Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Konda Lakshman Bapuji: సామాజిక న్యాయ సాధనే బాపూజీ లక్ష్యం

Konda Lakshman Bapuji: సామాజిక న్యాయ సాధనే బాపూజీ లక్ష్యం

నేడు కొండా లక్ష్మన్ బాపూజి వర్ధంతి

భారత స్వాతంత్ర సమర యోధుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీమంత్రి , రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు పొందిన మహానేత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ. పోరాటం, సాహసం, ధైర్యం, పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనాదక్షత, ప్రజాహిత సేవ, విలక్షణమైన నాయకత్వ లక్షణాలు గల సమ్మేళనమే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. స్వాతంత్ర సమర స్ఫూర్తి గల ఆయన పెత్తం దారి, దోపిడి సామాజిక వ్యవస్థ పై తిరుగుబాటు చేశాడు. దోపిడీకి గురవుతు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడు. క్విట్‌ ఇండియా ఉద్యమంకు అనుగుణంగా హైదరాబాదులో సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, హైదరాబాద్‌ రాష్ట్రం భారత దేశంలో విలీనం కావాలని ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప ధైర్యశాలి. ఆ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నందుకు కు 13 సార్లు అరెస్ట్‌ వారెంట్లు నాటి ప్రభుత్వం జారీ చేసినా భయపడలేదు.
ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1915 సెప్టెంబర్‌ 27న కనీస సౌకర్యాలు లేని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని, (ప్రస్తుతం తెలంగాణ) గిరిజన ప్రాంతమైన పూర్వ ఆదిలా బాద్‌ జిల్లా (ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్‌) లోని వాంకిడి గ్రామం లో పద్మశాలి సామాజిక వర్గం లో జన్మించాడు. తన మూడు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. రాజు రామ ఘర్‌ లో బాల్యము గడిపిన ఆయన ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్‌ లో, తన 20వ ఏట మిడిల్‌ స్కూల్‌ పాసై, 23 వ సంవత్సరం మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యాడు. 25వ ఏట హైదరాబాదులో న్యాయ వాద కోర్సు పాసై న అనంతరం 1945 లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తన జీవిత భాగస్వామి డాక్టర్‌ కొండ శకుంతలాదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తన కుమారుడు ఒకరు భారత వైమానిక దళం లో ఉంటూ దేశ సేవలో వీర మరణం పొందాడు.
హైదరాబాదులోని సచివాలయానికి సమీపంలో హు స్సేన్‌ సాగర్‌ తీరాన (ప్రస్తుతం నెక్లెస్‌ రోడ్‌ భూమి కొని జల దృశ్యం అనే పేరుతో గృహం నిర్మించుకొని అందులో నివ సించే వాడు. కానీ 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా, కోర్టుకు వెళ్లిన ఆయనకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. అతని అంత్యక్రియలు సైతం సెప్టెంబర్‌ 21, 2012లో జలదృశ్యంలోనే జరిగాయి.
స్వాతంత్రోద్యమ కాలంలో 1941లో మహాత్మా గాం ధీతో కలిసి, ఆయన అడుగు జాడల్లో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాగే దేశానికి స్వా తంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్‌ సంస్థానం నిజాం ప్రభువు ఆధీనంలో ఉన్న క్రమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1947 -48 మధ్యకాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1947 డిసెంబర్‌ 4న నిజాం నవాబు మీద బాంబు విసిరిన నారాయణ రావు పవార్‌ బృందంలో లక్ష్మణ్‌ బాపూజీ కూడా నిందితుడు. అజ్ఞాతంలో ఉండి తన ప్రాణాలు కాపాడుకున్నాడు.
రాజకీయ జీవితం-కీలకపాత్ర
ఆనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీపై ప్రభుత్వం విధించిన నిర్బంధం తొలగించిన తర్వాత 1945 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1952వ సంవత్సరంలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో అదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. 1957లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు కావడం వల్ల, పద్మశాలి సామాజిక వర్గం అధికంగా ఉన్న నల్గొండ జిల్లాకు, మారి 1957లో చిన్న కొండూరు, (ప్రస్తుతం భువనగిరి) నియోజకవర్గం నుండి గెలిచి 1957-60 మధ్యకాలంలో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత 1960-62 మధ్యకాలంలో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్‌, లఘు పరిశ్రమలు, చేనేత , టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రిగా, పదవులు నిర్వహించి ఆ శాఖలకు వన్నె తెచ్చాడు.
1967-69 కాలంలో కాసు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్య మంత్రిత్వంలో కార్మిక మరియు సమాచార శాఖ మంత్రిగా రెండు పర్యాయములు కేబినెట్‌ మంత్రిగా ప్రశంసనీయమైన పదవులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్‌.
1962లో మునుగోడు నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా విఫలమయ్యాడు. కానీ 1967-72 మరియు 1972-78 వరకు రెండుసార్లు భువనగిరి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంపిక సమస్య వచ్చినప్పుడు కూడా దామోదరం సంజీవయ్య గారిని అభ్యర్థిగా నియమించడంలో తన స్వగృహమైన జలదృశ్యంలో సమావేశమైనప్పుడు సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించడంలో తన పాత్ర ముఖ్యమైనది. నిమ్న వర్గాలకు, అన్యాయాలను, వ్యతిరేకతను ఎదుర్కొని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినీ , ముఖ్యమంత్రిగా చేయడం అనేది దేశంలోనే చారిత్రక సంఘటనగా చెప్పవచ్చును. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా, 1969 మార్చి 27న తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పదవి అవకాశాన్ని దిక్కరించి తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప తెలంగాణ వాదిగా చెప్పవచ్చును.
హైదరాబాద్‌ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంఘాన్ని స్థాపించాడు. బొజ్జం నరసింహులు సహకారంతో 1950 సంవత్సరంలో స్థాపించి బలహీన వర్గాల ఉద్యమానికి నాయకుడిగా గణనీయమైన కృషి చేశారు. వెనుకబడిన వర్గాల స్థితిగతులను మెరుగు పరచుటకు నియమించిన ‘కాక -కాలేల్కర్‌ ‘కమిషన్‌ రాష్ట్ర పర్యటన సందర్భంలో ముఖ్య పాత్ర పోషించాడు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్‌ టి, మైనారిటీ హక్కుల పరిరక్షణకు, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేశాడు. అనంతరాము కమిషన్‌, మురళీధర్‌ కమిషన్‌ లు బీసీల కొరకు చేసిన సిఫార్సుల అమలుకు, సర్దార్‌ గౌతు లచ్చన్నతో పాటు అనేక మందిని ఐక్యపరచి 1986లో బిసిల సభ తిరుపతిలో ఏర్పాటు చేసి, విజయవంతం చేయడంలో ఎనలేని కృషి చేసిన బాపూజీకి గుర్తుగా ఆ సభా వేదిక కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ‘ఆచార్య‘అనే బిరుదును ప్రదానం చేసింది.
ఒకవైపు దేశ స్వాతంత్య్రానికి పోరాటం చేస్తూనే, మరోపక్క వృత్తిదారుల దయనీయ స్థితిగతులను, మెరుగు పరచుటకు, వారిలో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు సహకార ఉద్యమాన్ని చేపట్టి, గ్రామ, గ్రామాన సహకార సంఘాలను నెలకొల్పాడు. అంతటితో తృప్తి చెందక జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసాడు. గీత, మత్స్య, కుమ్మరి, వడ్రంగి, కంచరి, చర్మ కారులు, మేదరి, ఉప్పర, ఇతర వృత్తుల వారికి సహకార సంఘాలను నెలకొల్పి వృత్తిదారుల ఆర్థిక పురోభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి చేశాడు. మహాత్మ పూలే, అంబేద్కర్‌ అందించిన ఆలోచన బడుగు బలహీన వర్గాలను ఏకం చేసే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నాయకుడు. తన జీవితం బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమని చెప్పవచ్చును.
ముక్కుసూటి స్వభావం, నాయకత్వ పటిమ, సమర్థతనుబట్టి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి పీఠానికి ముందున్నా కూడా కాంగ్రెస్‌ లోని అంతర్గత రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వ్యతిరేకించిన సందర్భంలో అసంతృప్తిగా ఉన్న ఆయన 1987లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో ముఖ్య పాత్ర వహిస్తూ, తెలంగాణలో చేనేత సహకార సంఘాల స్థాపనకు, పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేశాడు. ఆయనకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం 2014లో హైదరాబాదులో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని, శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చరల్‌, విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. ఆయన పుట్టిన రోజు, సెప్టెంబర్‌ 27న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో 2009-12 మధ్య తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, చలిని సైతం లెక్కచేయకుండా ఆయన 97 సంవత్సరాల వయస్సులో కూడా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేసిన నిఖార్సైన గొప్ప తెలంగాణవాది బాపూజీ ..

  • కామిడి సతీష్‌ రెడ్డి
    9848445134.
    (నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News