Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Drugs seizing: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా

Drugs seizing: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా

మాదక ద్రవ్యాల వినియోయాగంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది

ముప్పై కోట్ల విలువైన 3.32 కిలోల బ్లాక్‌ కోకైన్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో 15 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత, కొకైన్‌ తో సినీ నిర్మాత అరెస్ట్‌, హిందూ మహాసముద్రంలో 25, 000 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ స్వాధీనం…ఇటువంటి వార్తలు ఈ మధ్యన తరుచుగా వింటున్నాం. అంటే వీటి విలువ ఎంత ఉంటుందో ఇట్టే ఊహించ్చొచ్చు. ఇవ్వన్నీ అక్రమ మార్గాలలో తరలిస్తున్న మాదక ద్రవ్యాలే…!
గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ ఫెటామైన్‌) వంటి వాటిని మాదక ద్రవ్యాలు అంటారు. ఇవి సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. వీటిలో కొన్నింటిని వాసన చూడం ద్వారా, మాత్రల రూపంలో కొన్ని, ఇంజెక్షన్‌ మార్గంలో మరికొన్ని తీసుకుంటారు. ఎక్కువ శాతం సంపన్న వర్గాల యువత వీటిని తీసుకుంటారు. ఎందుకంటే ఇవి అత్యంత ఖరీదైనవి.
పేర్లు ఏవైనా ఇవన్నీ మెదడుపై, కేంద్ర నాడీ వ్యవ స్థపైన ఉద్దీపన కలిగించి తక్షణ ప్రభావం చూపించిన కొద్దిసేపు మత్తులో తేలియాడిస్తాయి. ఈ మత్తులో వీరు ఏమి చేస్తారో వారికే తెలియదు. ఇవి సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి గురవుతారు. వారితో పాటుగా ఎదురుగా వస్తున్న వాహనాలకు గానీ లేదా పాదాచారులకి కూడా ప్రమాదం కలిగించవచ్చు. మత్తులో అత్యాచారాలు, కూడా చెయ్యడానికి వెనుకాడరు. మొదట్లో సరదాగా తీసుకున్న వారు కొంతమందైతే, కుటుంబ సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం వలన ఇంకొంత మంది తీసుకుంటారు. కొద్దిమంది జన్యుపరమైన సమస్యలు వలన కూడా వీటికి అలవాటు పడతారు. కొన్ని రోజుల తరువాత ఇవి లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్యలు చేసుకొంటారు. ఇంకో కోణంలో విశ్లేషిస్తే ఇవి చాలా ఖరీదు. కొనడానికి తగినంత సొమ్ములు లేకపోవడం వలన ఇంట్లో దొంగతనానికి పాల్పడతారు. లేదా ఇతర అరాచక పనులు చేసే వీలుంది. రౌడీలుగా, గూండాలుగా మారే అవకాశం ఉంది.
ఆరోగ్య సమస్యలు
ఊపిరతిత్తులు, కాలేయం, గుండె, మెదడు, పని తీరులో మార్పు వస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోతాడు. చేసే పని మీద ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి విభాగం ఈ మధ్యన వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌ (ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక ) 2022 ని విడుదల చేసింది. దీనిలో నివేదించిన వివరాల ప్రకారం
పెద్దలకంటే యువకులే ఎక్కువ వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీటిని వినినియోగించే యువకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. స్త్రీల కంటే పురుషులే ఎక్కువ తీసుకుంటున్నా, కొన్ని రకాల మాదక ద్రవ్యాల వినియోయాగంలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఓపియాయిడ్స్‌, కొకైన్‌, గంజాయి తీసుకుంటున్న వారిలో పురుషుల వాటా వరుసగా 85 శాతం, 73 శాతం, 70 శాతం ఉండగా మిగిలిన వాటా స్త్రీలు తీసుకుంటున్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 15-64 ఏళ్ల వయస్సు గల 284 మిలియన్ల మంది డ్రగ్స్‌ను ఉపయోగించారు. ఇది గత దశాబ్దంలో 26% పెరిగింది.

- Advertisement -


యువత ఎక్కువగా డ్రగ్స్‌ వాడుతున్నారు. చాలా దేశాల్లో మునుపటి తరాలతో పోలిస్తే వినియోగస్థాయి ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలు సాధారణంగా నాలుగు రకాల అక్రమ మాదక ద్రవ్యాల సమూహాలపై దృష్టి పెడతాయి: ఓపియాయిడ్లు, కొకైన్‌, యాంఫేట మిన్లు మరియు గంజాయి. 2020 సం. మొత్తం జనాభాలో 4 శాతం (209 మిలియన్లు) మంది గంజాయిని, 1.2 శాతం (61 మి లియన్లు) ఓపియాయిడ్లను, 0.4 శాతం (21.5 మిలి యన్లు) కొకైన్‌ని, 0.7 శాతం (34 మిలియన్లు) ఎటీ ఎస్‌ డ్రగ్‌ని, తీసుకున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో మన దేశంలో ఎంత మంది వీటికి లోన వుతున్నారో పొందుపరచపోనప్పటికీ 2020 వ సంవత్సరంలో 5.2 టన్నుల ఓపియం, 0.7 టన్నుల మార్ఫీన్‌ ని మనదేశానికి అక్రమంగా తరలిస్తున్నవారి నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇంకా 3.8 టన్నుల హెరాయిన్‌ని సీజ్‌ చేసినట్లు పేర్కొంది. భారతదేశం మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా యొక్క తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. ఇది మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు భద్రతను ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం భారతదేశం రెండు ప్రధాన మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన గోల్డెన్‌ క్రెసెంట్‌ (ఇరాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ – పాకిస్థాన్‌) గోల్డెన్‌ ట్రయాంగిల్‌ (థాయ్‌ లాండ్‌ లావోస్‌-మయన్మార్‌) మధ్య ఉంది.
ఐతే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ప్రకారం, గత మూడు సంవత్సరాలలో నల్లమందు గంజాయి సాగు విస్తీర్ణంలో 89,000 ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో నాశనం చేయబడింది. ఇవి అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, జార్ఖండ్‌ మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ మరియు కాశ్మీర్‌, గుజరాత్‌, మహా రాష్ట్ర, ఒడిశా, త్రిపురలో ఉన్నాయి.
కోటి రూపాయలకు పైగా విలువైన 6.7 లక్షల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సిబి తెలి పింది. గడిచిన మూడేళ్లలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ లో 3000 కోట్ల హెరాయిన్‌, ఓపియం, గంజాయి, కొకైన్‌, మెథాంఫెటమైన్‌, ఎండీఎంఏ (ఎక్టసీ), కెటామైన్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీ లో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాప్తి నిరోధకానికి రాష్ట్ర, కేంద్రపాలిత స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌ అధిపతుల మొదటి సమావేశంలో శ్రీ అమిత్‌ షా 2047 సం. నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా భారత్‌ ఉండబోతుందని తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ యువత, మహిళలో మాదకద్రవ్యాలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక , ఎన్‌.ఎపిడిడిఆర్‌ పథకం కింద యువత, మహిళల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యను అరికట్టడానికి నిరంతర సమన్వయ చర్యలు తీసుకుంటుంది. మాదక ద్రవ్యాల బాధితులకు చికిత్స అందించడమే కాకుండా, నివారణ కొరకు అవగాహన పెంపొందించడం, వ్యసనం నుండి బయట పడేందుకు పునరావాస కేంద్రాలు, డి- అడిక్షన్‌ కేంద్రాలు నెలకొల్పింది. అలాగే యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ని 272 జిల్లాలలో ప్రారంబించింది. అలాగే డి – అడిక్షన్‌ కోసం టోల్‌ ఫ్రీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 14446 ద్వారా సహాయం కోరే వ్యక్తులకు కౌన్సిలింగ్‌ మరియు తక్షణ సహాయం అందించుతుంది. అంతే కాకుండా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నవారిని ఉక్కుపాదంతో అణచి వేస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ మాదకద్రవ్యాల తీసుకొనే అలవాటు నుండి తప్పించలేవు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ సహకరించాలి.

  • డీజే మోహన రావు
    9440485824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News