Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Alisetti Prabhakar: అలిశెట్టి ప్రభాకర్ యాదిలో! వ్యాసాంజలి

Alisetti Prabhakar: అలిశెట్టి ప్రభాకర్ యాదిలో! వ్యాసాంజలి

తెలంగాణ శ్రీశ్రీ అలిశెట్టి

” ప్రపంచ మొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం” అన్న కొటేషన్ చదివినప్పుడు బహుశా శ్రీశ్రీ ఈ కవిని ఉద్దేశించి అన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అతను ఒక కవిత్వ పిపాసి తన కవితలతో మానవ జాతిని జాగృతం చేయాలని నిరంతరం తపిస్తూ ఉండేవారు. తన కవిత్వ దాహం పూర్తిగా తీరక ముందే అనారోగ్య సమస్యలతో అనంతలోకాలకి వెళ్లిపోయి, తన కవిత్వాలను జ్ఞాపకంగా మనకి వదిలేసి వెళ్లిన అతనే అలిశెట్టి ప్రభాకర్. ఈ పేరు చెప్పగానే తెలియని సాహిత్యకారులు లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహిత్యంలో ఇతని మజిలీ చెరగని ముద్రవేసింది. బ్రతికింది కొంతకాలమే కానీ తన రచనలతో చిరకాలం గుర్తుంది పోయేలా చిరంజీవి అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అలిశెట్టి చినరాజాం, లక్ష్మీ అనే దంపతులకు 12 జనవరి 1954వ సంవత్సరంలో జన్మించారు. క్షయ వ్యాధి సోకి 12 జనవరి 1993లో తుదిశ్వాస విడిచారు. ఒక వ్యక్తికి జయంతి, వర్ధంతి రెండు ఒకే తేదీన రావటం చాలా అరుదు. ఇతను మొదట ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ప్రారంభంలో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత.
జగిత్యాలలో సొంత ఇల్లు. ఆ ఇంట్లోనే తన తండ్రి కాలం చేసే వరకు ఉండి తల్లి, సోదరునితో జీవిస్తూ ‘స్టూడియో పూర్ణిమ’ (1976) నడిపించి, ఆర్థిక స్వావలంభన కోసం కరీంనగర్ లో ‘స్టూడియో శిల్పి’ (1979) అనే పేరుతో మరో స్టూడియోని ఏర్పాటు చేసుకున్నాడు. జగిత్యాల నుండి కరీంనగర్ కు మారవద్దని పెద్దలు, మిత్రులు చెప్పినా వినకుండా తన మకాంను మార్చుకున్నాడు. తదనంతర కాలంలో కరీంనగర్ నుండి హైదరాబాదుకు తన నివాసాన్ని మారడానికి ప్రధాన కారణము ఒకరోజు రాత్రిపూట కరీంనగర్ బజార్లో నడిచి పోతున్నప్పుడు పోలీసులు ప్రభాకర్ ను చితకబాదారు చేతికి గాయాలయి మనసు కకావికలం అయ్యి ఏం చేయలేని స్థితిలో హైదరాబాద్ కి పయనమయ్యాడు. విద్యానగర్ లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983)ను ఏర్పాటు చేసుకున్నాడు. ముళ్ళబాటలాంటి అలిశెట్టి జీవితంలోకి పాదరక్షలు లేకుండా ప్రవేశించి ఆయన బాధలను సుతిమెత్తగా భరించి వారి జీవితానికి భరోసాను ఇచ్చింది అలిశెట్టి సహచరి భాగ్య. తన కుమారులు సంగ్రామ్, సంకేత్, భార్య భాగ్యతో చివరి వరకు హైదరాబాదులోనే నివాసం ఉన్నారు. అలిశెట్టి ప్రభాకర్ మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఇటీవలి కాలంలో వీరి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తామంటూ హామీలు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అలిశెట్టి కుటుంబానికి హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు. ఈ మేరకు జియాగూడలో ఇల్లు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిరంతరం మనిషిలో పోరాట పఠిమ కలిగి ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో విజయ కేతనం ఎగుర వేయగలమని బలంగా నమ్మిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. వీరి కవిత్వంలో అంతుచిక్కని విషయాలు లేకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి రాశాడు. సాహిత్య పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం అర్థం చేసుకునేలా ఉత్సాహభరితమైన కవిత్వం రచించాడు. ఉదాహరణకు ‘దృశ్యం’ అనే కవితలో శ్రమజీవుల కష్టాన్ని కళ్ళకు కడుతూ ఒక వాక్యం రచించాడు ‘పాలరాతి బొమ్మైనా, పార్లమెంటు భవనమైనా, వాడు చుడితేనే శ్రీకారం వాడు కడితేనే ఆకారం’ అనే అంత్యానుప్రాసను ఉపయోగించి శ్రామిక సౌందర్యాన్ని పదాలలో అందంగా పొందుపరిచారు. ‘సిటీ లైఫ్’ కవిత ద్వారా నగరాలలో ఉండే దుర్భర జీవితాన్ని ఆసాంతం తెలియజేశారు. ప్రభాకర్ వ్యక్తిత్వ పరంగా స్నేహశీలి, నికార్శైన మనిషి నిరంతరం కష్టపడి పనిచేసే కష్టజీవి. అందరికీ తెలిసిన వాడుక పదాలతోనే కవిత్వం అల్లడం తన ప్రత్యేకత. కుంచెకు రంగులద్ది బొమ్మలు గీయడం, కలంతో కవిత్వం రాయడం, కెమెరా లెన్స్ లతో అందమైన ఫోటోలు తీయడమే తనకు తెలిసిన వృత్తి.
ఎవరైనా మంచి పనిని తల పెడితే తన వంతు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉండేవాడు. ఆపదలో ఉన్న తన స్నేహితులను చేరదీసే వాడు. తనలాంటి దీనంగా జీవించే పేద జీవితాలకు ఏనాటికైనా మంచి మార్గం దొరక్క పోతుందా! అంటూ నిత్యం కలలు కనేవాడు. ప్రభాకర్ మరణించే వరకు కూడా సామాజిక సమరంను స్వప్నిస్తూనే తన కలాన్ని ఝుళిపించాడు.
ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. పదిమందికి ఉపయోగపడే కవిత్వం రాసి పాటకులలో మంచి మార్పు తేవడం కోసం నిరంతరం ఆలోచనల మధ్య సంఘర్షణకు లోనయ్యాడు. తన కవిత్వంతో పాఠకులలో పఠన యోగ్యతకై నిరంతరం పరితపించాడు. తన కవిత్వానికి వెన్నుదన్నుగా ఉండేలా కుంచెతో చిత్రాలను గీసి, సందర్భానికి తగిన బొమ్మల్ని కెమెరాలతో బంధిస్తూ చేర్చేవాడు. ఎంతో శ్రమించి తయారు చేసిన పోస్టర్ కవితలను తయారు చేసి వందల కొద్ది ప్రదర్శనకు పెట్టేవాడు. అర్థం కాని సంక్లిష్టమైన కవిత్వానికి ఒక కొత్త రూపం ఇచ్చి కవిత్వంలో సరళ పదాలు ఉపయోగించి కొత్త తరానికి నూతన శకాన్ని ఆరంభించిన ప్రయోగికుడు. సమాజాన్ని కవితా వస్తువుగా చేసుకొని తన కవితలను రాశాడు.
ఆంధ్రజ్యోతి దినపత్రికలలో వరుసగా ఆరేళ్లపాటు ‘సిటీ లైఫ్’ పేరుతో దాదాపు 1425 కవితలు రాసి పంపాడు. ఈ దినపత్రికకు పంపిన కవితలలో ప్రజాదారణ పొందిన కొన్ని కవితలను ఎన్నుకొని 418 కవితలను ‘సిటీ లైఫ్’ పేరుతోనే 1992లో అచ్చు వేశాడు. ప్రభాకర్ కి తన చివరి రోజుల్లో ‘సిటీ లైఫ్’ కవితలపై వచ్చిన పారితోషకం మీరే కొన్నాళ్లు జీవించాడు. తన అనారోగ్యం పేదరికం వల్ల చాలా కవితలు అముద్రితంగానే మిగిలిపోయాయి. తన కవితలు ఏదైనా పత్రికలలో వస్తే కనీసం ఆ పత్రికను కొనే ఆర్థిక స్తోమత కూడా లేనంత దీనస్థితి కలిగిన జీవితాన్ని అనుభవించాడు. అలిశెట్టి ప్రభాకర్ తన కవితల ద్వారా సమాజంలో ఒక నూతన ఒరవడిని సృష్టించాడు. కానీ ఏనాడు కూడా సన్మానాలు, జరిపించుకొని పుస్తక పరిచయ సభలు నిర్వహించాలనే హంగు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాడు. తన రచనలను ప్రజలకు అందుబాటు ధరలలో ఉండే విధంగా చౌకగా లభించేలా అచ్చు వేయించాడు. ఒక్కోసారి కొన్ని రచనలను అందరికీ ఉచితంగా పంచేవాడు. క్షయ వ్యాధి తనను ఎంత బాధిస్తున్న ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయలేదు.
అలిశెట్టికి స్త్రీలు అంటే అమితమైన గౌరవం’ వేశ్య’ అనే కవితలో స్త్రీలను గురించి ఇలా రాశారు. “నువ్వి నాగరిక ప్రపంచంలో స్పృహ కోల్పోయినంతకాలం నీ చీర వెండితెర, నీ పైట ప్రకటనల కాన్వాసు, నీ ప్రేమ రాసలీల” ఈ కవిత ద్వారా మహిళలను ‘చీర, పైట, ప్రేమ’ అనే మూడు విషయాలలో జాగ్రత్తగా నడుచుకోవాలని సూచన చేశాడు. తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై’ అంటూ తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన కవి, తెలంగాణ శ్రీశ్రీగా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్. రోజులు గడిచే కొద్ది క్షయ వ్యాధి తనను తొలిచి వేస్తున్న కానీ తన రచనల ద్వారా సమాజంలో నూతన మార్పు తీసుకురావాలని అనునిత్యం తపించిన సామాజిక స్పృహ కలిగిన అలిశెట్టి ప్రభాకర్ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని పదిలపరుచుకున్నది తన జీవితం.
‘ఎర్ర పావురాలు’ కవితలో ప్రజలను పాలించే ప్రజా నాయకుల మనస్తత్వాన్ని ‘నిర్మొహమాటం’ అనే కవితలో ‘ప్రజా నాయకులు తమని గెలిపించిన ఓట్లనే ఇంకా లెక్క పెట్టుకుంటూ మురిసిపోతున్నారేమో, ప్రజాసేవకి అప్పుడే ఏమంత తొందరొచ్చిందని కాబోలు అంటూ చురక విసిరాడు. సజీవులను గురించి ఇలా ‘నీ చేతులు అచేతనంగా వాలిపోతే నేనూరుకోను’ అని అన్నాడు. విత్తనం ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే వాక్యాన్ని ‘మొలకెత్తకముందే అలసిపోయి చచ్చిపోకు, చచ్చిపోతూ బలవంతంగా మొలకెత్తకుండా లోలోపలే సమాధి వైతే మట్టి కూడా నిన్ను సహించదు’ అంటూ స్ఫూర్తి వాక్యం రాశాడు. సిటీలో ఉండే మనుషుల బిజీ జీవితాలను చెబుతూ ఎంత చేసినా ఎవడికి తీరిక దక్కదు కోరిక చిక్కదు. “మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, వేటిలోనూ సహజత్వం లేదు అన్నాడు. కొందరికి రెండు కాళ్లు, రిక్షావాడికి మూడు కాళ్లు, ఉన్నవాడికి నాలుగు కాళ్లు ఉండి అందరూ కాంపిటీషన్ లో పాల్గొంటున్న వారే” అని అన్నారు. నగరం అర్థం కాని రసాయనశాల అంటూ అందమైన స్మశాన వాటికతో పోల్చాడు నగరం చిక్కు వీడని పద్మవ్యూహం చెక్కుచెదరని మయసభలా ఉందని అన్నాడు.
మంటల జెండాలు కవితా సంపుటిలో శ్రామిక జీవనం గురించి ‘బిందువు అనంతం’ అనే కవితలో ‘ఒక చెమట బిందువును వీపులికరిస్తే ప్రతిఫలిస్తా యెన్నో కళాఖండాలు’ అన్నాడు. నిరుద్యోగుల వెతలను ‘చెదలు’ అని కవితలో ‘కష్టపడి చదువుకున్నందుకు పర్యావసనం నిరుద్యోగం, కేరాఫ్ రోడ్లు, ఇంటర్వ్యూలు, విశేషాలు ఇంతే సంగతులు ఈ రోజుల్లో రూపాయి బిళ్ళ లాంటి కళ్ళు కలిగి ఉంటేనే ఉద్యోగం మన కంటి పరమాణువు కేవలం డిగ్రీ కాగితాల మీదే ఆధారపడితే భవిష్యత్తు అంతా చెదలే చెదలు అని అన్నాడు. ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బాహాటంగా ఏర్పరచుకున్న స్వార్థపు వలయంతో పోల్చాడు.
జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి ఇక బ్రతకడమే నిష్ప్రయోజనం అనుకుంటూ చనిపోదామనుకున్న వారికి మంచి మోటివేషన్ ‘జీవితం’ అనే ఈ కవిత ద్వారా ఈ వృక్షం నువ్వు ఉరిపోసుకోవడానికి వినియోగించబడ్డది కాదు, స్వయంకృషిని శాఖోప శాఖలుగా విస్తరింప చేసుకోమని అంటూ జీవిత పరమార్ధాన్ని తెలిపాడు. మనిషి తన జీవితంలో సమస్యలకు భూత,వర్తమానాలకు, భవిష్యత్తు కాలాలకు వెళ్లి వస్తూ ఉంటాడు. ‘కాలం గొలుసు’ అనే కవితలో గతం కనిపించని పరమాణువు జ్ఞాపకాల మైక్రోస్కోప్ తో చూస్తే ఎంతో పెద్దది. వర్తమానం సమస్యల కొలబద్ద, భవిష్యత్తు కాలగర్భంలో పెరిగే శిశువు అని నూతన కోణంలో ఆవిష్కరించాడు. ‘చురకలు’ అనే కవితా సంపుటిలో సమాజంలో అసమర్థులని గురించి రాస్తూ ‘పబ్లిక్ గా అన్యాయమని అరవలేని వాడు ఓపిగ్గా ఒక్కొక్కరితో తప్ప ఎలుగెత్తి ఏ అంశాన్ని చాటలేడు’. పెళ్లిచూపుల్లో నవవధువు స్థితిని మృగాల నడుమ బిక్క చచ్చిన లేడీ పిల్లతో పోల్చి చూపారు. విద్యార్థుల జీవితంలో అతిపెద్ద సమస్య అయినా చదువును గురించి ‘పరీక్షలు అంటే జలధరింపులు, పుస్తకాలు అంటే ఆవలింపులు’ అని చమత్కరించాడు.
రక్త రేఖ అనే కవిత్వ సంపుటిలో నేటి కాలపు పెట్టుబడిదారీ విద్యావ్యవస్థలో విద్యార్థుల స్థితిగతుల్ని ‘ఈ తరం క్రీస్తు కవిత’లో ‘బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతున్న ఇంకెందరు నిరుద్యోగ క్రీస్తులో అన్నాడు. ‘సంక్షోభగీతం’ కవితా సంపుటిలో ఒక బాట ఒకచోట దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే రూపాలు గురించి అణ్వస్త్రల తెరపై కృత్రిమ శాంతి కపోతం ఎగిరి బుసలు కొట్టే డాలర్ విష సర్పం రూపాయి వదిలి అందంగా కనిపించింది అన్నాడు. అద్దె ఇంట్లో నివసించే వారికి యజమానికి మధ్య బంధం ‘సిటీ లైఫ్’ అనే కవితా సంపుటిలో ఇంటి యజమానులు ఎప్పటికీ కొట్టుడు పోనీ సరి, బేసి సంఖ్యలే. నగర జీవితం గురించి హైదరాబాద్ అనే మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా తమ జీవితాలను నెట్టుకు రావడం పరిపాటి. ‘మరణం నా చివరి చరణం కాదు’ కవితా సంపుటిలో మనుషుల్లో ఉన్న అచేతన తత్వాన్ని తట్టి లేపేలా ‘మార్చుకో’ అనే కవితలో ఆయుధం కొసమీద ఆదమరిచి నిద్రపోతున్నా వాడ….లే, ఆయుధం బరువు కింద అనగారి బతుకుతున్న వాడా…..లే చుట్టూరా ముసురుకున్న ప్రమాద సూచికల్ని నువ్వు గోగుపూలనుకో మార్చుకో అంటూ మార్పుని కోరాడు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చూడడానికి రూపంలో సంక్షిప్తతని, వస్తువులో జీవిత విస్తృతిని సమాజపు లోతుల్ని ఇమిడ్చాడు. సమాజపు మార్పుని ఆకాంక్షించి పేదరికంలో మగ్గి బలైన ఆదర్శ కవి.
శ్రీశ్రీ, జాషువా కవిత్వాల తర్వాత అంతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన కవిత్వం ఏదైనా ఉందంటే అలిశెట్టిదే అనడంలో అతిశయోక్తి లేదు. నిరంతరం సమాజ హితం కోరుతూ నూతన మార్పును ఆకాంక్షించి పేదరికం అంటే పేదరికంలోనే పరమపదిస్తూ ‘మరణం నా చివరి చరణం కాదు సమరమే నా అంతిమ చిరునామా’ అని ప్రకటించుకున్న స్నేహశీలి అలిశెట్టి. మనిషి కనుమరుగై పోవచ్చు కానీ తన కవిత్వం ద్వారా పాఠకుల హృదయాలలో అనునిత్యం స్మృతి పథంలో ఉంటారు.
అలిశెట్టి ప్రభాకర్ రచనలలో తన కవిత్వం ద్వారా సమాజంలో నూతన మార్పు తేవడానికి ‘ఎర్రని పావురాల’కు ‘మంటల జెండాల’ను దివిటీలుగా కట్టి జీవిత పయనంలో దారి తప్పినవారికి ‘చురకలు’ వేస్తూ తన కవిత్వంతో ‘రక్తరేఖ’ను గీసి మానవ జీవితపు ‘సంక్షోభ గీతా’న్ని వినిపించి ‘సిటీ లైఫ్’ అయినా కానీ స్వేచ్ఛగా బ్రతకాలని తన కవితల ద్వారా ఎప్పుడు స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటూ ‘మరణం నా చివరి చరణం కాదు’ అంటూ నిరంతరం మన వెంట ఉండే తీయని జ్ఞాపకాన్నవుతా అంటూ సుమధుర వచనాలను మన జీవితాలపై చల్లి దివికేగిన కవితా మూర్తిని స్మరించుకుంటూ…..

- Advertisement -

పల్లె సతీష్
తెలుగు పరిశోధక విద్యార్థి
ఉస్మానియా విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News