తెలంగాణ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర విస్మరించలేనిది. ఒక రకంగా పాటంటే తెలంగాణ–తెలంగాణ అంటే పాట అన్నంతగా మారింది నాటి ఉద్యమం. సామాన్య ప్రజలకు అర్థం కాని అనేక రాజకీయ, ఆర్థిక అంశాలను కూడా పాటే అర్థం చేయించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు నాటి పది జిల్లాల నిండా వరదై పారాయి. నూతన రాష్ట్రం సిద్ధించిన తరువాత సాహిత్య పునర్నిర్మాణ సమయంలో వివక్షకు, విస్మరణకు గురైన తెలంగాణ సాహిత్య ప్రక్రియలన్నింటి పైన అస్తిత్వ సోయి బలపడుతూ వస్తున్నది. పలు సాహిత్య సంకలనాలు వెలువడుతున్నాయి. ఇది మంచి పరిణామం. ఇంతకాలం విస్మరణకు గురైన సాహిత్యాన్ని ఒక్కచోట చేర్చి, భవిష్యత్ తరాలకు అందించే పనిని తెలంగాణ సాహిత్యకారులు, పరిశోధకులు తమతమ శక్తి మేరకు చేస్తున్నారు. ఇది అభినందనీయం. ఈ నేపథ్యంలో కొందరు కొన్ని క్షమించలేని చారిత్రిక తప్పులు చేస్తున్న తీరు సరిచేయడమే ఈ వ్యాసోద్ధేశ్యం.
ఇటీవల తెలంగాణ ఉద్యమ పాటలను వాగ్గేయకారుడు అందెశ్రీ సంపాదకత్వంలో ‘నిప్పులవాగు’ పేర ఒక ‘భారీ’ సంకలనంగా ప్రచురించడం జరిగింది. ఈ గ్రంధంలో నాటి వాగ్గేయకారుల పాటలు సాధ్యమైనంతగా పొందుపరిచే సాహసం చేశారు. ఇదే సమయంలో పుస్తకంలోని పేజీల సంఖ్యను పెంచి ఉద్గ్రంధపు రూపాన్ని సంతరింప జేయడానికి అందెశ్రీ అనేకమంది కవితలను కూడా ఇందులో పొందుపరిచారు. పుస్తకం అట్టపైన ‘‘తెలంగాణ ఉద్యమ పాట’’ అని ట్యాగ్ లైన్ పెట్టి, లోపల మాత్రం పాటలతో పాటు కవితలను చేర్చారు. నిజానికి తెలంగాణ కవిత్వ సంకలనాలు, ఉద్యమకాలంలోనే అనేకం వెలువడ్డాయి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరుల సంపాదకత్వంలో ‘మత్తడి’, జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘పొక్కిలి’, స్కై బాబ తదితరుల సంపాదకత్వంలో ‘జాగో జగావో’, వేముగంటి మురళి తదితరుల సంపాదకత్వంలో ‘మునుం’, అనిశెట్టి రజిత తదితరుల సంపాదకత్వంలో ‘జిగర్’, జగన్రెడ్డి సంపాదకత్వంలో జూలూస్, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి సంపాదకత్వంలో ‘1973 ప్రత్యేక తెలంగాణ కవిత్వం’ వంటి తదితర కవితా సంకలనాలు వెలుగు చూశాయి. ఇంతమంది సంపాదకులు, ఎంతోమంది కవులు తమ కవిత్వాన్ని తమ సంపుటాల్లో, సంకలనాల్లో ముద్రించుకున్న తరువాత మళ్లీ తెలంగాణ కవిత్వాన్ని ఈ పాటల గ్రంధంలో ఎందుకు జత చేయవలసి వచ్చిందో అందెశ్రీకే తెలియాలి.

పాటలను సంకలనం చేసేటప్పుడు పాటల మీదే దృష్టి సారిస్తే నిర్ధిష్టత ఉండేది. అట్లా కాకుండా ఇటు పాటల సంకలనం కాకుండా అటు కవితల సంకలనం కాకుండా చేయడం ఎందుకనేది సాహితీజీవులకు వచ్చే మొదటి సందేహం. పోనీ కవిత్వానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. వచన కవుల జాబితాలో నందిని సిధారెడ్డి వంటి వారివి నాలుగు కవితలు ప్రచురించిన అందెశ్రీ…జూలూరు గౌరీ శంకర్, అఫ్సర్, వంశీకృష్ణ, కోడూరి విజయ్ కుమార్, గుడిపల్లి నిరంజన్, చమన్ వంటి ఎందరో ప్రముఖ తెలంగాణ కవుల కవితలను విస్మరించారు. సంపాదకుడిగా అందెశ్రీ తన ముందుమాటలో కొందరి కవులవే ఎందుకు తీసుకున్నాను, ఎందుకు కొందరు కవులను పక్కన పెట్టాను అనే వివరణ ఇస్తే బాగుండేది. అలాగే మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన ధూంధాం వేదికల రూపకల్పనలో భాగమైన దళిత వాగ్గేయకారుడు ఎర్రఉపాలి వంటి వారు రచించిన తెలంగాణ ఉద్యమ పాటలకు కూడా ఈ మహా సంకలనంలో చోటు దక్క లేదు.
ఇక ఈ సంకలనలంలో అందెశ్రీ మలిదశ పాటలు, కవిత్వంతో పాటు 1969 ఉద్యమ పాట, సాయుధ తెలంగాణ పోరాట పాట అన్న మూడు ఉద్యమాల పాటలు, కవితలను ఇందులో చేర్చారు. 1969 ఉద్యమపాట అన్న విభాగంలో కూడా కేవలం పాటలే లేవు. కవితలు కూడా ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటల విభాగానికి ‘సాయుధ తెలంగాణ పోరాట పాట’ అని హెడ్డింగ్ పెట్టాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పాటలను ఒక్కచోట చేర్చే పనికి పూనుకొని వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వచ్చిన పాటలను ఈ సంకలనంలో ఎందుకు చేర్చినట్టు?! ఒకవేళ తెలంగాణ నేల మీద జరిగిన అన్ని ఉద్యమాల్లో వచ్చిన పాటలను అందెశ్రీ సంకలనం చేయాలనుకుంటే పాటను పదునెక్కించిన జననాట్యమండలి పాటలు, దళితోద్యమానికి జవజీవాలను అందించిన అంబేద్కరిజం పాటలను కూడా చేర్చాల్సి ఉండే. తెలంగాణ నేల మీద ప్రభంజనం సృష్టించిన అభ్యుదయ, విప్లవోద్యమ పాటను పక్కన పెట్టడం వల్ల అనేక మంది పాటకవులు గద్దర్, సంజీవ, దయ, గూడ అంజన్న, వంగపండు, శివసాగర్, సాహు, బి.నర్సింగరావు వంటి వారికి కూడా అన్యాయమే జరిగింది. మరి విప్లవ, దళిత ఉద్యమపాటలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో అందెశ్రీ చెప్పాలి.
ఇక అందెశ్రీ తనకున్న ‘పుటల యావ’తో ఈ భారీ సంకలనంలో తెలంగాణ రాష్ట్ర అనంతర పాటలు, కవితలను కూడా జతచేశారు. తనకు వ్యక్తిగతంగా పరిచయమున్న తెలంగాణ వ్యతిరేకుల రచనలు కూడా ఇందులో చేర్చడం తీవ్ర అభ్యంతరకరం. అట్ట మీద పేరు ‘తెలంగాణ ఉద్యమ పాట’ అని పెట్టినప్పుడు…మరి ఉద్యమానంతర రచనలు ఇందులో ఎందుకు చేర్చినట్టు? అలాగే ఉద్యమ వ్యతిరేకులైన వారి కవితలు, పాటలు ఎందుకు ఇందులో జతచేసినట్టు అనే ఊహకందని విషయం కూడా అందెశ్రీ మస్తిష్కానికే తెలియాలి. ఉదాహరణకు తెలంగాణ ఏర్పాటును మొదటి నుండి వ్యతిరేకించిన సీపీఎం అనుబంధ సాహిత్య సంఘాల, కార్యకర్తల కవితలు, పాటలు ఇందులో చేర్చడానికి ప్రత్యేక మినహాయింపు ఏముందో అందెశ్రీనే తెలంగాణ సమాజానికి చెప్పాలి.
ఇదే సంకలనంలో తెలంగాణ ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ రాసిన పాటలు కూడా ఉన్నాయి. నిజానికి ‘‘తెలంగాణ ఉద్యమపాట’’ మీద పరిశోధన చేసిన ఈ వ్యాసకర్త స్వయంగా కందికొండను తన పరిశోధన నిమిత్తం తెలంగాణ ఉద్యమంపై రాసిన తన పాటల వివరాలు ఇవ్వమని కోరాడు. అందుకు కందికొండ నిజాయితీగా తాను సినిమా పాటల బిజీలో ఉండడం వల్ల, సినీ ఇండస్ట్రీలో ఉండే తెలంగాణ ప్రతికూల పరిస్థితుల వల్ల తెలంగాణ ఉద్యమం కోసం తాను పాటలు రాయలేదని స్వయంగా తెలిపాడు. మరి అందెశ్రీ సంపాదకత్వం వహించిన ఈ గ్రంధంలోకి కందికొండ రాసినట్టుగా ఐదు పాటలు చేర్చబడ్డాయి. అవి నిజంగా కందికొండే రాశాడా? లేదా ఆయన పేరు మీద మరెవ్వరైనా రాసి ఇందులో పొందుపరిచారా? అన్నది సంపాదకునిగా అందెశ్రీ తెలియజేయాలి. తెలంగాణ వచ్చిన తరువాత టీవీల రేటింగుల కోసం రాసిన పాటలకు, ఉద్యమకాలంలో నిర్భంధాలను ఎదుర్కొని రాసిన పాటలకు ఒకే విలువను ఇవ్వొచ్చా?!
ఈ సంకలనంలో పాటలను పొందుపరిచిన క్రమం కూడా ఒక పద్ధతి ప్రకారం సాగలేదు. తనకు అనుకూలంగా ఉండే వారి పాటలను ముందువరసలో పెట్టి, ఆ తరువాతనే ప్రముఖులైన తెలంగాణ పాటకవుల పాటలను చెట్టుకొకటి పుట్టకొకటిగా విసిరేసినట్టు అప్రాధాన్యం చేశారు. ఎవరైనా సంపాదకులు పుస్తకం వేసేటప్పుడు కాలక్రమానుగతంగా రచనల్ని వరుసలో పొందుపరచడమో, లేదా పరిశోధనా పద్ధతిలో పేర్ల అకారాది క్రమంలో ఇవ్వడమో చేస్తారు. అందెశ్రీ సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో అలాంటి పద్ధతీపాడు ఏదీ లేదు. తనకు ఇష్టమొచ్చినట్టుగా పేర్చుకుంటూ వెళ్లడం దారుణమైన విషయం.
ఇక అత్యంత క్షమార్హం కాని విషయం ఈ పుస్తకాన్ని అచ్చువేయించడంలో అందెశ్రీ నెరపిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం. తెలంగాణ వాగ్గేయకారులు చేసిన అపారమైన కృషిని ఒక్క చోట చేర్చడం పేరుతో పుస్తక ప్రచురణ కోసం మతతత్వ పార్టీ నాయకుల, పోలీసు అధికారుల ఆర్థిక సహకారం తీసుకోవడం ఏ ఒక్క వాగ్గేయకారునికి కూడా ఆమోదయోగ్యం కాదు. ఒక రచయిత యొక్క రచనను వేలం వేసే హక్కు అందెశ్రీకి గానీ, మరొకరికిగానీ లేదు. ఒకవేళ అందెశ్రీ అట్లా తనకు అనుకూలమైన రాజకీయ పార్టీల పైసలతో పుస్తకం వేయదలుచుకుంటే ప్రతీ పాటగాడి వద్దనుండి విధిగా అనుమతి పత్రాన్ని పొందాలి. తెలంగాణలో ఏ ఒక్క వాగ్గేయకారుడైనా ఇట్లా తన పాటను మతతత్వ పార్టీ పైసలతో వేసే సంకలనాలకు ఇస్తాడా?! ఇందుకు అందెశ్రీ ఈ పుస్తకంలోని పాటకవులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. పుట్టెడు పేదరికంలో ఉన్నా సరే పాటను అమ్ముకోకుండా, పాటకోసం పదహారు ముక్కలైన బెల్లిలలిత వంటి ప్రాణమిడిసిన అమరకళాకారులను అందించిన నేల తెలంగాణ. మలిదశ ఉద్యమంలో ఇల్లు మరిచి, పుట్టిన ఊరును మరిచి ఊరూర పాటై పోటెత్తిన పాటకవులు మతతత్వ పార్టీల ఆర్థిక బేరసారాలకు తలొగ్గబోరు. దశాబ్దాలుగా వస్తున్న ఈ రాజ్యధిక్కార చరిత్రను తేజోమయం చేయకపోయినా పర్వాలేదుగానీ, సంకలనాల పేరుతో, మరోపేరుతో తెలంగాణ వాగ్గేయసాహిత్యానికి మచ్చ తేవొద్దు.
చివరగా ఇదే సంకలనాన్ని అందెశ్రీ పచ్చి బ్రాహ్మణీయ భావజాలంతో తీర్చిదిద్దాడు. నిజానికి పాటకవులు, కళాకారులంతా బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకులు. అందుకు కారణం వారంతా దళిత, బహుజనులు. పైగా విప్లవ కమ్యూనిస్టు భావజాల సంఘాల్లో పని చేసిన గతం వారిది. కులపిచ్చి లేనివాళ్లు. ఒకవైపు వాక్కులమ్మ అంటూ అందెశ్రీ పొర్లుదండాలు పెడుతూనే మరోవైపు శ్రీశ్రీవంటి కమ్యూనిస్టు కవులకు మూర్ఛనలు పోతాడు. అటైనా, ఇటైనా బ్రాహ్మణ భావజాలమే తనదిగా ఈ సంకలనం నిండా నిరూపించుకున్నాడు అంధశ్రీ. ఇదే పనిని మరో ముస్లిం సంపాదకుడు చేసి పుస్తకంలో అల్లాకో, ప్రవక్తకో దండాలు పెడితే ఏ వాగ్గేయకారుడైనా క్షమించేవాడా?! ఈ నిప్పులవాగు సంకలనం వెనక ఇన్ని దుర్మార్గాలు జరిపి, సంపాదకుడిగా అందెశ్రీ తెలంగాణ ఉద్యమపాటకు ఎంతటి మేలును చేశాడో, అంతటి కీడును కూడా చేసిన విషయం చరిత్ర మరువబోదు.
–డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత
