Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Gunturu Seshendra Sharma: తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన శేషేంద్ర..మీరు శోడశి చదివారా?

Gunturu Seshendra Sharma: తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన శేషేంద్ర..మీరు శోడశి చదివారా?

వాల్మీకి రాసిన రామాయణం గురించి భారతదేశంలో తెలియని వారుండరు. ప్రతి వ్యక్తికీ ఇది కరతలా మలకం. సీతారాములు అందరికీ ఆదర్శ దంపతులు. దేశమంతా వారికి ఆలయాలు కట్టి పూజలు చేస్తుంటుంది. కోట్లాదిమంది రామాయణాన్ని పారాయణ చేస్తుంటారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా రామాయణాన్ని పఠిస్తే కష్టాలు గట్టెక్కుతాయనే నమ్మకం కూడా ప్రజల్లో పాదుకుపోయి ఉంది. అయి తే, ఈ భక్తినీ, ఈ నమ్మకాలను ఓ వ్యర్థ పదార్థంగా తీసిపారేస్తారు ప్రసిద్ధ సాహితీవేత్త, పరి శోధకుడు, విమర్శకుడు, భాషావేత్త అయిన గుంటూరు శేషేంద్ర శర్మ. రామాయణాన్ని ఒక మూఢ నమ్మకంతో కాక, శాస్త్రీయంగా చూడాల్సిన, ఆకళింపు చేసుకోవాల్సి ఉందని ఆయన పరిశోధనాత్మకంగా చెప్పారు. ఆ దృక్పథంతోనే ఆయన ’షోడశి’ అనే గ్రంథం రాశారు. తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపుతిప్పిన అద్భు త గ్రంథం ఇది అనడంలో సందేహం లేదు. ఇందులో ఆయన రాముడు, సీత పాత్రలను లోతుగా విశ్లే షించడంతో పాటు, యావత్‌ రామాయణ రహస్యాలను బట్టబయలు చేశారు. రామాయణాన్ని, వాల్మీకి అంతరంగాన్ని ఒక కొత్త కోణంలో చూడాల్సిన అవసరాన్ని ఆయన షోడశిలో వివరించారు. రామాయణాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలన్నా. వాల్మీకి వాడిని పట్టుకోవా లన్నా దీనిని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఇందుకు కొత్త తరహా పరిశోధన పరికరాలు అవసరం మని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఇతిహాసాన్ని రాయడంలో వాల్మీకి ఆంతరంగిక ఆలోచనల్ని. అసలు ఉద్దేశాల్ని కేవలం సైన్స్‌ ద్వారానే అర్థం చేసుకోవాలని ఆయన మరీ మరీ చెప్పారు. సైన్స్‌ లేదా శాస్త్రీయ దృక్పథం పూర్తిగా శాస్త్రవేత్తలకే పరిమితమనీ, ఇతిహాసాలకు, ఉపనిషత్తులకు, పురాణాలకు, కావ్యాలకు, ప్రాచీన సాహిత్యానికి శాస్త్రీయతను జోడించాల్సిన అవసరం లేదని పండితులు, కొందరు పరిశోధకులు, విమర్శకులు చెప్పడాన్ని ఆయన గట్టిగా తోసిపుచ్చారు. ఒక్క సాహిత్యానికే కాక, జీవితంలోని ప్రతి అం శానికి, ప్రతి కోణానికి శాస్త్రీయతను జోడించాల్సిందేనని ఆయన వాదించారు. సాహితీ పరిశోధకుల్లో ఈ రకమైన సోమరితనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మొదటి నుంచీ ఆయన ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. జీవితమంతా ఆయన ఈ సిద్ధాంతాలకు ఆయన అంకితమయ్యారు. ప్రతిదాన్నీ హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించడం, ఆ బాణీ సూత్రాలను తన జీవితానికి, తన ఆలోచనలకు అన్వయింపజేసుకోవడం ఆయన నైజం. ఆయన గ్రంథాలన్నీ ఆ వరుసలోనే ఉంటాయి. షోడశి కూడా ఆ కోణంలోనే రాశారు. రామాయణ రహస్యాలపై కొత్త వెలుగును ప్రసరింపజేశారు. షోడశిని రాయడం వెనుక అనేక సంవత్సరాల అవిశ్రాంత పరిశోధన ఉంది. మొట్టమొదటగా ’కుండలినీ యోగాన్ని మానవాళికి పరిచయం చేసింది వాల్మీకి అని అంటూ, రామాయణమంతా కుండలినీ యోగానికి సంబంధించిందేనని, అదంతా కుండలినీ యోగం చుట్టూనే తిరుగుతుందని, రాముడు, సీత, లక్ష్మణుడు తదితర పాత్రలన్నీ ఆ యోగానికి సంబంధించినవేనని ఆ యన కుండబద్దలు కొట్టారు. కుండలినీ రూపంలో వాల్మీకి మానవాళికి ఒక అద్భుతమైన, అద్వితీయమై న ఔషధాన్ని ప్రసాదించారని శేషేంద్ర స్పష్టం చేశారు. వాల్మీకి కుండలినీ యోగానికి సంబంధించిన పూ ర్తి సమాచారాన్ని రామాయణం పేరుతో, అనేక పాత్రల మాటున అద్భుతంగా ఒక కథ అల్లి ఒక ఇతిహా సంగా మలచి, దీన్ని మానవ మనసుల్లో సుస్థిరం చేశారని శేషేంద్ర శర్మ వివరించారు.
మహాభారత కాలం కంటే చాలా ముందే వెలుగు చూసిన వాల్మీకి రామాయణం వేదాలకంటే అధికం గా ఆధ్యాత్మిక, లౌకిక, ప్రాపంచిక, ధార్మిక విజ్ఞానాన్ని పంచి పెట్టిందని, మనం ఇప్పుడు మెడిటేషన్‌ అని చెప్పుకుంటున్న ధ్యాన ప్రక్రియను కూడా వివిధ పాత్రల రూపంలో, కథాత్మకంగా తరతరాల ప్రజల ముందుంచాడని ఆయన తెలియజెప్పారు. షోడశి గ్రంథం ఏ విధంగా చూసినా ఒక మహోన్నత గ్రం థం అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం విషయంలో శేషేంద్ర చేసినంత పరిశోధన మరే గ్రంథం విషయంలోనూ ఎవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఇతర గ్రంథాలలో వేదాల గురించి, మంత్ర శాస్త్రం గురించి కూడా ఇంతే అద్భుతంగా పరిశోధనాత్మకంగా విశ్లేషించారు. సాహితా నికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ శేషేంద్ర శర్మకు తిరుగులేని పేరుంది. ఆయన రాసిన ’రుతు ఘోష’ అనే పద్య కావ్యం పండింతులనే కాక, పామరులను సైతం అలరిస్తుంది. ఆయనలోని విప్లవ స్ఫూర్తి ’మండే సూర్యుడు’లో కనిపిస్తుంది. షోడశి ద్వారా రామాయణ రహస్యాలను బయటపెట్టిన శేషేంద్ర శర్మ, ’మహా త్రిపురసుందరి’ ద్వారా మంత్ర శాస్త్రాన్ని, స్వర్ణహంస’ ద్వారా చింతామణి మంత్రాన్ని విశ్లేషించారు. శ్రీనాథుడు, మల్లినాథుడు, నన్నయ్య వంటి కవులు సైతం మదించ లేకపోయిన గ్రంథాలను ఆయన మదించి ఒక కొత్త సాహితీ ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News