Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Dogs a big menace: గ్రామాల్లో, పట్టణాలలో శునకాల బెడద

Dogs a big menace: గ్రామాల్లో, పట్టణాలలో శునకాల బెడద

గ్రామ సింహాలుగా పేరు తెచ్చుకున్న వీధి కుక్కలు రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఒంటరిగా వున్న పిల్లల భరతం పడుతూన్నాయి. గతంలో అంబర్‌ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు ఏళ్ల బాలుడు ప్రదీప్‌ మృత్యువాత పడడం సంచలనం సృష్టించింది. కాజీపేటలో కూడా కుక్కల దాడికి బాలుడు మృత్యువాత పడ్డాడు..కుక్కలను చూసి భయపడి పరుగెత్తిన బాలుడిని మరీ వెంటపడి కొరికి చంపాయి. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో 10 సంవత్సరాల బాలిక కుక్కల దాడిలో చనిపోయింది. 2020 న ఆగస్ట్‌ నెలలో లంగర్‌ హౌస్‌లో ఆరుగురు చిన్నారులను కుక్కలు విచక్షణారహితంగా కరిచాయి.

- Advertisement -

ఇలా రాజధాని మాత్రమే కాక వరంగల్‌ నగరంలో పట్టపగలు 10 మంది మీద వేరు వేరు ప్రదేశాలలో కరిచి గాయాలపాలు చేశాయి. ప్రతీ రోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు ఎన్నో జరుగుతూవున్నాయి. సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 15 లక్షల కుక్కలు వున్నట్లు తెలుస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఒక్కో శునకం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం 2000 ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో శునకాల బెడద తీవ్రంగా ఉంది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో గ్రామ సింహాలు అనగా శునకాలు సంచరిస్తూ ఆ గ్రామ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి.

పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో వాటి సంతతిని రెట్టింపు చేసుకుంటూ గ్రామ ప్రజల జనాభాతో సరి సమానంగా శునకాల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా గ్రామాల, పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న పిల్లలు ఇంటి నుండి బయటకు రావాలన్నా, పాఠశాల విద్యార్థులు ఇళ్ల నుండి పాఠశాలకు రావాలన్న ఈ శునకాల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శునకాల కాటుకు అనేకమంది బలైయి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు శునకాల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవేవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. గ్రామాల్లో ప్రజలు శునకాల దాటికి తట్టుకోలేక చేతిలో కర్రలు పట్టుకొని తిరిగే పరిస్థితి దాపురించింది. గ్రామంలో ఒక వీధి నుండి మరొక వీధికి నడుచుకుంటూ వెళుతున్న వ్యవసాయదారులు, వివిధ పనుల నిమిత్తం వెళుతున్న వారిని వెనుక నుండి వచ్చి వారి మీద దాడి చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు మాత్రం కుక్కల భయానికి బయటికి రావడం లేదు. రాత్రి వేళలో మాత్రం ఒక ప్రదేశంలో గుంపుగా చేరి విపరీతమైన శబ్దాలతో అరుస్తూ ఆయా గ్రామ ప్రజలకు నిద్ర భంగం కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు రహదారుల మీద వెళుతుంటే వారిని వెంబడించి కూడా కరుస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఆ భయానికి వాహనదారులు ద్విచక్ర వాహనాలను వదిలి ప్రమాదాలకు గురవుతూ వున్నారు. అనేక శునకాలకు పిచ్చి కుదిరి అరవడం, పిక్క పట్టి లాగడం చేస్తూ వున్నాయి. గ్రామాలలో ఈ శునకాలు ఇళ్లలోకి రావడం, వంట పాత్రల మూతలు తీసి వండిన ఆహార పదార్థాలను ఆరగించడం, పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండి మొరగడం చేస్తూ ఉన్నాయి.

గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ కార్పొరేషన్‌ సిబ్బంది ఆయా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలలో శునకాలకు టీకాలు వేయించి లేదా వాటి సంతతి ఉత్పత్తి కాకుండా వీనికి శస్త్ర చికిత్సలు చేయాలని శునకాల బారినుండి ఆయా గ్రామాల ప్రజలను పట్టణ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వము మీద, అధికారుల మీద ఎంతైనా ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, కార్పొరేషన్‌ లలో కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న. కుక్కల నియంత్రణకు స్టేరిలైజేషన్‌ చేయాలి. తల్లి దండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. అంబర్‌ పేట, కాజీపేట లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మనవి.

  • కామిడి సతీశ్‌ రెడ్డి
    తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
    9848445134
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News