Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Indigo revolution: నీల్‌ బిద్రోహో విప్లవం

Indigo revolution: నీల్‌ బిద్రోహో విప్లవం

నీలి విప్లవ పితామహులు హీరాలాల్‌ చౌధురి, అరుణ్‌ కృష్ణన్నన్‌

1859లో ప్రారంభమైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్‌ బిద్రోహో 1860 వరకు ఒక సంవత్సరం పాటు బెంగాల్‌లో జరిగింది. వాణిజ్యం పేరుతో భారత్‌లోకి అడుగిడి ఆ తరువాత రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న బ్రిటిష్‌ వలసవాదులు ఎన్నో రకాలుగా మనదేశ సంపదను కొల్లగొట్టారు. రైతులకు అత్యంత ప్రతికూలమైన నిబంధనల ప్రకారం నీలిమం దును పండించమని బలవంతం చేసిన బ్రిటిష్‌ ప్లాంటర్లపై రైతులు చేసిన తిరుగుబాటే ఇండిగో తిరుగుబాటు లేదా నీలి విప్లవం. డా హీరాలాల్‌ చౌధురి మరియు అరుణ్‌ కృష్ణన్నన్‌లను నీలి విప్లవ పితామహులుగా పిలుస్తారు.
నీలిమందు ఒక పుష్పించే మొక్క. నీలిమందు మొక్క ఆకులను నీటిలో నానబెట్టినప్పుడు వాటి నుండి నాణ్యమైన నీలం రంగు ఉత్పత్తి అవుతుంది. ఆ రంగును వస్త్ర పరిశ్రమ లో వివిధ రకాల వస్త్రాలకు, ప్రత్యేకించి డెనిమ్‌ వస్త్రాలకు రంగుగా ఉపయోగిస్తారు. ఉష్ణమండల వాతావరణం మొక్కల పెరుగుదలకు అత్యంత అనుకూలమైనది. క్లిష్ట మైన వాతావరణ పరిస్థితుల కారణంగా నీలిమందు సాగు ఐరోపా దేశాలలో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. తక్కువ సాగు, అధిక డిమాండ్‌ కారణంగా, ఇండి గో ధర చాలా ఎక్కువగా ఉండి వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండేది. భారతదేశంలో ఇండిగోను ఎక్కువగా తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ పశ్చిమ బెంగాల్‌, రాజ స్థాన్‌లలో సాగు చేస్తారు. 13వ శతాబ్దం నాటికి, ఇటలీ, ఫ్రాన్స్‌ మరియు బ్రిటన్‌లలో బట్టల తయారీకి భారతీయ నీలిమందు విరివిగా ఉపయోగించబడేది. కాగా భారతీయ ఇండిగో చాలా తక్కువ పరిమాణంలో యూరోపియన్‌ మార్కెట్‌లకు చేరడంతో దాని ధర చాలా ఎక్కువగా ఉం డేది. దీంతో ఫ్రెంచ్‌ వారు బ్రెజిల్‌లోని కరీబియన్‌ దీవుల లోని సెయింట్‌ డొమింగ్యూలో ఇండిగోను సాగు చేయడం ప్రారంభించారు. ఉత్తర అమెరికాలో పెద్ద సంఖ్యలో ఇండిగో తోటలు ఏర్పాటు చేయబడ్డాయి.
భారత్‌లో నీలిమందు సాగు
భారత్‌ లో ఇండిగో తోటల పెంపకం మొదట 1777 సంవత్సరంలో బ్రిటన్‌ దేశస్థుడు లూయిస్‌ బొన్నాడ చేత బెంగాల్‌లోని నాడియా, పాబ్నా, రంగ్‌పూర్‌ జిల్లాలు మరియు హుగ్లీ సమీపంలోని సల్దానాలో ప్రారంభించ బడింది. నీలిమందు పంటల భారీ లాభదాయకతను చూసి న తర్వాత రైతులు ఆ పంటపై మొగ్గు చూపడంతో నీలి మందు సాగు విస్తీర్ణం పెరిగింది. నవాబులు ఈస్టిండియా కంపెనీ ఆధీనంలో ఉండడం మరియు ఇతర రాజకీయ పరిస్థితుల కారణంగా 1788లో బ్రిటన్‌ దేశపు మొత్తం ఇం డిగో డిమాండ్‌లో 30 శాతం భారతదేశం నుండి దిగుమతి అయ్యేది. ఇది క్రమంగా పెరుగుతూ 1810 నాటికి 95 శాతానికి పెరిగింది. పారిశ్రామిక విప్లవం ఉధృతంగా కొన సాగుతున్న 18 వ శతాబ్దాంతంలో బ్రిటిష్‌ పత్తి మరియు వస్త్ర పరిశ్రమ అనూహ్యంగా విస్తరించడంతో నీలిమందుకు అధిక డిమాండ్‌ ఏర్పడింది. 18వ శతాబ్దంలో ఐరోపా దేశా లలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇండిగో ఉత్పత్తి కూడా అంతే వేగంగా పెరిగింది. భారత్‌లో సమ శీతోష్ణ పరిస్థితుల కారణంగా ఇండిగో సాగుకు అత్యంత అనుకూలంగా ఉండడంతో సహజంగానే అది బ్రిటిష్‌ వారి దృష్టిని ఆకర్షించింది.
ఇండిగో సాగు పద్ధతులు:
ఇండిగోను సాధారణంగా ‘నిజ్‌’ మరియు ‘ర్యోతి’ అనే రెండు పద్ధతులలో సాగు చేసేవారు. నిజ్‌ వ్యవస్థలో రైతులు తమ స్వంత భూమి లేదా జమీందార్ల వద్ద నుండి కౌలుకు తీసుకున్న భూమిలో సాగు చేసేవారు. నీలిమందు సాగు శ్రమతో కూడుకున్నది కావడం మరియు పోషక విలువలు గల భూమి అవసరం ఉండడం చేత భారీ సంఖ్యలో కూలీలు మరియు అధిక విస్తీర్ణంలో సారవంత మైన భూమి అవసరమయ్యేది. అయితే బెంగాల్‌లో పెద్ద ఎత్తున వరి సాగు చేయడం వల్ల కూలీల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. అంతే కాక, అధిక విస్తీర్ణంలో నిజ్‌ పద్ధతిలో సాగు చేయడానికి ఎక్కువ సంఖ్యలో ఎద్దులు, నాగళ్లు మరియు అధిక పెట్టుబడి అవసరం కావడం సమ స్యలుగా మారడంతో ఈ విధానంలో నీలిమందు సాగుకు వినియోగించే భూమి మొత్తం భూమిలో 25 శాతానికి మాత్రమే పరిమితమయ్యేది.
‘ర్యోతి’ విధానంలో సాధారణంగా ఇండిగో ఉత్పత్తి కొనుగోలుదారు మరియు రైతుల మధ్య ఏర్పాటు చేసుకొనే ఒప్పందం ప్రకారం నీలిమందు సాగు జరిగేది. గ్రామ పెద్దలు రైతుల పక్షాన ఒప్పంద పత్రాలపై సంతకం చేసే వారు. ఒప్పందం ప్రకారం, ప్లాంటర్లు రైతులకు ముందస్తు వడ్డీతో కూడిన బయానా చెల్లించేవారు. సాధారణ మార్కెట్‌ తో పోలిస్తే ఈ ముందస్తు బయానాపై వడ్డీ రేటు తక్కువగా ఉండేది. అయితే రైతులు తమ వద్ద ఉన్న భూమిలో కనీసం 25 శాతం భూమిలో నీలిమందు సాగు చేయాలన్న షర తును ప్లాంటర్లు విధించేవారు. సాగుకు అవసరమైన అన్ని పరికరాలు, సామాగ్రిని వారు అందించగా నాట్లు, కోత వంటి మిగిలిన పనులు రైతులు చేపట్టేవారు. మొత్తం ఇం డిగో ఉత్పత్తిలో 75 శాతం ఈ పద్ధతి ద్వారానే సాగయ్యేది. యూరోపియన్‌ ప్లాంటర్లు తమ స్వీయ లాభాపేక్ష కోసం భారతీయ రైతులను వత్తిడికి గురిచేసేవారు. స్థానిక భూ స్వాములు మరియు జమీందార్లను వివిధ రకాలుగా ప్రలోభ పెట్టి రైతుల ద్వారా ఇండిగో సాగు చేయించేవారు. వారు జమీందార్ల నుండి తాత్కాలిక, శాశ్వత మరియు దీర్ఘ కాలిక ఒప్పంద ప్రాతిపదికన భూములను దక్కించుకోవ డంతో పాటు పోరంబోకు భూములను హస్తగతం చేసు కుని జమీందారీ హక్కులను సైతం పొంది భారతీయ రైతు ల ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఇండిగో సాగు చేయిం చేవారు. ఇందుకు వారు రైతులకు డాడోన్‌ అనే ఋణాలు ఇచ్చేవారు. రైతులు ఆ రుణాలను తిరిగి చెల్లించలేక జీవి తాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పాటు తమ కుటుంబంలోని తరువాతి తరాలను సైతం బానిసలుగా కుదుర్చాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడేవి. రైతులు ఇం డిగో సాగుకు నిరాకరిస్తే బ్రిటిష్‌ ప్లాంటర్లు వారిని ఋణాల తాకట్టు కింద బానిసలుగా మార్చడం, కిడ్నాప్‌ చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడగా, బ్రిటిష్‌ వలసవాద చట్టా లు కూడా వారికి అనుకూలంగా ఉండడం, జమీందార్లు కూడా వారికి వత్తాసు పలకడం భారతీయ రైతులను మరిన్ని ఇక్కట్లకు గురిచేసేవి. ఇండిగోను నిరంతరం సాగు చేయడం వల్ల నేలలోని సహజ పోషకాలు క్రమక్రమంగా క్షీణించడంతో ఆ నేలలు వరి సాగుకు ప్రతికూలంగా మారేవి. అలా ఇండిగో సాగు వరి సాగుకు ప్రతిబంధకం గా మారడం రైతులలో నిరసన జ్వాలలకు తెరలేపి అది క్రమంగా నీలి విప్లవానికి ఆజ్యం పోసింది.
బెంగాలీ నీల్‌ బిద్రోహో లేదా నీలి తిరుగుబాటు
1859లో నదియా జిల్లా, కృష్ణానగర్‌ సమీపంలోని చౌగాచా గ్రామంలో నీలి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంగాల్‌లో మొదట బిష్ణుచరణ్‌ బిస్వాస్‌ మరియు దిగం బర్‌ బిస్వాస్‌లు ప్లాంటర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. క్రమంగా అది ముర్షిదాబాద్‌, బీర్భూమ్‌, బుర్ద్వాన్‌, పాబ్నా, ఖుల్నా మరియు జెస్సోర్‌లకు దావానలంలా వ్యాపించింది. విప్లవ బాట పట్టిన తిరుగు బాటు దారులు ఇండిగో డిపోలను తగులబెట్టడంతో వారి పై విచారణ చేపట్టిన బ్రిటిష్‌ పాలకులు కొందరు విప్లవ కారులను బహిరంగంగా ఉరి తీశారు. ఈ అరాచకాన్ని అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు విచక్షణా రహి తంగా చితకబాదారు. ఈ తిరుగుబాటులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కుండలు పగులకొట్టడం, టపాసులు పేల్చడం ద్వారా తమ నిరసనను తెలిపారు. ఈ తిరుగుబాటు ముఖ్యంగా 1860లో పాబ్నా జిల్లాలో ఉధృ తంగా కొనసాగింది. పాబ్నా, నదియా జిల్లాల్లోని బరాసత్‌ డివిజన్‌ లోని రైతులందరూ పెద్ద ఎత్తున సమ్మెకు దిగి నీలి మందు సాగును తీవ్రంగా ప్రతిఘటించారు. నదియాకు చెందిన బిశ్వాస్‌ సోదరులు, మాల్దాకు చెందిన రఫీక్‌ మొం డెల్‌ మరియు పబ్నాకు చెందిన ఖాదర్‌ మోల్లా నేతృత్వంలో విప్లవకారులు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారు. బెంగాల్‌ మరియు కథ్‌ గరా ప్రాంతాలలో పెద్ద మొత్తంలో నీలిమందు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నీలి మందు తోటల పెంపకందారులు పాల్పడగా బ్రిటిష్‌ వలస పాలకులు కిరాయి దళాలతో వారిని బలవంతంగా అణిచి వేసారు. ఇండిగో ప్లాంటర్లతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘించినందుకు వందలాది రైతులపై కోర్టులలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నీలిమందు తిరుగు బాటు బ్రిటిష్‌ ప్రభుత్వం పై శక్తివంతమైన ప్రభావం చూప డంతో మార్చ్‌ 1860లో ఇండిగో కమిషన్‌ తక్షణ ఏర్పాటు కు దారితీసింది. నీలిమందు ఒప్పందాలను అమలు చేయ డానికి చట్టాన్ని ఆమోదించడంతో పాటు ఇండిగో సాగు సమస్యపై విచారణ చేపట్టాల్సిందిగా కమిషన్‌ ను ఆదేశించ డంతో, కమిషన్‌ ఆగష్టు 1860లో సమర్పించిన తన నివేది కలో నీలిమందు సాగు పద్ధతులను తీవ్రంగా విమర్చిం చడం గమనార్హం. ఇండిగో కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నవంబర్‌ 1860లో రైతులను నీలిమందు సాగు చేయమని బలవంతపెట్టలేమని, అన్ని వివాదాలను చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించేలా చూస్తామని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏదేమైనప్పటికీ నీలిమందు ప్లాంటర్లు అప్పటికే తమ కర్మాగారాలను మూసివేయడంతో 1860 చివరి నాటికి బెంగాల్‌ నుండి నీలిమందు సాగు పూర్తిగా కనుమరుగయ్యింది.
నీల్‌ దర్పణ్‌ నాటకం
మిర్రర్‌ ఆఫ్‌ ఇండిగో అని కూడా పిలువబడే నీల్‌ దర్పణ్‌ నాటకాన్ని ప్రఖ్యాత రచయిత దీనబంధు మిత్ర రచించి 1860 ఢాకాలో ప్రచురించారు. నీలిమందు తిరు గుబాటు ఇతివృత్తంగా రచించిన ఈ నాటకం రైతుల కష్టాలు, కడగండ్లు మరియు పోరాటాన్ని అత్యంత హృ ద్యంగా ఆవిష్కరించింది. ఇది నీలిమందు తిరుగుబాటుకు మద్దతు ఇవ్వాలని బెంగాలీ మేధావి వర్గాన్ని అర్థించింది. బెంగాలీ మేధావి వర్గం కూడా వార్తాపత్రికల ప్రచారాల ద్వారా రైతు ప్రయోజనాలకు మద్దతు పలుకుతూ సామూ హిక సమావేశాలు నిర్వహించడం, రైతుల ఫిర్యాదులపై వినతి పత్రాలను సిద్ధం చేయడం న్యాయ పోరాటాలలో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రముఖ పాత్ర పోషిం చారు. ఈ నాటకాన్ని కవి మైఖేల్‌ మధుసూధన్‌ దత్తా ఆంగ్లంలోకి అనువదించగా జేమ్స్‌ లాంగ్‌ ప్రచురించారు. ఈ నాటకాన్ని ప్రచురించినందుకు గాను బ్రిటిష్‌ వలస పాలకులు ఆయనకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒక యేడాది జైలు శిక్ష విధించారు. కాగా 1872 లో గిరీష్‌ చంద్ర ఘోష్‌ ద్వారా కోల్కతాలో నెలకొల్పబడిన నేషనల్‌ థియేటర్‌ లో వాణిజ్యపరంగా ప్రదర్శింపబడిన మొదటి నాటకం నీల్‌ దర్పణ్‌.
రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా భారతికి బాటలు వేసిన ఎన్నో ఉద్యమాలలో ఒకటైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్‌ బిద్రోహో లేదా ఇండిగో రివోల్ట్‌ గురించి తెలుసుకోవడమే కాక నేటి యువతకు కూడా తెలియచేస్తే వారికి మన పూర్వీకుల త్యాగాలపై అవగాహన ఏర్పడ డంతో పాటు దేశభక్తి పెంపొందే అవకాశం ఉంటుంది.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

- Advertisement -

-8885050822
9866656907

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News