Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్INDIA Vs NDA: కూటముల కొట్లాటా.. ప్రజా సమస్యలా?

INDIA Vs NDA: కూటముల కొట్లాటా.. ప్రజా సమస్యలా?

స్వాతంత్య్ర సమరయోధుల ధన మాన ప్రాణ త్యాగాలకు ఇచ్చే గౌరవం ఇదేనా?

ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలు ఇచ్చిన అధికార పీఠానికి సార్ధకత చేకూర్చిన వారవుతారు. పాలకుడిగా ప్రజలు మోస్తున్నా.. ప్రజలందరినీ తాను మోయాలి. లేకుంటే అధికార పీఠం నుండి పడదోయడం తప్పదు. పాలితుల రక్షణ బాధ్యతలకై కష్టనష్టాల్లో కన్నతండ్రి ఎలా తోడుగా ఉంటాడో, బిడ్డ ఏడ్పు విని తల్లి ఎలా పరుగెడుతుందో.. ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు పాల కులు అలా పరుగెత్తాలి. వారే నిజమైన ప్రజా సేవకులు. ప్రజా పాలకులకు మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా, అప్రతిష్ట రావాలన్నా? నిజాయితీ పరులను గౌరవిస్తూ అవినీతి పరులను శిక్షిస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా రంజక పాలన అందిస్తూ శ్రేయో రాజ్యాన్ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ నేడిప్పుడు పాలకులు గిట్టనివారైన, మాట విననివారైన ప్రశ్నించే వారిపై కఠిన చట్టాలతో శిక్షలు వేస్తూ, దండిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. తమకు ఇష్టమైన వాళ్లు ఎన్ని తప్పులు, ఎంత అవినీతి చేసినా క్షమించి వదిలేయడం, వారిని చూసి చూడనట్లు ఉండడం జరుగుతుంది. గిట్టని వారు చిన్న తప్పు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధించడం లాంటి చర్యల వల్ల మంచి పాలకులు కాలేరు. దీనికి తోడు అపకీర్తిని తెచ్చిపెడుతుంది. ప్రజా పాలన అంటే? కల్లబొల్లి మాటలు, ఆచరణ కాని హామీలు, అరచేతిలో స్వర్గం చూపడం కానే కాదు. పారదర్శకమైన ఆచరణ. అవినీతి, బంధుప్రీతి లేని సచ్చీల పాలకులనే ప్రజలు రక్షిస్తారు. లేకుంటే ఎంతటి సమర్ధుడైన పాలకుడైనా ప్రజా వ్యతిరేక హోరులో కొట్టుకపోక తప్పదు. మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు చేరువవుతున్న వేళ దేశంలోని రాజకీయ పార్టీలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ‘ఎన్డీయే కూటమి’లో 38 పార్టీలు, ‘ఇండియా కూటమి’లో 26 పార్టీలు చేరాయి. మన దేశంలోని బహుళ పార్టీ పాలన విధానంలో.. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ దేశంలోని ప్రజల కోసం ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తూ ప్రజా సంక్షేమానికి రక్షకులుగా, కాపలాగా పాలకులు నిలబడాల్సి ఉంది. రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వ్యవస్థలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయనివ్వాలి. వారి స్వేచ్ఛకు ఆటంకం కల్పించరాదు. చట్ట సభల్లో చేసే చట్టాలపై ప్రజాస్వామ్య బద్ధంగా చర్చ జరగాలి. ఏకపక్ష నిర్ణయాలు, మందబలంతో చట్టాలను ఆమోదించుకోవడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ఆ లక్ష్యానికి చేరుకుంటుందా! అని విశ్లేషకులు, ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. స్వార్ధపూరిత అస్థిర కూటమిలతో ఈ దేశానికి అవస్తే అంటున్న ఎన్డీఏను చూస్తున్నారు.. నూతన పార్లమెంట్‌ భవనంలో కొలువు తీరుతున్న వేళ ఇరుకూటముల ప్రవర్తన, పనితీరును ప్రజలు ఆసక్తిగా వింటుం(చూస్తుం)టారు. రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తుంటారనే విజ్ఞతతో మెలగండి. జూలై 20 నుంచి మొదలై ఆగస్టు 11 వరకు జరిగే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు 17 రోజుల పని దినాలు కార్యకలాపాలు జరగనున్నాయి. ఇందులో ఆరు పాత బిల్లులతో పాటు 31 బిల్లుల జాబితాను కేంద్ర ప్రభు త్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ బిల్లులతో పాటు అనేక ప్రజా సమస్యలపై ఎన్డీఏ, ఇండియా కూటములు అస్త్ర శస్త్రాలతో పార్లమెంటులో ఒకరినొకరు నిలదీసుకోవ డానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు కూటములు ప్రజామ న్ననను పొందడం కోసం రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒకరిపై ఒకరు పరస్పరం దూషించుకుంటూ ఇరకాటంలో పెట్టేలా వ్యూహ ప్రతివ్యూహాలు, పథక రచన లతో తల మునకలై ఉన్నారు. ప్రధానంగా మణిపూర్‌ మారణకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్‌, ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి), ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్ల బిల్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, అతి వృష్టి, అనావృష్టులు, సరిహద్దుల్లోని పరిస్థితుల వంటి అనేక ఇతర అంశాలపై ‘ఇండియా’ కూటమి చర్చలు జరపాలని పట్టుబట్టింది. అధికార దర్పంతో పాలకపక్షం వీటిని అన్నింటిని తిప్పి కొడుతుంది. అంతే కాకుండా గతంలో రాజకీయ కూటముల విఫల చరిత్రను ఏకరువు పెడుతూ.. తామే ఈ దేశానికి సమర్థవంతమైన పాలన అందించగలమని, ఈ పార్లమెంటు సమావేశాలను వేదికగా అధికార ఎన్డీఏ కూటమి శత విధాలా ప్రయత్ని స్తుంది. రాజకీయ ఎత్తులు జిత్తులతో విలువైన ప్రజా కాలా న్ని వృధా చేయరాదు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి. అలా ప్రజా ప్రయోజనాల చట్టాలు రావాలి. చర్చలు జరగాలి. పాలకులు తమకు నచ్చిన విధంగానో, తోచినట్లుగానో పాలించడం కాదు. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేలా.. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, లింగ పరంగా వివక్ష లేకుండా సమానత్వాన్ని సాధించడం కోసం చట్టాలు రావాలి. దేశ సంపద ఏమైపోతుంది? కొంతమంది ఆస్తులు కొండలుగా పెరిగిపోవడం, మెజార్టీ ప్రజ(వర్గా)లు దరిద్రంలో కొట్టుమిట్టాడడం, అవినీతి, అప్పుల భారం, నిరుద్యోగం, ఉపాధి లేమి, రైతుల ఆత్మ హత్యలు లాంటి ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యవస్థీకృత లోపాలు ప్రజల పాలిట శాపాలుగా మారినాయి. పార్టీ (ప్రభుత్వా)లు మారుతున్నాయి, మొన్ననే 75 ఏళ్ల స్వా తంత్య్ర అమృతోత్సవాలు జరుపుకున్నాం. కానీ ఈ దేశంలో సమస్త అవ్యవస్థలను ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ప్రపంచంలో ఏ రంగాన్ని చూసినా అన్నింటా అధమ స్థానంలోనే ఉంటున్నది మన దేశం నిజం కాదా!. అంతే కాదు మన పొరుగు దేశాలైన మన కన్న చిన్న దేశాల కంటే మనం సమానత్వం, ప్రజాస్వామ్యం, మహిళా స్వేచ్ఛ, ఆర్థికంగా, మతసామరస్యతలోనూ ఇలా ఏ రంగంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా స్వేచ్ఛ, సమానత్వంలో మన దేశం దిగజారిపోవడంపై ఈ పార్లమెంటు సమావేశాలలో రెండు కూటములు ‘ఎన్డీఏ, ఇండియా’లు ప్రజా సమస్యలపై చర్చ జరపాలి. రాజకీయాల కతీతంగా ప్రజా సమస్యలే అజెండాగా చర్చ జరిగి, ప్రజారంజక చట్టాలు రావాలి. అవి క్షేత్ర స్థాయిలో రాజకీయాలకు అతీతంగా అమలు జరిగి సమ్మిళిత అభివృద్ధి సాధించబడాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, లింగపరంగా వివక్ష చూపుతూ, భావోద్వేగాలు, ఆత్మగౌరవాల్ని రెచ్చగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత మాత్రం ఏ కూటమికైనా మంచిది కాదు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల ధన మాన ప్రాణ త్యాగాలకు ఇచ్చే గౌరవం ఇదేనా! ఆనాటి సమర యోధుల త్యాగాల స్పూర్తితో నేటి సమాజం గుణపాఠం ఎంతో నేర్చుకోవాల్సిందే.. ఒక్కసారి ఆలోచించండి నేటి ప్రజా ప్రతినిధులారా..
మేకిరి దామోదర్‌
మాజిక విశ్లేషకులు

  • 9573666650.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News