Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: అనంతయానంలో ఆదివాసీల జీవనచిత్రం

Telugu Literature: అనంతయానంలో ఆదివాసీల జీవనచిత్రం

గిరిజనుల జీవన విధానం కళ్లకు కట్టే..

ఆధునిక తెలుగు సాహిత్యంలో అంతర్భాగం అవుతున్న గిరిజన సాహిత్యం ప్రారంభంలో మౌఖికంగా తర్వాత కాలంలో ఆంత్రోపాలజిలో ఒక భాగంగా ఉండేది, అనంతర కాలంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలకు ఎంతో ప్రధాన వస్తువుగా ఉన్న ఈ గిరిజన సాహిత్యం నేడు ఎంతో పరిణితి చెంది ప్రామాణిక దశకు చేరుకుంది.
ప్రభుత్వాల లక్ష్య శుద్ధితో గిరిజన యువతలో అక్షరాస్యత శాతం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉద్యోగులుగా రచయితలుగా ఎదుగుతున్న శుభ తరుణం ఇది. అందులో భాగంగానే ఆదివాసి తొలి వ్యాసకర్తగా చరిత్రలో నిలిచిన ఆధ్యాపక రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ కలం నుంచి వెలువడిన వ్యాస సంపుటి ఈ “అనంతయానం” సుమారు పాతికేళ్లపాటు ఆయన చేసిన అక్షర ప్రస్థానంలో అనేక ప్రామాణిక వ్యాసాలు వెలువడ్డాయి, ఇవి అడవి బిడ్డల చరిత్ర, సంస్కృతి, సమకాలీన సమస్యలు, విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాలు, సామాజిక జీవన పోరాటాలు, ఆధ్యాత్మిక సంబరాలు, తదితర అంశాలుగా విభజించబడి కూలం కశంగా సవివరమైన ప్రామాణిక గణాంకాలతో పొందుపరచబడ్డాయి.
ఇటు సమాచారానికి అటు పరిశోధనలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈ గిరిజన వ్యాస రత్నాలన్నిటిని ఒకచోట రాసి పోసి అందించినట్టు పుస్తక రూపంలో వెలువరించిన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ గారి అక్షర కృషి అభినందనీయం ఆచరణీయం. నిరంతర పరిశీలన అధ్యయనం ద్వారా తన జాతి జనుల అభివృద్ధి కోసం రచనల పరంగా గుమ్మడి గారి కృషిలో ఆవేదన అడుగడుగునా అర్పిస్తుంది, తన జాతికి చెందిన మరుగునపడ్డ వీరుల వివరాలు గురించి గతంలో వివరించిన ఈ రచయిత ఇప్పుడు అదే బాణిలో తన జాతి సంస్కృతిలోని చరిత్ర పుటలు తిరగేస్తూ అనేక ఆసక్తికర విషయాలు ఆవిష్కరించారు.
ఇప్ప చెట్టుకు, పచ్చబొట్టుకు, అడవి బిడ్డలతో గల అనుబంధం గురించి ఇందులో ఎంతో శాస్త్రీయంగా చారిత్రకంగా తెలిపారు. వారి పెళ్లిళ్లలోని నిరాడంబరత సంస్కృతిని ప్రతిబింబించే నృత్యం సొగసులు గురించి చెబుతూ ఆదిమ గిరిజనులు అంటే ఆదివాసీలే అని సూత్రీకరించారు, అంతటితో ఆగకుండా అడవి బిడ్డలను ఆత్మ గౌరవ ప్రతీకలు అని నిరూపించారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ఆదివాసీలు నాటి నిజాం కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల దాకా ఎదుర్కొన్న బాధల గురించి వివరించారు, అంతేగాక ఆదరణ కోల్పోతున్న ఆదివాసి వైవిధ్యం గురించి కూడా చర్చించారు.
ఆదివాసుల భూసంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 1/70 చట్టంకు సంబంధించిన పూర్వ చరిత్ర దాని నిర్మాణం అనంతర కాలంలో దాని అమలులో అధికారులు, గిరిజనేతరులు చేస్తున్న కుతంత్రాల కారణంగా చట్టం వల్ల ఆదివాసులకు జరుగుతున్న నష్టం అరణ్య రోదనగా అభివర్ణిస్తూ అధికారులను ఆలోచింపజేశారు, అలాగే అటవీ హక్కుల చట్టం, పె సా, గిర్ గ్లాని, నివేదికలు తదితర అంశాల గురించి వివరించిన విషయాల వల్ల వ్యాస రచయిత పరిశీలన, ఆవేదన, కూలంకషంగా అర్థమవుతాయి.
బహుళ ప్రజాదరణ పొందిన గిరిజన చట్టాల వివరణతో పాటు అంతగా ప్రాచుర్యం పొందని “1960 చట్టం” వివరణతో అమాయక గిరిజనులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఎలా రక్షణ కలిగిస్తుందో దీనిలో వివరిస్తూ ఏజెన్సీలో రెడ్డి వ్యాపారుల అక్రమాలు గురించిన వివరణ తెలిపారు వ్యాసకర్త,
అలాగే పోలవరం నిర్వాసితుల గోడు గురించి చెబుతూనే గిరిజనుల అభివృద్ధి కోసం విడుదల చేస్తున్న నిధులకు అవినీతి చెదలు ఎలా పడుతున్నాయో వివరిస్తూ స్వయం పాలన, రాజకీయ చైతన్యం, గిరిజనుల రాజ్యాంగ రక్షణలు, ఐదవ షెడ్యూల్, గురించిన వివరణతో పాటు ఆదివాసీల స్వయం పాలనకు “ఫె సా చట్టం” ఎలా ఉపకరిస్తుందో తగు వివరణ అందించారు. ఇంద్రవెల్లి సంఘటనను గోండులకు మాయని గాయంగా గుర్తుచేస్తూనే అడవి బిడ్డల హక్కుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రవృక్షంగా, విప్ప చెట్టును ప్రకటించాలనే డిమాండ్ గట్టిగానే వినిపించారు.
ఇక అడవి బిడ్డల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే, నాగోబా, వంటి కుల దేవతల గురించే గాక సమ్మక్క సారక్క గుండం రామక్క, జంగుబాయి, ముసలమ్మ, వంటి వీరవనితల ప్రస్తావన తీసుకువచ్చారు, కోయిల మాఘ పున్నమి గోవులు దండారి పాండవుల ఏడుబావుల జలపాతం గురించి వివరణ చేస్తూనే అసలు ఆదివాసీలది ఏ మతం? అనే ప్రశ్నను వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
నేటి ఆధునిక గిరిజన సమాజంకు అందుతున్న విద్యా ఉద్యోగ ఆరోగ్యం గురించిన వ్యాసపరంపరలో రచయిత ఆవేదన అర్థమవుతుంది, ఏజెన్సీలో నిర్వహించబడుతున్న విద్యా విధానం అంతరించిపోతున్న ఆదిమ భాషలో వాటిని కాపాడాల్సిన బాధ్యతలు గిరిజనులకు మాతృభాషలో విద్యాభ్యాసం అందించాల్సిన అవసరం ఆన్లైన్ విద్య ద్వారా సమాచార వ్యవస్థకు అల్లంత దూరాన ఉండే ఆదివాసీ సమాజానికి జరుగుతున్న నష్టాలను సహేతుకంగా వ్యాస రచయిత అందించారు.
రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నప్పటికీ అది అసలైన ఆదివాసీల దరి చేరడం లేదనే విషయాన్ని కూడా సవివరమైన గణాంకాలతో వివరంగా అందించారు, ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, ఆదివాసీల హక్కులకు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించే శక్తులను గురించి రక్షణ కల్పించాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గుమ్మడి తన వ్యాసాక్షరాల గుండా నిర్ధారించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే గిరిజన జాతులపై జరిగిన జరుగుతున్న దాడులు సామూహిక హత్యల గురించి సభ్య సమాజానికి కూడా తెలియడం లేదని ఇలాంటి దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరాన్ని పాలకులకు హెచ్చరిక వంటి సందేశాన్ని ఇందులో ఉటంకించారు, వాస్తవానికి అతి ప్రాచీన కాలానికి చెందిన ఆదిమ జాతులైన ఆదివాసీలను ప్రామాణికంగా చారిత్రకంగా గుర్తించలేదని కేవలం వారిలోని నిరక్షరాస్యత కారణంగా వారి ఉత్కృష్టమైన చరిత్ర సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి, కానీ వారిదైనా చిత్రలిపి పడిగెలు మౌఖిక సాహిత్యాల ద్వారా వారి అమూల్యమైన చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారనే పరిశోధనాత్మక అంశాలను ఇందులో పొందుపరిచారు రచయిత లక్ష్మీనారాయణ.
ప్రధాన వ్యాసావళికి అనుబంధంగా అందించిన అనుబంధంలో కూడా చాలా విలువైన విషయాలు పొందుపరిచారు పుస్తక రచయిత ఆదివాసీల పోరాట విజయాలకు ప్రతీక అయినా మేడారం సమ్మక్క సారక్క జాతర గురించిన చారిత్రిక విజయాలు జాతర పరాయికరణ అవుతున్న తీరు. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన గోండులు ఆరాధ్య దైవంగా భావించే “జంగుబాయి”ని వారు ఆరాధించే వైనం, వింత ఆచారాలు గురించిన సమాచారం మనం ఇందులో చదవవచ్చు.
నేటి ఆధునిక ఆదివాసీ సమాజంలో ఆదివాసి యువత సాధించిన విజయాల స్ఫూర్తిగాథలు సైతం ఇందులో అందించడం ద్వారా నేటి గిరిజన యువత సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది ఇలా ప్రతి విషయం ప్రామాణికంగా అక్షయకరించిన ఈ గిరిజన వ్యాసాలు భావితరం పరిశోధకులకే కాక గిరిజన సాహిత్య వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయి, ఎంతో విలువైన గిరిజన జాతి సమాచారం సేకరించి పుస్తక రూపంగా అక్షరబద్ధం చేసిన రచయిత అక్షర కృషి వెలకట్టలేనిది.

- Advertisement -


అనంత యానం (వ్యాస సంపుటి)

రచయిత :-గుమ్మడి లక్ష్మీనారాయణ,

పేజీలు: 226, వెల:- 300/- రూ,

ప్రతులకు:- రచయిత, సెల్: 9491318409,

సమీక్షకుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు

సెల్:- 7729883223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News