Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Elections in Jammu Kashmir: కాశ్మీర్‌ సమస్యకు కేంద్రం ప్రాధాన్యం

Elections in Jammu Kashmir: కాశ్మీర్‌ సమస్యకు కేంద్రం ప్రాధాన్యం

ఆర్టికల్‌ 370ని రద్దు చేసి అయిదేళ్లు దాటింది. జమ్ము, కాశ్మీర్‌ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించి కూడా దాదాపు అంతే కాలం అయింది. అయినప్పటికీ కాశ్మీర్‌ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దాదాపు 70 ఏళ్ల నుంచి ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి దాన్ని బయటికి తీసుకు రావడమనేది కష్టసాధ్యమైన విషయమేననడంలో సందేహం లేదు. అయితే, ఈ ప్రాంతాలను మిగిలిన భారతదేశంలో విలీనం చేయడం ద్వారా దీని సమస్యలకు తెర దించుతామని కేంద్రం అయిదేళ్ల క్రితం ప్రకటించడం జరిగింది. ఆర్టికల్‌ 370 ద్వారా ఆ ప్రాంతానికి కల్పించిన ప్రత్యేక హోదా కారణంగానే ఆ ప్రాంతం సమస్యలకు నిలయంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇది వంద శాతం నిజం కాకపోవచ్చు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ కు సంబంధించిన చర్యలను పూర్తి స్థాయిలో తీసుకోలేకపోయింది. అయిదేళ్ల క్రితం చేసిన అనేక వాగ్దానాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
గతంలో ఒకే రాష్ట్రంగా ఉన్న కాశ్మీర్‌, జమ్ము, లడఖ్‌ ప్రాంతాల్లో విభిన్న సమస్యలున్నాయి. లడఖ్‌ ను మొదట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. ఇప్పుడు లడఖ్‌ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం డిమాాండ్ చేస్తున్నారు. తమ భూమిని, తమ వనరులను తాము సక్రమంగా నిర్వహించుకోగలమని చెబుతున్నారు. కాశ్మీర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో అనేక చర్యలు చేపట్టింది. భారీగా ప్రాథమిక సదుపాయాల నిర్మాణాన్ని చేపట్టింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టింది. అనేక ప్రజోపయోగ సేవలను మెరుగుపరచింది. 2019 నాటికి ముందు అనేక సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంపై పెట్టిన పెట్టుబడులు కేవలం రూ. 19,000 కోట్లు కాగా, గత మూడేళ్ల కాలంలో కేంద్రం పెట్టిన పెట్టుబడులు రూ. 99,000 కోట్లు. శ్రీనగర్‌ను లేహ్‌ తో కలిపే జోజిలా సొరంగంతో సహా అనేక భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గత అయిదేళ్ల కాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అనేక రెట్లు పెరిగింది. అయితే, వ్యవసాయ రంగం, ఉద్యాన వనాల రంగం అధ్వాన స్థితిలో ఉన్నాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఇక్కడి ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.
అంతేకాక, కాశ్మీర్‌ లో భద్రతా పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడ్డాయి. శాంతికి భంగం కలిగించే సంఘటనలేవీ ఎక్కువగా జరగడం లేదు. ఇక్కడ భద్రతా దళాలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఇక్కడ ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయని భావించవచ్చు. పైగా ఉగ్రవాదులు కూడా తమ దృష్టిని, కార్యకలాపాలను జమ్మూ ప్రాంతానికి మళ్లించడం వల్ల కాశ్మీర్‌ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. సరిహద్దులకు అవతలి నుంచి దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు నేరుగా జమ్మూ ప్రాంతంలో ప్రవేశించి అక్కడ హింసా విధ్వంసకాండలను చేపట్టడం జరుగుతోంది. ఇటీవలి వారాల్లో అనేక పర్యాయాలు ఉగ్రవాద దాడులు జరిగి, పలువురు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇక్కడ ఎప్పటికైనా రాజకీయ ప్రక్రియ ప్రారంభం అవుతుందా, పాలనా వ్యవస్థ ఏర్పడుతుందా, కేంద్రం తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుందా అన్న ప్రశ్నలు ఇక్కడి ప్రజల మనసులను తొలిచేస్తున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో ప్రజలు భారీగా ఓట్లు వేశారు. సుమారు 58 శాతం ఓటింగ్‌ జరిగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరగడానికి సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ 30ని గడువుగా నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తు న్నారు. అయితే, ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం గడువు కాలాన్ని ఇంత వరకూ ప్రకటించలేదు. పైగా, ఇక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలను బాగా పెంచడం జరిగింది. కాశ్మీర్‌ విషయంలో మరెంతో చేయాల్సి ఉంది. ముఖ్యంగా రాజకీయ ప్రక్రియను చేపట్టడమే పెద్ద సవాలుగా కనిపిస్తోంది. పాలనలో ప్రజా ప్రాతినిధ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని పెంచడం వల్ల రాజకీయ ప్రక్రియ సాధ్యమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News