Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Global warming: ప్రమాదపుటంచున భూగోళం

Global warming: ప్రమాదపుటంచున భూగోళం

ఇమ్యూనిటీని తగ్గించి, వ్యాధులకు బలయ్యేలా చేసే పొల్యూషన్

అమెరికాను రాకాసి అలలు వణికిస్తున్నాయి. ఇప్పటికే అనేక మందిని అలలు, సముద్రంలోకి ఈడ్చుకు వెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల అనేక దేశాల్లో నీటి కటకట ఏర్పడుతోంది. అంతేకాదు, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతోంది. ఈ పరిణామం, ప్రపంచ మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సముద్రాల్లో ఆటుపోట్లు ఎక్కువయ్యాయి. వరదలు సంభవిస్తున్నాయి. కొన్ని దేశాల్లో కరువు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం పర్యావరణంపై కూడా పడుతోంది. ఈ ప్రభావం సృష్టిలోని ప్రతి జీవిపై పడుతోంది. అంతరించిపోతున్న జాబితాలోకి అనేక జీవులు చేరుతున్నాయి. ఇదిలా ఉంటే అంతిమంగా ఆహార భద్రత పెను ముప్పు కూడా పొంచి ఉందంటున్నారు నిపుణులు.

- Advertisement -

అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో రాకాసి అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల తీరానికి సమీపంలోని నివాసాలపై విరుచుకుపడ్డాయి. ఈ అలల ప్రభావంతో తీరానికి దగ్గర్లోని అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీచ్ వైపు ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇదంతా వాతావరణ మార్పుల్లో భాగమే అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. భూతాపం ఎడాపెడా పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తే, యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్రమైన వడగాడ్పులు, నిప్పులు కురిపించేంతటి ఉష్ణోగ్రతలు ఇకనుంచి పదేళ్లకోసారి వచ్చే అవకాశాలున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూగోళంపై అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. భూగోళంపై అనేక పచ్చటి ప్రదేశాలు, కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే, ఆహార భద్రత ముప్పు కూడా పొంచి ఉంది. చివరకు ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారు.

అంటార్కిటికాలో కరుగుతున్న మంచు !
అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. అలాఇలా కాదు…అత్యంత వేగంగా కరుగుతోంది. ఈ పరిణామం, ప్రపంచ మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్ద సంఖ్యలో విడుదల అవడమే. దీనివల్ల భూ వాతావరణం వేడెక్కుతోంది. ఫలితంగా అంటార్కిటికాలో మంచుఖండం కరుగుతోంది. వాస్తవానికి అంటార్కిటికాలో మంచు ఫలకలు కరగడం కొత్త విషయం కాదు. 2016 నుంచి అంటార్కిటికాలో మంచు కరుగుతూనే ఉంది. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరుగుతున్నాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.వాస్తవానికి ప్రతి ఏడాది వేసవిలో అంటార్కిటికాలోని మంచు ఫిబ్రవరి చివరిలో కరుగుతుంది. శీతాకాలంలో తిరిగి గడ్డకడుతుంది. అయితే, ఈ సంవత్సరం అంటార్కిటికాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికాలో జులై మధ్యలో ఉండాల్సిన దాని కంటే, పది లక్షల చదరపు మైళ్ల మంచు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది అసాధారణ అంశం అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అంటార్కిటికాలో మంచు విపరీతమైన వేగంతో కరుగుతోంది. ఈ అనర్థానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు సైంటిస్టులు. ఒక్క అంటార్కిటికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంచు కరుగుతోంది. విపరీతమైన వేగంతో మంచు కరుగుతున్న కారణంగా, సముద్ర మట్టాలు కూడా ఎడాపెడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి భూగోళంపైగల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైంది. దీంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పెనుమార్పుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వరదలు వస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రమట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయన్నది ఒక అంచనా. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు ఆ మేర నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రస్తావించారు.

అంటువ్యాధులు పెరిగే ప్రమాదం !
వాతావరణంలో సంభవించే పెనుమార్పుల వల్ల అంటువ్యాధులు పెరుగుతాయన్నది శాస్త్రవేత్తలు చేస్తున్న మరో హెచ్చరిక. ఉష్ణోగ్రతలు పెరిగితే ఆ ప్రభావం వాతారణ మార్పులపై పడుతుంది. అంతిమంగా మనుష్యుల్లోని రోగనిరోధక శక్తిని దారుణంగా దెబ్బతీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడంతో, అనేక వైరస్‌లు చాలా సులభంగా మనుషుల మీద దాడి చేస్తాయి. దీంతో ఎంతటి ఆరోగ్యవంతులైనా చాలా త్వరగా రోగాలబారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి ఎంత బీభత్సం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొత్తంగా ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే అంటున్నారు సైంటిస్టులు. గ్లోబల్ వార్మింగ్‌ను తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది మనమే. వాతావరణంలో కొద్దిపాటి మార్పులు కనిపించినా, ప్రపంచ దేశాలు వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంది. గ్లోబల్ ఫుడ్ పాలసీ సిఫారసుల మేరకు, తరుముకువస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.ఈ నేపథ్యంలో వాతావరణంలో వేడి పెరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మొక్కలు ఎక్కువగా పెంచడం వల్ల వేడిని తగ్గించవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అలాగే సాధ్యమైనంతవరకు వాహనాల వాడకం తగ్గించాలంటున్నారు. కాలుష్య రహిత సమాజం కోసం అన్నిదేశాలు కృషి చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. వీటన్నిటితో పాటు వాతావరణంలో కొద్దిపాటి మార్పులు కనిపించినా, ప్రపంచ దేశాలు వెంటనే అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ వాతావరణ సంస్థల సిఫారసుల మేరకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలు ముందుకు సాగాలంటున్నారు శాస్త్రవేత్తలు.

  • ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,
  • సీనియర్ జర్నలిస్ట్, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News