తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో దశాబ్దాలుగా ప్రజా రవా ణాకు వెన్నెముకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGS RTC) కార్మికులు 2026 ఏప్రిల్ 22 నుండీ నిరవధిక సమ్మెలోకి దిగారు. రాష్ట్ర వ్యాపితంగా సంస్థలో ఉన్న మొత్తం కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రైవేట్ అద్దె బస్సులు, కాంట్రాక్టు బస్సులను తిప్పడం ద్వారా, కార్మికుల ప్రాథమిక హక్కులను కూడా (డిపోలు, బస్స్టాండ్ల ముందు టెంట్ వేసుకోవడం, మీటింగ్ కోసం మైక్ పెట్టుకోవడం) కాలరాయడం ద్వారా ప్రభుత్వం సమ్మెను అణచివేయాలని చూస్తు న్నది. ఇలా కార్మికులకు ప్రాథమిక, ప్రజాస్వామిక హక్కులను లేకుండా చేయడం ప్రజా పాలన ఏ మాత్రం అనిపించుకోదు.
ఆర్టీసీలో అనేక యూనియన్లు పని చేస్తున్నప్పటికీ, గత ప్రభుత్వ కాలం నుండీ ఇప్పటి వరకూ వాటిని అధికారికంగా అధికారులు, ప్రభుత్వం గుర్తించడం లేదు. యూనియన్ సభ్యత్వాన్ని వసూలు చేసుకోవడానికి అనుమతించకపోవడం, కార్మికులతో సమావేశాలకు అనుమతించకపోవడం, కార్మిక శాఖ ద్వారా, గుర్తింపు సంఘం ఎన్ని కకు ఎన్నికలు నిర్వహించక పోవడం- ఇవన్నీ ప్రభుత్వాల, సంస్థ యాజమాన్య అప్రజాస్వామిక వైఖరిలో భాగంగా కొనసాగుతున్నాయి.
కానీ సంస్థలో ఏర్పడిన సమస్యల తీవ్రత దృష్ట్యా అన్ని కార్మిక సంఘాలు ఒకే JAC గా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్రస్తుతానికి ఆర్టీసీ సంఘాల JAC ఇచ్చిన నోటీస్పై చర్చలు జరపడా నికి ప్రభుత్వం నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది.
గత రెండు రోజులుగా ప్రతిరోజూ కార్మికులు ఉదయమే డిపోలు, బస్ స్టాండ్ల వద్దకు తరలి వస్తున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులు అందరూ ఒకేచోట కూర్చోవడానికి వీలుగా లేకపోయినా, స్థానికంగా కార్మికులు, JAC నాయకత్వంలో చిన్న ఊరేగింపులు చేస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రజా సం ఘాల ప్రతినిధి బృందాలు వచ్చి కార్మికుల సమ్మె పోరా టానికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా కాలంలో
ఆర్టీసీ కార్మికుల సమ్మె, పరిణామాలు
2019లో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు భారీ సమ్మె చేశారు. వారి ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి. అయితే, అప్పట్లో ప్రభుత్వం ఈ డిమాండ్ను తీవ్రం గా వ్యతిరేకించింది. విలీనం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నిర్బంధం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేసింది. అనేక మంది ఆర్టీసీ కార్మికుల అకాల మరణాలకు కారణమైంది. ఆర్టీసీలో యూనియన్ లను గుర్తిం చనని ప్రకటించడం ద్వారా, కార్మికులకు సరైన ప్రాతినిధ్యం, గొంతు లేకుండా చేసింది.
కానీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, 2023 జూలైలో అప్పటి కేబినెట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగుల ప్రభుత్వ సర్వీసులో విలీనం) బిల్లు-2023’ను సిద్ధం చేశారు. ఈ బిల్లుపై అప్పటి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కొన్ని సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, చివరకు 2023 ఆగస్ట్లో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. 2023 సెప్టెంబర్లో గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేయ డంతో ఇది చట్టంగా మారింది. దీని ద్వారా సుమారు 43,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే మార్గం సుగమమైంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో (అభయహస్తం) ద్వారా RTC కార్మికులకు, సంస్థకు సంబంధించి ఇచ్చిన హామీలు:
1. వేతన సవరణ (PRC): పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడమే కాకుండా, కొత్త పీఆర్సీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
2. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
3. పాత పెన్షన్ విధానం (OPS): ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
4. మహాలక్ష్మి పథకం: రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు (దీనిని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది). ఈ పథకం వల్ల సంస్థకు కలిగే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
5. మెగా రిక్రూట్మెంట్: సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
6. సిబ్బంది సంక్షేమం: కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, వారి ఇతర సంక్షేమ నిధులను సకాలంలో విడుదల చేయడంపై దృష్టి పెడతామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి అనుసరించాల్సిన పనులను నత్త నడకన నడిపిస్తోంది.
1. కేడర్ విభజన: ఆర్టీసీ ఉద్యోగులను ఏ శాఖ కిందకు తీసుకు రావాలి, వారి సీనియారిటీని ఎలా లెక్కించాలి అనే అంశంపై చర్చ పూర్తి చేయలేదు.
2. ఆర్థిక సర్దుబాటు: ఆర్టీసీ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం విధివిధానాల రూపకల్పన పూర్తి చేయలేదు.
3. కార్పొరేషన్ మనుగడ: ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వెళ్లినా, ఆర్టీసీ ఒక కార్పొరేషన్ (సంస్థ)గా విడిగా కొనసాగుతుంది. ప్రభుత్వమే వారికి నేరుగా జీతాలు చెల్లిస్తుంది. ఈ విషయమై ఇంకా ఫైనల్ ప్రకటన చేయలేదు.
4. నిజంగా ఆర్టీసీని ప్రభుత్వంలో భాగం చేస్తే, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని రకాల ప్రయోజనాలు (పెన్షన్, ఇన్సూరెన్స్ వంటివి) అందే అవకాశం ఉంది.
అధికారిక నివేదికలు, తాజా గణాంకాల ప్రకారం, 2014 నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో వచ్చిన మార్పులు:
1. గత పదేళ్లలో సంస్థలో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొత్త నియామ కాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం, పదవీ విరమణలు దీనికి ప్రధాన కారణం.
2. 2014 (రాష్ట్ర ఆవిర్భావ సమయం): సుమారు 56,000 నుండి 58,000 మంది ఉద్యోగు లు ఉండేవారు. 2023 ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య 43,971కి తగ్గింది. ప్రస్తుతం (2026 ప్రారంభంలో) అధికారిక లెక్కల ప్రకారం సుమారు 38,419 మంది ఉద్యోగులు ఉన్నారు.
3. అంటే పదేళ్ల కాలంలో దాదాపు 18,000 నుండి 20,000 వరకు సిబ్బంది తగ్గారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది.
పర్మినెంట్ (శాశ్వత) సిబ్బంది వివరాలు:
ప్రస్తుతం సంస్థలో మొత్తం 38,419 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.
డ్రైవర్లు: సుమారు 18,500 – 19,000
కండక్టర్లు: సుమారు 15,000 – 16,000
మెకానికల్/ గ్యారేజ్ సిబ్బంది: సుమారు 2,500 – 3,000
అడ్మినిస్ట్రేటివ్ & సూపర్వైజరీ: సుమారు 1,200 – 1,500
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది
1. ఆర్టీసీలో ప్రస్తుతం ప్రత్యక్షంగా ‘కాంట్రాక్ట్ ఉద్యోగులు’ కంటే, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా, అద్దె బస్సుల (Hire Buses) ద్వారా పని చేస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు.
1. అద్దె బస్సు డ్రైవర్లు (Hire Bus Drivers): సంస్థలో సుమారు 3,396 అద్దె బస్సులు ఉన్నాయి. వీటికి సంబంధించిన సుమారు 6,500 నుండి 7,000 మంది డ్రైవర్లు ప్రైవేట్ యజమానుల కింద పని చేస్తున్నారు (వీరు ఆర్టీసీ కిందకు రారు).
2. అవుట్సోర్సింగ్ సిబ్బంది: డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, కొన్ని డిపోలలో మెయింటెనెన్స్ పనుల కోసం సుమారు 4,500 నుండి 5,000 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు.
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
(రేపు మిగతా భాగం)

