Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Rising migration: హద్దులు దాటుతున్న వలసలు

Rising migration: హద్దులు దాటుతున్న వలసలు

కొన్నేళ్ల క్రితం ఈ మేధావుల వలస దేశాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. అయితే, ఆర్థిక సరళీకరణల అనంతరం ఈ మేధావుల వలస సర్వసాధారణ విషయమైపోయింది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందడం దాదాపు తగ్గిపోయింది. అయితే, దేశానికి ఇప్పుడు ఒక కొత్త సమస్య ఎదురైంది. సంపన్నుల వలస మొదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా ఆందోళన కలిగి స్తోంది. విచిత్రమేమిటంటే, సంపన్నులే కాదు, సంపన్నులు కావడానికి అవకాశాలు ఉన్నవారు, అందుకు వనరులు కలిగినవారు కూడా విదేశాలకు పెట్టే బేడా సర్దుకుంటు న్నారు. విదేశాల్లోనే శాశ్వతంగా ఉండిపోవడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవ డానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ దారుణ పరిస్థితిని అడ్డుకోవడానికి కేంద్రం ప్రస్తుతం నడుం బిగించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌ ద్వారా కొద్దిగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదాయపు పన్ను మీద విధించే సర్చార్జిని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. అంతేకాదు, ఆదాయపు పన్ను గరిష్ఠ రేటును 43 శాతం నుంచి 39 శాతానికి తగ్గించడం కూడా జరిగింది.
దేశంలో అపర కుబేరులు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయి స్థిరపడడం ఆయేటి కాయేడు పెరిగిపోతోందని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు మాత్రమే కాక, ఉన్నతాధికార వర్గాలు సైతం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయని ఇటీవల రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. ఇక్కడ వ్యాపారాలు చేసి, పరిశ్రమలు స్థాపించి, ఐశ్వర్యవంతులై, విదేశాలకు వెళ్లిపోవడమనేది కేవలం పన్నుల కారణంగానే జరుగుతోందని భావించలేం. ఇందుకు ఇతరత్రా అనేక బలీయమైన కారణాలు కూడా ఉన్నాయి. చాలా మంది సంపన్నుల ఉద్దేశంలో భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడం, పరిశ్రమలు నెలకొల్పడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవ హారం. ఇక్కడి ప్రాథమిక సదుపాయాలు కూడా నాణ్యంగా ఉండవు. జీవితం కూడా నాణ్యంగా ముందుకు సాగదు. ఇక్కడ పాలకులు, అధికారులు రకరకాలుగా వేధింపు లకు గురి చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. ఏ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చెప్పడం సాధ్యం కాదు. ప్రభుత్వంలో విధానాల కొన సాగింపు ఉండదు. సంపన్నులు అత్యధిక సంఖ్యలో విదేశాలకు తరలి వెళ్లడానికి ఇవి కూడా ప్రధాన కారణాలే.
కాగా, 2022లో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయ పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు. అంతేకాదు, గత పదేళ్ల కాలంలో 14.19 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌర సత్వాన్ని స్వీకరించారు. ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఇండెక్స్‌’ (స్వేచ్ఛా ప్రపంచ సూచిక)లో అగ్రస్థానాలలో ఉన్న దేశాలకు వారంతా తరలి వెడుతున్నారు. అమెరికా ప్రభుత్వ అండదండలున్న ఫ్రీడమ్‌ హౌస్‌ అనే సంస్థ ఈ సూచికను రూపొందించింది. రాజకీయ స్వేచ్ఛ, పౌర హక్కులను మదింపు చేసి ఈ అంశాలలో అగ్రస్థానం లో ఉన్న దేశాల జాబితాతో ఈ సూచికను రూపొందించడం జరుగుతోంది. ఈ సూచికలో అగ్రస్థానాలను ఆక్రమించిన దేశాల జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్‌, పోర్చుగల్‌, మాల్టా దేశాలు ఉన్నాయి. స్వేచ్ఛా ప్రపంచ సూచికలో ప్రముఖ స్థానంలో ఉన్న దేశాల జాబితాలో గ్రీస్‌, పోర్చు గల్‌, మాల్టా వంటి దేశాలు కూడా ఉండడం విశేషం.
ఇక కనిష్ఠ స్థాయి పన్నులు, కనీస స్థాయి నిబంధనలు ఉన్న యు.ఎ.ఇ, సింగపూర్‌ వంటి దేశాలకు కూ డా భారతీయ సంపన్నులు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. చివరికి స్టార్టప్లను నెలకొల్పడానికి కూడా భారతీయులు యు.ఏ.ఇ, సింగపూర్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు తరలి వెళ్లడం జరుగుతోందని ఎకనామి క్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. భారీ పెట్టుబడులు పెట్టదలచుకున్న వారెవరూ భారత్‌కు ప్రాధాన్యం ఇవ్వదలచుకోవడం లేదని ఆ సర్వే తెలిపింది. ఇందుకు సంనన్నులుచెప్పే ప్రధాన కారణాలను కూడా ఈ సర్వే నివేదిక వివరించింది. అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉండవు. నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి. పన్నుల వ్యవస్థ దుర్భరంగా ఉంటుంది అని సంపన్నులు వాపోతున్నారు. భారత్లో స్థిరపడాలని ఎంతగా భావించినప్పటికీ, ఇక్కడపురోగతి చెందలేమన్న భయం వెంటాడుతుంటుందని వారు చెప్పారు. ఈ కారణాల వల్లే వారు భారత్‌ కంటే అతి చిన్న దేశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
భారత్లో అనుమతులు సమస్యలు, జటిలమైన పన్నుల వ్యవస్థలు, కఠినాతి కఠినమైన నిబంధనలు, థమిక సదుపాయాల లేమి వగైరాలు ఉన్న మాట నిజమే కానీ, వీటిని చాలావరకు సడలించడం జరిగిందని అధికారుల చెబుతున్నారు. అయితే, వీటికి మించిన సమస్యలు ఒకటి రెండున్నాయి. ఇందులో ఒకటి రాజకీయ స్వేచ్ఛ కాగా, రెండవది పౌర హక్కులు. సాధారణంగా ఈ సమస్యలను దేశంలోని రాజకీయ పార్టీ లు ఒకపట్టాన అంగీకరించవు. రాజకీయ పార్టీల నుంచి తరచూ వేధింపులు ఎదురవుతుంటాయి. ఆ పార్టీలు కంపెనీలకు రాజకీయ పక్షపాతాన్ని అంటగడుతుంటాయి. నిధులు డిమాండ్‌ చేస్తుంటాయి. అయితే, భారతదేశం విజయ వంతమైన ఆర్థిక వ్యవస్థగా, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎదగాలన్న పక్షంలో అది తన పౌరులకు శాంతియుత జీవనాన్ని అందించాలి. సాధారణ వ్యాపా రావకాశాలు సమకూరిస్తే సరిపోదు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News