Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Beyond politics: కేంద్ర, రాష్ట్ర సంబంధాలు రాజకీయాలకు అతీతం

Beyond politics: కేంద్ర, రాష్ట్ర సంబంధాలు రాజకీయాలకు అతీతం

కేంద్ర సహకారం తప్పనిసరి అని పాలకులు గుర్తించాల్సిందే

మర్యాదపూర్వక సంప్రదాయాన్ని పునరుద్దరించిన తెలంగాణ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతం తమ ప్రభు త్వం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో సారి రుజువు చేశాడు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాళల్లోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్టాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే తరహాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలుసుకొని తెలంగాణను ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్జప్తి చేశారు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడాలనే ఆకాంక్షతో పాటు పరిపాలనలో వ్యక్తిగత, రాజకీయ వైశమ్యాలకు తావివ్వరాదనే సంకేతాలను ముఖ్యమంత్రి తన ఆలోచన సరళితో రుజువు చేశారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొర పాట్లను సరిచేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. గత పాలకుల చర్యల కారణంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి.
కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంతో తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోయింది. ఫలితంగా అభివృద్ది కుంటుపడింది. సంక్షేమ రంగం కుదేలయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు జరపాల్పిన కార్యక్రమాలు, పథకాలు అటకెక్కాయి. కేంద్రం సహాయం అందిస్తామని ముందు కొచ్చినా వద్దుపో అనే ధోరణిని అవలంభించడంతో రాజకీయ వైరం పెరిగింది. వైశమ్యాలు బలపడి చివరికి ప్రోటోకాల్‌ నిబంధనలను కూడా తుంగలో తొక్కిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు.
గవర్నర్‌తో కయ్యం, ప్రధానమంత్రితో వైరం లాంటి వైఖరి ఇక ముందు ఉండరాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడాలని కోరుకుంటుంది. రాజకీయంగా సిద్దాంతపరంగా ఉన్న విబేధాలు పాలనాపరంగా జరిగే అభివృద్ధి సంక్షేమానిక అడ్డుగా పరిణమించరాదని భావించింది.
అందుకే ఒకడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు ఉన్న వైరం కొనసాగించరాదని నిర్ణయించుకుంది. మర్యాదలు, సహాయ సహకారాలు, అభివృద్ది, సంక్షేమ పథకాలను కలిసికట్టుగా అమలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి దివాళా దిశగా పయనిస్తుందనే ఆందోళనను ప్రధానమంత్రి దృష్టికి తెచ్చింది.
కేంద్రం ఆర్దిక సహాయం అందించి ఆదుకోవాలని కోరింది. కేంద్రం నుండి వచ్చే నిధులకు కోత విధించరాదని విజ్జప్తి చేసింది. ఈ పరిణామాలను రాష్ట్రంలోని అభివృద్ధి కాముకులు స్వాగతిస్తున్నారు. శుభపరిణామం అని అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలుసుకోవడం శుభపరిణామంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యమకారులు కూడా ఈ చర్యలను స్వాగతిస్తు న్నారు. నీళ్లు నిధులు నియామకాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర సహకారం ఎంతగానో అవసరం అని అంటున్నారు.
విభజన చట్టంలోని హామీలను సాధించడానికి ఇదో మంచి పరిణామం అని పేర్కొంటున్నారు. కేంద్రంతో సఖ్యత లోపించడంతో విభజన హామీలు అమలుకు నోచుకోలేదన్నది జగమెరిగిన సత్యం.
ఇక మీదట అలాంటి సమస్య ఉత్పన్నం కారాదన్నది ఇప్పటి ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు కేంద్రంతో సఖ్యతతో కూడిన మెరుగైన సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించవలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నప్పటికీ తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేక పోయారు. బయ్యారంలో ఉక్క కర్మాగారం ఏర్పాటు కూడా పునర్విభజన చట్టంలో పొందు పర్చబడి ఉంది. కేంద్రంతో వైరం కారణంగా గత ప్రభుత్వం ఈ రెండు కీలకమైన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమైంది.
కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్దరణ, ఐఐఎం ఏర్పాటు అంశాల్లో కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉంది. వాటన్నింటిని సాధించాలంటే కేంద్రంతో సక్యత అత్యంత ఆవశ్యకం. వీటికి తోడు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 2,233 కోట్లు, పెండింగ్‌ గ్రాంట్లు మరో 1800 కోట్లు కేంద్రం నుండి రావలసి ఉంది. వీటితో పాటు కేంద్ర సహాయంతో ఇంకెన్నో సాధించుకొనే అవకాశం ఉంది.
అందుకే రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి ప్రభు త్వం ముందుకు సాగాలని ఉద్యమకారులు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను స్వాగతించాలన్నా, మౌలిక సదుపాయాలను విస్తరించాలన్నా, జాతీయ ప్రాజెక్టులను సాధించాలన్నా కేంద్ర సహకారం తప్పనిసరి. రాజ్యాంగబద్దంగా ఏర్ప డిన ప్రభుత్వాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలు బలంగా ఉంటేనే అభివృద్ది సంక్షేమం సమ పాళ్లలో ముందుకు సాగుతుందనే నానుడి నుండి గత ప్రభుత్వం పాఠాలు నేర్చుకోని కారణంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
ఇక మీదట అలాంటి పరిస్ధితి ఉత్పన్నం కారాదని జనమంతా కోరుకుంటున్నారు. వ్యక్తి స్వార్ధంతో కూడిన అభివృద్ది కంటే కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేసే అభివృద్ది సంక్షేమం అత్యంత కీలకం. నిరుద్యోగం సమస్య సమసిపోవాలన్నా, వ్యవసాయ రంగం మరింత ముందుకు సాగాలన్నా, పారిశ్రామిక ప్రగతి సాధించాలన్నా, పేదరికాన్ని నిర్మూలించాలన్నా సమాజ శ్రేయస్సు దృష్యా చేసే ఆలోచనలతో సాగించే ఆచరణాత్మక కార్యాచరణ అత్యం ఆవశ్యకం. ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందకు సాగాలని ఆశిద్దాం.
తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు, నిర్బంధాలు కొత్తేమీ కాదు. పాలకుల పనితీరును బేరీజు వేయడంలో దిట్ట. ఎలాంటి ప్రలోభాలకు లొంగని మనస్ధత్యం మన ప్రజలది. అందుకే పాలకులు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించినంత కాలమే మనుగడ సాగించగలరు. ప్రజల మెప్పు పొందలేని నాడు తీర్పు ఎలా ఉంటుందో ఇటీవలి ఎన్నికలే ప్రత్యక్ష్య తార్కాణం. కేంద్ర రాష్ట్ర పాలనా పరమైన సంబంధాల్లో రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగతక వైశమ్యాలకు తావుండరాదనే రాజ్యాంగ మూల సూత్రాన్ని పాటించి పాలకులు ముందుకు సాగాలని ఆశిద్దాం.

  • కొలను వెంకటేశ్వర రెడ్డి
    ఎస్పీ జైళ్లు (రిటైర్డ్‌ కన్వీనర్‌)
    తెలంగాణ యూనిఫాం సర్వీసెస్‌ జేఏసీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News