Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Cast you vote: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకో

Cast you vote: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకో

ఏ పార్టీ వాడని కాదు ఏ పాటివాడో చూసి ఓటేయండి

భారత దేశం బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత జాతీయ నాయకులు దేశ పరిస్థితులను దృష్టిలో వుంచకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంపిక చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాది.. ఓటు హక్కు, ఓటు విలువ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన చైతన్యం కలిగించి ఓటర్లతో సదస్సులు కళాశాల విద్యార్థులు యువతతో ర్యాలీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల అక్షరాస్యత’ అనే నినాదంతో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్‌ నిర్వహించింది.
భారత్‌ రాజ్యాంగం 326 ఆర్టికల్‌ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కలిపించి ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది.
అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్‌ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఓటు హక్కు అందరికీ వజ్రాయుధం అయింది. ప్రభుత్వాల ఏర్పాటులో ఓటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఓటు సామాన్యుని గొంతుకైంది. ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఓటర్లకు సంక్రమించింది. ఓటు హక్కు ద్వారా ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కలిగి ఉన్నాడు. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం వుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో సార్వభౌమాధికారం వుంటుంది. ఓటు హక్కు ద్వారా 5 ఏళ్ళకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తారు.
ప్రజలే ప్రభువులు అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్‌ అభిప్రాయం ప్రకారం ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని నిర్వచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటే పునాది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర ప్రతిపత్తి తో పనిచేస్తూ ఓటరు నమోదు ఓటరు జాబితా తయారు దేశములో చట్టసభల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల్లో ఓటర్లు అందరూ విథిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ఓటు హక్కు నిర్లక్ష్యం దేశంలో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించారు. 2019 నాటికి 17వ లోకసభ ఎన్నికల్లో67 శాతం మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 90 శాతం ఓటింగ్‌ జరిగితే దేశం అభివృధి పథంలో పురోగమిస్తందన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వ్యాఖ్య ఓటర్లకు కనువిప్పు కావాలి.
యువత దేశ భవిత, దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలి యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు వేయడంపై ఆసక్తి చూపడం లేదు. సాధారణ ఎన్నికల్లో యువత ఓటింగ్‌ శాతం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో తక్కువ వుంటుంది. పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు ఓటింగ్‌ పై ఆసక్తి చూపడం లేదు. ఓటింగ్‌ రోజును సెలవు దినంగా పాటిస్తూ విహార యాత్రలకు వెళ్తున్నారు.
నోటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు ప్రజాస్వామ్యానికి ఓటు ఆయుధం. ఓటరు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ రాజకీయ పార్టీలు ఓటును అంగడి సరుకుగా మార్చాయి. డబ్బు, మద్యం వివిధ ప్రలోభాలకు ఓటును అమ్ముకునే నోటుకు ఓటు సంస్కృతి పెరిగి ప్రజాస్వామ్యానికి చేటుగా పరిణమించింది. రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓటు వేయించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు హామీల హోరులో హర్రసు పాట పాడుతూ ఓటర్లను హైరానాకు గురిచేస్తూ ఓటు బ్యాంకుగా వాడుకొని ఎన్నికల్లో గెలిచి అధికార దాహంతో రాజకీయాలను వాణిజ్యపరం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన దాని కంటే ఎన్నికల వ్యయం చేస్తున్న రాజకీయ పార్టీల మీద నియంత్రణ లేదు. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతంగా పరిణమించాయి.
ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ప్రజాసంక్షేమం కుంటుపడుతుంది. దేశ భవిష్యత్తు నాయకుల చేతుల్లో వుంటుంది. ఆ నాయకుల తలరాత మార్చేది ఓటు కాళోజీ అన్నట్లు ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పాటివాడో చూడాలి ప్రజలకు ఇప్పటివరకు ఏమిచేశాడో గమనించి నేరచరిత లేని నిజాయితీ వంతులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకొని అవినీతి రహిత’ నేరరహిత రాజకీయ వ్యవస్థకు ఓటర్లు ఉద్యమించాలి.
దేశ భవిష్యత్తు, అభివృద్ధి ప్రభుత్వాల మార్పుకు ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వం నిర్బంధ ఓటింగ్‌ విధానాన్ని అమలు చెయ్యాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో చూయిస్తున్న శ్రధ్ధకంటే ఎక్కువగా ఓటింగ్‌ హక్కు వినియోగం ఈవిఎంల ఉపయోగం ఎన్నికల విధానం ఎన్నికల అక్షరాస్యత మీద దృష్టి పెట్టాలి. రాజకీయ పార్టీలు యువత విభాగం ఆధ్వర్యంలో ఓటు నమోదు ఓటరు గుర్తింపు ఆధార్‌ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం దొంగ ఓటర్ల గుర్తింపు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి. ఎన్నికల అక్షరాస్యత పరివ్యాప్తికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఓటింగ్‌ శాతం పెంచడానికి కృషి చెయ్యాలి.
ప్రభుత్వం నిర్బంధ ఓటు హక్కును కలిపించాలి
ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ పౌరసమాజం యువత మహిళా సంఘాలు స్వచ్చంద సామాజిక సేవా సంస్థలు ఓటు హక్కు వినియోగంపై అవగాహన చైతన్యం కలిగించాలి. కళాశాలల్లో ఓటు హక్కు వినియోగం మీద సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనల ద్వారా ఓటర్లను చైతన్య పరచాలి. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసి ఎన్నుకుంటానని ప్రతిజ్ఞ చెయ్యాలి. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. భారత రాజ్యాంగ పిత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు భారత దేశం చారిత్రకంగా వెనుకబడిన వర్గాలు దళితులు, ఆదివాసీలు, తాడితులు, పీడిత వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందటానికి ఓటు హక్కు ముఖ్యమైన మార్గం అని పేర్కొ న్నారు. ప్రతి ఓటరు ఓటు విలువ తెలుసుకొని ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ప్రజల సామాజిక బాధ్యత. ఓటరుగా వున్నందుకు గర్వపడుతున్న ఓటు వేయడానికి సిద్ధంగా వున్న అనేది నినాదం కాకుండా ఓటర్ల విధానంగా వర్ధిల్లాలి ఓటు వేద్దాం ప్రజాస్వామ్య పరిపుష్టికి పాటుపడుదాం అని ఓటర్లు ప్రతిజ్ఞ చేయాలి.

  • నేదునూరి కనకయ్య
    9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News