పూలను దేవుని పూజకు వాడరు. కానీ జానపదులు ప్రకృతిలో పుట్టి పెరిగిన వారు కాబట్టి ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును బతుకమ్మను పేర్చడం కోసం ఉపయోగిస్తారు. గుమ్మడి, కట్ల, కాకర,గన్నేరు, పొట్ల, పొగడ, రుద్రాక్ష, తంగేడు, గురివింద, గోరింట, మల్లె, బంతి, చామంతి, గునుగు, శంకు ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మ పేరుస్తారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం. ఇంకా చెరువుల్లో కుంటల్లో ఉన్న నీటిని శుభ్ర పరచడానికి ఒక ఆయుర్వేద ఔషధంగా కూడా ఈ పూలన్నీ ఉపయోగపడుతాయి.
బతుకమ్మకు భూమితో కూడా సంబంధం ఉంది
తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి వరకు మెట్ట పంటలన్నీ ఇళ్లకు చేరుకుంటాయి. ధాన్యలక్ష్మి ఇంట్లో కళకళలాడుతుంది. కొత్త పంటలను దైవానికి అర్పించడానికి తొమ్మిది రోజులు రోజుకో ధాన్యంతో పిండి వంటలు చేసి దైవానికి అర్పిస్తారు వీటిని సద్దులు అంటారు. బతుకమ్మకు వీటిని సమర్పిస్తారు కాబట్టి అది సద్దుల బతుకమ్మ అయింది. ఎంత పేదవారైనా బతుకమ్మ పండుగకు తమ కూతుళ్లను అత్తారింటి నుండి తమ ఇంటికి తీసుకు వస్తారు. వారికి చీర సారెలు పెట్టి కుటుంబమంతా ఈ పండుగ సంబురంలో మమేకమై సంతోషాన్ని పంచుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు బతుకమ్మ. ఇందులో పాటలకే ప్రాధాన్యత. నీ భాషలోనే నీ బతుకుతున్నది. అన్న కాళోజీ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలు తిరిగి బతుకమ్మ పాటలు సేకరించి 108 పాటలతో పూల జాతర పేరుతో బతుకమ్మ పాటల పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఇందులో కొన్ని పాటలు సేకరించినవి, కొన్ని నేను సొంతంగా రాసినవి, కొన్నింటికి సాహిత్య పరమైన మార్పులు చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలకు అపర సంజీవని పూలు జాతర బతుకమ్మ పాటల పుస్తకం.
కొమ్మాల సంధ్య
తెలుగు అధ్యాపకురాలు

  • 9154068272
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News