Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telugu Poetry: వేదనాంతరంగాల శోధన

Telugu Poetry: వేదనాంతరంగాల శోధన

కవిత్వానికి కావలసింది లోతైన భావుకత, పదు నైన అభివ్యక్తి తీవ్రత. ఎన్నో దృక్కోణాల్లోంచి విశ్లేషించి చూస్తేనే కవి తన అభివ్యక్తి సాంద్రతను కవిత్వం ద్వారా అందించడం సాధ్యపడుతుంది. లోలోపల కవిత్వా న్ని విస్తృత పరచుకొని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నైపుణ్యా న్ని పెంపొందించుకుంటూ కొత్త రూపంలో అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న కవి డాక్టర్‌ మహ్మద్‌ హసేన. జీవన పార్శ్వాల్ని తాత్త్విక స్పర్శతో రంగరించి సమస్త ఛాయలతో దృశ్యీకరించిన హసేన వెలువరించిన కవిత్వం బిడ్డ ఎప్పుడొస్తవ్‌. సామాజిక చైతన్యానికి ప్రతిబింబాలైన 47 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
తొలి కవిత అభ్యాసం జీవన సమగ్రతను సంతరింప జేస్తూ సాగింది. ప్రపంచమే ఉత్తమ గ్రంథం/ కాలమే ఉత్తమ గురువు/ ప్రకృతే పాఠ్య/ విద్యా ప్రణాళిక అని మనిషి పరివర్తన చెందాలంటే నిరంతర అభ్యసన మొక్కటే మార్గమని చెప్పారు. నువ్వు – నేను కవితలో పరస్పరం తోడుండి సంక్లిష్టతలను అధిగమిస్తూ కాల పరీక్షను తట్టు కొని నిలబడదామని ధైర్యపు ఊపిరులు పోశారు. మానవత్వం పెరగాల్సిన చోట మృగత్వం విస్తరించిన భూతంగా మారిందని వేదన చెందారు. సృష్టి ఆవిర్భావం మనిషి మేధస్సుకు మిగిల్చిన శేష ప్రశ్నలెన్నో ఉన్నాయని గుర్తు చేశారు. కాలాన్ని మరపించి అనంత సాగర ఆలోచనల ఆమనిలా భాసించిన కావ్యకన్యను ఇంతకు ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. చెలిమి, ఓర్పు, త్యాగానికి చిరునామాగా బ్రహ్మ, సృష్టించిన అద్భుతం అమ్మ అని అభివర్ణించారు. చెట్టును నాటి చూడు / అవుతుందదే నీకు తోడు అని వనమ హెూత్సవం చేశారు. అజరామరమైన పోరాట పటిమ కలిగిన పోరుబందర్‌ పోరు బిడ్డగా గాంధీని ప్రస్తుతించారు. నిన్ను ఆదర్శంగా తీసుకున్న వారిని నీ జ్ఞాపకాలు తరుముతూనే ఉండాలని అంటారు. బంధం ఎప్పుడూ బంధీకాదు మనిషి మనిషిని కలిస్తేనే బం ధం లేకుంటే అది యాంత్రికతే అని తేల్చేశారు. కొడిగడు తున్న మానవతా విలువలకు/ కొత్త అర్థాలు దొరుకుతు న్నాయ్‌ ఇప్పుడు అని యుద్ధం గెలుద్దాం కవితలో నిశిత విమర్శ చేసి బాధితులు తప్పు బాధ్యులు కనిపించరిక్కడ అని భేదపడ్డారు. అజ్ఞానాంధకారంలో మునిగిపోతున్న వికృతాలకు పాల్పడే మానవ మృగాళ్లను నిర్భయలున్నా యన్న సంగతిని గుర్తుపెట్టుకొమ్మని హెచ్చరించారు. విజ్ఞతతో యువత ఆలోచిస్తే ఓటు వారి చేతిలో బ్రహ్మా యుధమవుతుందన్నారు. నేను కవిని… అక్షర సేద్యం చేస్తు న్న కర్షకుడిని, కార్మికుడిని అని లోకానికి తన చిరునామా ను చెప్పుకున్నారు. నీ మరణం ఊరికే పోదు.. నీ బలిదానం చెరిగిపోదు అని వీరమరణం పొందిన కల్నల్‌ సంతోషన్ను తలచి అక్షరాంజలి ఘటించారు. ప్రపంచానికి పెనువిపత్తు పెరుగుతున్న జనాభా అని అదే కొత్త సంక్షోభమన్నారు. ఆలి అంటే తాళికాదు. ఎదురులేని కాళి అని మగువలేని మనుగడ ప్రశ్నార్థకం కవితలో చెప్పారు. దూరమైన పేగుబంధాన్ని దూరం చేసిన జాలిలేని దేవుడిమాయకు కుమిలిన తల్లితనం ఎప్పడొస్తావ్‌ బిడ్డా/ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి బిడ్డ అని కన్నీటి ప్రవాహమైంది.
మౌనం వహించకుండా సత్వరం స్పందించి బాధితు లను పీడితులను రక్షించేందుకు దౌర్జన్యాన్ని వర్తించే దుర్జయుడవై శంఖ చక్రముల్‌ చేబట్టిరా అని మనిషిని మేల్కొల్పారు. సుందరానంద జీవనానికి తొలకరిని ఆత్మీ య పలకరిని చేశారు. సప్తవర్ణాల శోభితంగా బాల్యాన్ని వర్ణించారు. ఉద్యమాల ఊపిరిగా, తెలంగాణ చరిత్రకు ఆనవాలుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శతకోటి వందనాలర్పించారు. ప్రశ్నే పదునైన ఆయుధమని మనిషిని గమనించమని చెప్పారు. నాగరికతా నిర్మాణంలో కనిపించని ఆనవాళ్లు వలస కార్మికులని బాధపడ్డారు. నాయకుడై నడిపిస్తూ మరణాన్ని సైతం లెక్కచేయక కొత్త చరిత్రను సృష్టించే విజేతగా నిలిచేవాడు యోధుడని అన్నారు. ఆశ నిరాశల మధ్య అంతులేని ఊగిసలాటను అధూరి కహాని కవితలో చెప్పారు. స్వేచ్ఛలో ఎగిరే జీవితా లను చూసి సహించని ప్రపంచ నైజాన్ని బట్టబయలు చేశారు. తరాలుగా నరాల్లో జీర్ణించుకుపోయిన పురుషా హంకారాన్ని దహించేందుకు సివంగిలా ఉద్యమించమ న్నారు. మరణం శరీరాలకే కాని ప్రేమకెన్నటికి కాదని తను అడిగిందని నిర్మల పరిణతతో తెలిపారు. తన ఎదు గుదలను చూడకుండానే విషాదాన్ని మిగిల్చి వెళ్లిన నాన్న ను స్మరించారు. శాంతిని కాపాడే యజ్ఞంలో భాగమైన పోలీసన్నకు వందనం చెప్పారు. అహాన్ని జయిస్తే జ్ఞాన ద్వారాలు తెరచుకుని మహాత్ముడిగా, రాజర్షిగా మనుగడ సాగిస్తావని మనిషికి హితవు పలికారు. కర్తవ్యాన్ని మరవక దారిని వెతికి గెలిచి నిరూపించే వారే నిజమైన విజేతలని చెప్పారు. దయ, క్షమా, ప్రేమలను సిలువపై వెలువడిన శాంతి సందేశాలను తెలిపారు. సుస్తీ చేసిన ఇప్పటి దేశానికి ఆక్సీజన్‌ అందించే డాక్టర్‌ అవసరం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు.
అవును నేను మట్టినే అన్న కవితలో నాలో భాగమైన నీ జీవితం నేడు / నన్ను నిస్సారం చేసి నిర్వీర్యంగా మారుస్తున్నది అన్న వేదనను తానే మట్టి స్వరమై పలికిం చారు. తెలుగు వారి పౌరుషానికి ప్రతీక మన్యం వీరుడు అల్లూరి అని తెలిపారు. అమ్మ నువ్వు గెలుస్తావ్‌ మాతృ మూర్తి మహోన్నతి ప్రతిబింబించిన కవిత యముడికి చెప్పు ఆటలో నువ్వు గెలుస్తావని ధీమా ఇచ్చారు. హితాన్ని కోరేవాడే నిజమైన స్నేహితుడని మనీబంధం కాకుండా మానవ బంధాలను గుర్తించమని చెప్పారు.
పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను నువ్వు మలచుకోవా లంటే గురువే ఆదర్శమని గురువే దైవం. కవితలో వివరిం చారు. నదిగా నవ్వు కడలిగా నేను/ కలిసిపోయాం అలల ప్రవాహంలో అని కాలం చేసిన గాయాన్ని డార్లింగ్‌ కవితలో ప్రస్తావించారు. నేను చెట్టుని కవితలో నీ మను గడకు ప్రాణవాయువునని గుర్తుంచుకుని అంతం చేయ కుండా రక్షించు అని చెట్టు మనిషిని వేడుకుంటుంది. పేదరికప్పు మొద్దు నిద్ర నుండి మేల్కొంటే అన్నింటినీ జయిస్తావని మనిషికి పథ నిర్దేశనం చేశారు. వెనకబడ్డ రైతును తలపోస్తూ కొత్త తరాలకు ప్రేరణ అయ్యేందుకు మేల్కొని వ్యవసాయానికి కొత్త ప్రాణవాయువును అందిం చమన్నారు. జాలరి బతుకులో తుపాను మిగిల్చిన విషా దంతో తలరాతే తారుమారైందని వేదనపడ్డారు. ఆత్మీయు లు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడంతో పండగ సంతోషం ఆవి రైందని చెప్పారు నయనా నందకరమైన రసరమ్య రమణీయం రామాయణం నేటి తరానికి మార్గదర్శనమని తెలిపారు. పారిశుధ్య కార్మికులను ప్రజల ప్రాణ రక్షకు లుగా, పర్యావరణ ప్రేమికులుగా అభివర్ణించారు. పరిశో ధనా శీలత, ప్రబోధాత్మకత, కార్యాచరణ నిర్దేశికత్వాన్ని నిండారా కలిగి ఉన్న హసేన కవిత్వం నిఖ్సాన సామాజిక నిబద్ధతను స్పష్టపరిచింది.
డాక్టర్‌ తిరునగరి శ్రీనివాస్‌
– 8466053933

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News