Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Green revolution-nutrition: భూముల్లో నిస్సారం-పంటల్లో పోషకాలు తగ్గుముఖం

Green revolution-nutrition: భూముల్లో నిస్సారం-పంటల్లో పోషకాలు తగ్గుముఖం

నేల ఆరోగ్యం అత్యంత కీలకం..

మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం మూలంగా ఏడున్నర దశాబ్దాల కాలంలో వ్యవసాయ (సేద్య) రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వివిధ పంటల్లో నూతన వంగడాల రాకతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఆకలి మంటల్లో అలమటించిన భారతావని తలరాతను మార్చేసింది. 1961లో, దేశంలో 72.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, 2022-23 వచ్చేసరికి అది 329.69 మిలియన్ టన్నులకు ఎగబాకింది. అధిక దిగుబడలు ఇచ్చే వంగడాలు రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగంతో ఆహార ఉత్పత్తుల దిగుబడులు పెరగసాగాయి. అధిక దిగుబడి సాధించడానికి నేల ఆరోగ్యం అత్యంత కీలకం. కానీ అదే సమయంలో రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడడం కారణంగా భూసారం నాశనమవుతుంది. వ్యవసాయ భూముల్లో సేంద్రీయ కర్బనం కనీసం2.5 శాతం మేరకు ఉండాలి. కానీ దేశంలో అది 0.5 శాతం కన్నా తక్కువకే పరిమితం అయినట్లు అంచనా. దీంతో పంటల్లో పోషకాల శాతం క్షీణించిపోతుంది. ఆహార పదార్థాల్లో రసాయన అవశేషాలు అధికమవుతున్నాయి. పంటల దిగుబడులు వృద్ధి కోసం విచ్చలవిడిగా వాడుతున్న పురుగు మందుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 2 లక్షల మంది మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి గతంలో హెచ్చరించింది. క్యాన్సర్లు, ఆల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి వ్యాధులు వ్యాప్తికి రసాయన క్రిమిసంహారకాలు కారణం అవుతున్నాయి. కేంద్ర లెక్కల ప్రకారం, 2021-23లో దేశంలో 1.27లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పొలాల్లో చల్లారు. 2021-24 మధ్య 1.68 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన పురుగు మందులను పంటలపై పిచికారీ చేశారు. నేల సత్తువను, జన ఆరోగ్యాన్ని హరిస్తున్న వీటి వినియోగాన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తు సమాజం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. పర్యావరణానికి హాని చేస్తున్న రసాయన ఎరువులు, కలుపు మందులను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా పొలాలు కాలుష్యానికి గురై ఉప్పు, చౌడు వంటి సమస్యాత్మక భూములుగా మారుతున్నాయి. సాధారణంగా అవసరానికి మించిన యూరియా, కాంప్లెక్స్ వాడటం వల్ల భూముల్లో బాస్వరం నిల్వలు అధికమవుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో సూక్ష్మ పోషకమైన జింకు అందుబాటు తగ్గిపోతుంది. ఇలా అధిక దిగుబడుల కోసం చాలా మంది రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో పొలాల్లో అంతకంతకు నిస్సారమై పోతున్నాయి. ఇలా వ్యవసాయ సేధ్యంలో వచ్చిన విపత్కర పరిణామాలను అధిగమించడానికి దేశవ్యాప్తంగా భూసార పరీక్షలను విరివిగా చేపట్టి పంట భూములు సంరక్షించుకోవడం ప్రస్తుత తక్షణవసరం. అదే వేళ ప్రధాన ఆహార ధాన్యాల్లో పోషక విలువ పడిపోతున్నాయి. ముఖ్యంగా వరి, గోధుమ పంటల్లో జింక్, ఐరన్ వంటి పోషకాలు తగ్గిపోయినాయి. అదే సమయంలో వరిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్ పరిమాణాలు అధికమైనట్లు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. కూరగాయలు, పండ్లలోను ప్రాణాంతక పురుగుమందుల అవశేషాలు తరచూ బయటపడుతున్నాయి. సాగులో రసాయనాల వాడకంతో ప్రజారోగ్యం దెబ్బ తినడంతో పాటు, నేల చౌడు బారిపోతుంది. దిద్దుబాటులో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని విరివిగా ప్రోత్సహించాలి.

- Advertisement -

మన తెలంగాణ రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం ఏడాదికి ఏడాది భారీగా పెరుగుతుంది. నిరుడు 44 లక్షల టన్నులు.. ఈ ఏడాది 47 లక్షల టన్నులు రాష్ట్రంలో పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందుల విరివిగా వినియోగిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న రైతులు మాత్రం వాటికి మొగ్గు చూపడం లేదు. అన్నదాతలను అవగాహన పరచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ, ప్రభుత్వం పైనే ఉంది. అంతేకాదు జాతీయ సగటు కంటే ఎక్కువ మన రాష్ట్రంలోనే వాడుచున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎకరా పంటకు సగటున 78.4 కిలోల ఎరువులు వినియోగిస్తుండగా, దేశంలో 51.2 కిలోలుగా ఉంది. తెలంగాణల మాత్రం దాదాపు 130 కిలోల వాడుతున్నారు. రాష్ట్రంలో 2014-15లో 15.12 లక్షల టన్నులుగా ఉన్న సరఫరా…2024-25 నాటికి 47.18 లక్షల టన్నులకు పెరిగింది. వరికి ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా, 9:5 :2 7 :1 నిష్పత్తిలో వాడుతున్నారని తెలుస్తుంది. రైతులు ప్రతి వ్యవసాయ సీజన్లో విత్తనాల కంటే ముందు ఎరువులను కొనుగోలు చేసి నిలువ చేస్తున్నారు. ఏపుగా పెరగాలని ఆశతో రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలం, వ్యవసాయ శాఖ ఆధ్యయనంలో తేలింది. యూరియా వేస్తే వరి ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందనే అపోహ రైతుల్లో బాగా ఉంది. అందుకని వినియోగం చాలా పెరిగిపోతుంది. యూరియా 2015-16 లో 12.53 లక్షల టన్నుల యూరియా వినియోగమవ్వగా.. ఈ ఏడాది 21లక్షల టన్నులు ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎరువుల వినియోగం పెరుగుదల ఇలా..( లక్షల టన్నుల్లో) 2014-15లో, 15.12లక్షల టన్నులు.. 2015-16 లో 20.30/ 16-17లో 24.90/
17-18లో 26.82 /18-19లో,28.96/ 19-20లో, 35.54/ 20-21లో, 36.87/ 21-22లో 37.06/ 22-23లో, 41.22/ 23-24లో 45.39/ 24-25లో 47.18/లక్షల టన్నుల్లో.. ఇలా పంటలన్నీ రసాయన ఎరువుల మయమై అటు భూసారాన్ని ఇటు మానవా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని హాని చేస్తున్న వేళ ప్రభుత్వాలు స్పందించి దేశంలో, రాష్ట్రాలలో రసాయన ఎరువుల సగటు వాడకాన్ని నియంత్రిస్తూ, రసాయన ఎదవులకు బదులు తొలకరి వానలు కురవగానే పొలంలో పిల్లి పెసర, జీలుగు, జనుము లాంటివి పెంచి దున్నితే భూమికి అవసరమైన నత్రజని అందుతుంది. యూరియా వాడకాన్ని తగ్గించవచ్చు. దీనికి అనుగుణంగా ప్రభుత్వా భూసార పరీక్షా కేంద్రాలను విరివిగా ఏర్పరిచి రైతు కమతాలను భూసార పరీక్షలు నిర్వహించాలి, భూమిలో ఉన్న పోషక లోపాలకు అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనల మేరకు రసాయన, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలను పండించేలా రైతులను చైతన్య పరచాలి. వ్యవసాయ సేద్యంలో ఆధునిక శాస్త్ర సాంకేతికతను శాస్త్రవేత్తల సూచన మేరకు ఉపయోగిస్తూ భూసారాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. పోషక విలువలు సమపాళ్ళలో ఉన్న ఆహారత్పత్తులను పండించాలి. లేదంటే? తను “కూర్చున్న కొమ్మను తనే నరుక్కున్నట్లు” అవుతుంది. ఇది రాత్రికి రాత్రే వచ్చిన ప్రమాదం కాదు. అట్లని రాత్రికి రాత్రే పరిష్కారం కాదు. ప్రభుత్వాలు, రైతులు, సమాజం నిర్లక్ష్యం వీడి తగు జాగ్రత్తగా వ్యవహారిస్తేనే పొంచి ఉన్న ప్రాణాంతక ప్రమాదంలోంచి భావితరం బయట పడుతుందని గమనించండి..
మేకిరి దామోదర్, సోషల్ అనలిస్ట్, వరంగల్, ఫోన్: 9573666650

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News