Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Swaminathan: అన్నదాతల కోసం శ్రమించిన స్వామినాథన్‌

Swaminathan: అన్నదాతల కోసం శ్రమించిన స్వామినాథన్‌

హరిత విప్లవానికి చారిత్రక నేపథ్యం

హరిత విప్లవం మనదేశ వ్యవసాయరంగంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. హరిత విప్లవంతో దేశంలో పంటల ఉత్పత్తి ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం దక్కింది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ తన జీవితాన్ని సంపూర్ణంగా వ్యవసాయ రంగానికే అంకితం చేశారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనుక్షణం తపన పడ్డారు. ఆకలితో అల్లాడుతున్న సమయంలో భారత ప్రజలకు ఆహార భద్రత కల్పించారు.

- Advertisement -

ఆకలితో అల్లాడుతున్న అనేక దేశాలకు పట్టెడన్నం పెట్టిన మహానుభావుడు నార్మన్ బోర్లాగ్. ప్రపంచానికి హరిత విప్లవాన్ని పరిచయం చేసింది వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగే. అయితే వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకుచ్చిన హరిత విప్లవాన్ని, భారతదేశానికి పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా ఎమ్మెస్ స్వామినాథన్‌దే. మనదేశంలో హరిత విప్లవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1961-66 మధ్యకాలంలో మనదేశంలో వ్యవసాయరంగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి పెద్ద ఎత్తున గోధుమలను దిగుమతి చేసుకుంది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా అరవైవ దశకంలో దేశంలోని ఏడు జిల్లాల్లో ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంను ( ఐఏడీపీ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఐఏడీపీ పథకం కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదొక విశేషం. అయితే ఐఏడీపీ పథకంలో కొన్ని లోపాలున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా లోపాలను సవరించారు. పథకం పేరును ఇంటెన్సివ్ అగ్రికల్చరల్‌ ఏరియా ప్రోగ్రాంగా ( ఐఏఏపీ) మార్చారు. ఆ తరువాత ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలే చివరకు హరిత విప్లవానికి దారి తీశాయి.

హరిత విప్లవంతో వ్యవసాయంలో పెనుమార్పులు
భారతదేశ వ్యవసాయరంగానికి 1965 ఏడాదితో గొప్ప అనుబంధం ఉంది. భారతదేశంలో నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికిన హరిత విప్లవం ప్రారంభమైంది 1965లోనే. హరిత విప్లవంతో భారతదేశ వ్యవసాయరంగంలో ఎమ్మెస్ స్వామినాథన్ పెనుమార్పులు తీసుకువచ్చారు. సేద్యంలో కొత్త వ్యూహంతో పంటల ఉత్పత్తిని ఇబ్బడిమబ్బడిగా పెంచారు. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం కల్పించారు. గ్రీన్ రివల్యూషన్‌లో భాగంగా పంటల మార్పిడి, నీటి వసతి, యాంత్రీకరణ, పంటల రక్షిత విధానం, పరపతి సదుపాయం, మద్దతు ధర…అలాగే మరికొన్ని వ్యవసాయంలో కొత్తగా భాగమయ్యాయి. హరిత విప్లవం పుణ్యాన మనదేశంలో 1964 నుంచి పంటలకు మద్దతు ధరల విధానం ప్రారంభమైంది. ఆహారధాన్యాల ధరలకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందుకు కొనసాగింపుగా అదే ఏడాది భారత ఆహార సంస్థ ( ఎఫ్‌సీఐ) ఏర్పాటు అయింది. హరిత విప్లవంతో భారతదేశానికి కలిగిన లాభాలు అన్నీఇన్నీ కావు. గ్రీన్ రివల్యూషన్ ఫలితంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగింది. ప్రధానంగా వరి, గోధుమల ఉత్పత్తి ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. వాస్తవానికి 1960ల్లో వరి ఉత్పాదకత 10 క్వింటాళ్లుగా ఉండేది. 2011-12 నాటికి అదే వరి ఉత్పత్తి 23 క్వింటాళ్లకు పెరిగింది. అలాగే గోధుమ ప్రొడక్షన్‌ కూడా ఎనిమిది క్వింటాళ్ల నుంచి 31 క్వింటాళ్లకు పెరిగింది. అంతేకాదు హరిత విప్లవ ప్రభావం వాణిజ్య పంటలపై కూడా పడింది. ముఖ్యంగా 1973-74 తరువాత వాణిజ్యపంటల ఉత్పత్తి ఎక్కువైంది. దీంతోపాటు వ్యవసాయరంగంలో కాయధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది హరిత విప్లవం. దీంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో యువకులకు ఉపాథి అవకాశాలు పెరిగాయి. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. వీటన్నిటి ఫలితంగా దేశంలో పేదరికం తగ్గింది. హరిత విప్లవం ద్వారా సాధించిన వ్యవసాయాభివృద్ధి, 1991 తరువాత తగ్గింది. ఈ తగ్గుదలకు అనేక కారణాలున్నాయి. సేద్యానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలకు కొరత ఏర్పడింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అవసరమైన మేరకు ఉపయోగించుకోకపోవడం, పరపతి సౌకర్యాల కొరతను ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏమైనా మనదేశంలో హరిత విప్లవం అనూహ్య విజయం సాధించింది. ఈ విజయం వెనుక ఎమ్మెస్ స్వామినాథన్ శ్రమ, వ్యవసాయరంగంపై ఆయనకున్న అవగాహన, అన్నదాతలను కష్టాలనుంచి గట్టెక్కించాలన్న తపన, అన్నీ ఉన్నాయి. ఎమ్మెస్ స్వామినాథన్ మరణంతో భారత వ్యవసాయ రంగం ఓ గొప్ప దార్శనికుడిని కోల్పోయింది.

బెంగాల్ కరువుకు చలించిపోయిన స్వామినాథన్
డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు ఏడో తేదీన జన్మించారు. తండ్రి సాంబశివన్ పేరున్న సర్జన్‌. ఒకదశలో తండ్రి బాటలో తాను కూడా డాక్టర్‌ కావాలనుకున్నారు స్వామినాథన్‌. అయితే 1943లో వచ్చిన బెంగాల్ కరువును చూసి ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలికేకల నుంచి బయటపడేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో మెడిసిన్ చదవాలన్న మైండ్‌సెట్‌ మార్చుకున్నారు. వైద్యం నుంచి వ్యవసాయంవైపు మళ్లారు స్వామినాథన్. మద్రాస్ అగ్రికల్చర్‌ కాలేజీ నుంచి డిగ్రీ తీసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీలో అగ్రికల్చర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఎమ్మెస్సీ పూర్తి చేశాక యూపీఎస్సీ పరీక్షలు రాశారు స్వామినాథన్‌. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయితే అగ్రికల్చర్ సైంటిస్ట్ కావడం కోసం ఐపీఎస్‌ కొలువును తోసిపుచ్చారు. ఇదే సమయంలో ఆయనకు యునెస్కో ఫెలోషిప్ వచ్చింది. దీంతో నెదర్లాండ్స్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ్నుంచి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడే వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. అక్కడ బంగాళాదుంప జన్యు మార్పిడికి సంబంధించిన ప్రయోగాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
1954లో భారతదేశానికి తిరిగివచ్చారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు కొనసాగించారు. ఆ తరువాత వ్యవసాయ శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేశారు.1979లో స్వామినాథన్‌ను వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించింది. వ్యవసాయరంగానికి చేసిన సేవలకుగాను స్వామినాథన్‌ను అనేక అవార్డులు వరించాయి. రామన్ మెగసెసే, ఇందిరా గాంధీ శాంతి బహుమతి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 1989లో పద్మవిభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్యకాలంలో పార్లమెంటు సభ్యుడిగా స్వామినాథన్ సేవలందించారు. వ్యక్తిగత విషయాలకు వస్తే స్వామినాథన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురూ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు కావడం విశేషం.

ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్‌, 63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News