Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Environment: పర్యావరణాన్ని కాపాడుకుందాం

Environment: పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇవాళ్టి సమాజం అనేక రకాల కాలుష్యంతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే. అంటే మనచుట్టూ పచ్చదనాన్ని పెంచుకోవడమే. చెట్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే. ఈనేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి చొరవ చూపించింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడానికి 1972 జూన్‌ ఐదో తేదీ నుంచి 16వ తేదీ వరకు పర్యా వరణంపై ఐక్యరాజ్యసమితి ఒక సమావేశం నిర్వహిం చింది. ఈ సందర్భంగా 1972లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1974లో తొలిసారి ఓన్లీ ఎర్త్‌ అంటే… ఒకే ఒక్క భూమి అనే థీమ్‌తో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. 2019లో బీట్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ పేరుతో చైనాలో పర్యావరణ ఆవశ్యకతపై ఓ సదస్సు నిర్వహించారు. 2020లో టైమ్‌ ఫర్‌ నేచర్‌ అనే థీమ్‌తో కొలంబియాలో ఓ సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూ షన్‌ అనే అంశాన్ని థీమ్‌గా తీసుకుంది ప్రపంచ పర్యా వరణ దినోత్సవం. అంటే ప్లాస్టిక్‌ ఉపయోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.
ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంతో అనర్థాలు
ప్లాస్టిక్‌ ఉత్పత్తులు పర్యావరణానికి శాపంగా మారాయి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు కొన్ని వందల ఏళ్ల పాటు వ్యర్థాలుగా భూమిలో పేరుకుపోతాయి. మనం వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచుల పరిస్థితి కూడా ఇంతే. భూగోళంపై ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలే పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎన్నో అమాయక మూగజీవాల ప్రాణాలను బలిగొంటున్నాయి. సముద్రంలో డంప్‌ చేస్తున్న ప్లాస్టిక్‌ సంచులు, సీసా మూతలు, టూత్‌బ్రష్‌ అవశేషాలు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు తాబేళ్ళను, సాగర జీవాలను బలిగొంటున్నాయి.ఆధునిక మానవ జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిపోయింది. నిత్యజీవితంలో మనం వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తోనే తయారవుతోంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ లేని జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం. ప్లాస్టిక్‌ వస్తువులు తేలికగా ఉంటూ, ఎక్కువ కాలం మన్నేందుకు వీలుగా వీటి తయారీలో కొన్ని రసాయనాలను చేరుస్తారు. కాలక్రమంలో ఈ రసా యనాల ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. హార్మోన్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యరంగ నిపుణులు.
ఒకవైపు మొక్కలు నాటడం…మరోవైపు చెట్ల నరికివేత
మనదేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు విచ్చలవిడిగా అడవులను నరికి వేస్తుంటారు.మరో వైపు చెట్ల సంరక్షణ పేరుతో అక్కడక్కడా మొక్కలు నాటుతుంటారు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత చాలా కాలంగా యధేచ్ఛగా సాగుతోంది. అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసకాండ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది.దీంతో ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తరిగిపోతోంది. అడవుల నరికివేత ప్రభావం పర్యావరణం మీద తీవ్రంగా పడుతోంది. సహజంగా వాతావరణంలోని వాయుకాలుష్యాన్ని చెట్లు హరించివేస్తాయి. అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్‌ విడుదల చేస్తాయి. మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే. కరోనా సెక్‌ండ వేవ్‌ టైంలో చాలా మంది రోగులు శరీరానికి సరిపడ ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని ఒక హెచ్చరి కగా అన్ని దేశాలు తీసుకోవాలి. పర్యావరణ సమతుల్యతను రక్షించుకోకపోతే ఆ తరువాత అనేక దుష్ప రిణామాలు తలెత్తుతాయన్న వాస్తవాన్ని
పాలకులు అర్థం చేసుకోవాలి. రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి ఇదేవిధంగా చెట్లను నరుక్కుంటే పోతే గాలిలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతాయి. అడవులు నరికివేతకు ఫుల్‌ స్టాప్‌ పడకపోతే ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్‌ బాటిల్స్‌ను వెంట తీసుకెళ్లినట్లే రానున్న రోజుల్లో గడప దాటేటప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్‌ను జనం వెంట తీసుకెళ్లక తప్పదంటు న్నారు సైంటిస్టులు. మనదేశంలో గత ఏడు సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభు త్వం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. చెట్ల నరికివేతపై పర్యావరణ వేత్తలు అనేక సార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు. పర్యా వరణ సమతుల్యత అనేది లేకపోతే వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిం చారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. అయితే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. తెగి పడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి పేరిట వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందంటున్నారు పర్యావరణ వేత్తలు. అడవుల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారక పోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ పరిరక్షణ చట్టం ఉన్నా ఉపయోగం సున్నా
మనదేశంలో అడవులను కాపాడుకోవడానికి పటిష్టమైన చట్టాలు లేకపోలేదు. విచ్చలవిడిగా చెట్లను నరికి వేయడాన్ని నిరోధిస్తూ 1980లో కేంద్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తప్పదు అనుకుంటే అలాంటి ప్రదేశాల్లో అతి తక్కువ సంఖ్యలోనే చెట్లను తొలగించాల్సి ఉంటుంది. చట్టం ఇంత పక్కాగా ఉన్నా అమలు మాత్రం ఈ రేంజ్‌ లో ఉండటం లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వాలు ఎడాపెడా అనుమతులు ఇస్తున్నాయి.అనుమతులు రావడంతో దొరికింది ఛాన్స్‌ అనుకుంటూ విచ్చలవిడిగా చెట్లను నరికేస్తున్నారు. మౌలికగా అడవుల నరికివేతపై పాలకుల మైండ్‌సెట్‌ భిన్నంగా ఉంది. అభివృద్ధి పనుల కోసం అడవుల నరికివేత తప్పదన్నది ప్రభుత్వాల వాదన. అయితే దీనిని తప్పుపట్టడం లేదు పర్యావరణవేత్తలు. అభివృద్ది కోసమైనా చెట్ల నరికివేత సాధ్యమైనంతవరకు తక్కువగా ఉండాలంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ మేరకు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. అంతేకాదు ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కూడా తీసుకోవాలని షరతు పెట్టారు.
పర్యావరణంపై మారాల్సిన ప్రభుత్వాల వైఖరి
పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారా ల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, పర్యావరణం…. ఈ రెండూ వేర్వేరు అంశాలన్న పాలకుల మైండ్‌సెట్‌ మారాలి. అభివృద్ధిలో భాగంగానే చెట్లను చూడాలి. అప్పుడే, మనం చెట్లను రక్షించుకోగలం. అడవులను కాపాడుకోగలం. మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి.అడవులు లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. అడవుల వల్ల మానవాళికి బోలెడు ప్రయో జనాలున్నాయి. వాయు కాలుష్యాన్ని అదుపు చేస్తాయి. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తాయి. వరదలను అడ్డు కునే శక్తి ఒక్క అడవులకే ఉంది. అడవుల వల్ల నేల కోతకు గురి కాదు. అడవులు బావుంటే భూసారం దెబ్బతినదు. పంటల ఉత్పత్తి ఏమాత్రం తగ్గదు. గాలిలో ఉన్న ఉష్ణోగ్ర తను గ్రహించి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. వాతావర ణంలో వచ్చే మార్పులను కంట్రోల్‌ చేసే సత్తా ఒక్క అడవు లకే ఉంది. ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు మనం వాడే అనేకానేక ఔషధాలన్నీ అడవుల నుంచి వచ్చినవే. ఒక్క మాటలో చెప్పాలంటే అడవులు ఎంత దట్టంగా ఉంటే, మనిషి మనుగడకు కూడా అంత గ్యారంటీ ఉంటుంది. ప్రకృతి పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటే, ప్రకృతి కూడా మనలను అంతే బాధ్యతతో చూసుకుంటుందన్నది వాస్త వం. ప్రకృతిపై మనిషి ఒక్కడికే కాదు సమస్త జీవరాశులకు సమాన హక్కులున్నాయి. ఈ తెలివిడితో ఆధునిక మనిషి వ్యవహరించాలంటుంది పర్యావరణ దినోత్సవం.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News