Homeఎడిటోరియల్ / బహుళబొద్దింక వస్తోంది.. బహుపరాక్!

బొద్దింక వస్తోంది.. బహుపరాక్!

బొద్దింక‌లు.. ఈ ఒక్క మాట ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. గండ‌ర‌గండ‌డు అనుకున్న మ‌హామ‌హా నాయ‌కుల గుండెల్లో సైతం ద‌డ మొద‌లైంది. ఇది ఎటు తిరిగి ఎటు వ‌స్తుందో, ఏం చేస్తుందో అన్న ఆందోళ‌న ప్ర‌తి ఒక్క రాజకీయ పార్టీ నాయ‌కుడిలోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదేదో అర్ధ‌రాత్రి, అప్ప‌టిక‌ప్పుడు పుట్టిన వ్య‌వ‌హారం కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తి, ఆవేశం ఈ రూపంలో ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డాయి. నిరుద్యోగులు అంటే బొద్దింకలు అని ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఈ బొద్దింకల జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. బొద్దింకను చూడగానే నిజానికి చాలామంది ఇళ్లల్లో భయపడతారు కూడా. దాన్నీ చంపడానుకి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన, తప్పనిసరిగా గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ బొద్దింక అనే జీవి చాలా చాలా మొండిది. ఎందుకంటే అణుబాంబు పడినా కూడా దాని రేడియో ధార్మికతను తట్టుకుని బతకగల సామర్థ్యం ఈ బొద్దింకలకు ఉంటుంది. అందుకని ఎవరెన్ని ఎదురుదెబ్బలు కొట్టడానికి ప్రయత్నించినా ఈ బోద్దింకల పార్టీ మాత్రం కచ్చితంగా నిలబడుతుందని ప్రస్తుతానికి విశ్లేషకులందరూ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో అయితే దీని మీద, రాబోయే భారత రాజకీయాలలో ఇది సృష్టించబోయే సునామీకి సంబంధించిన విశ్లేషణలు లెక్కలేనన్ని వస్తున్నాయి. ఈ కాక్‌రోచ్ జ‌న‌తా పార్టీ అనేది జెన్ జీ ఉద్య‌మం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

- Advertisement -

నిజానికి చెప్పాలంటే కొన్ని సంవ‌త్స‌రాలుగా దక్షిణాసియా రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా మొదలైంది. ఈ మార్పును పాత రాజకీయ నాయకత్వం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ సోషల్ మీడియా స్క్రీన్‌ల మీద, రీల్స్ మధ్య, మీమ్స్ వెనుక, యూట్యూబ్ లైవ్‌లలో, ఇన్‌స్టాగ్రామ్ కామెంట్లలో అది ఇప్పటికే విప్లవంలా పెరుగుతోంది. ఆ మార్పు పేరు — “జెన్ జీ రాజకీయ శక్తి”. నేపాల్‌లో ఈ శక్తి ఇప్పటికే ప్రభుత్వాన్ని కుదిపేసింది. భారత్‌లో అది ఇంకా ఆరంభ దశలో ఉంది. కానీ ఇక్కడ కూడా యువత రాజకీయ వ్యవస్థపై కోపంతో మరిగిపోతోంది. అవినీతి, కుటుంబ పాలన, ఉద్యోగాల కొరత, అధికార దుర్వినియోగం, రాజకీయ అహంకారం… ఇవన్నీ కలిసి యువతలో ఒక కొత్త రాజకీయ సంసిద్ధ‌తను నిర్మిస్తున్నాయి.

ఈ తరంగానికి ప్రస్తుతం ప్రతీకగా మారింది కాక్‌రోచ్ జ‌న‌తా పార్టీ. వ్యంగ్యపూరితమైన పేరుతో ప్రారంభమైన ఈ డిజిటల్ ఉద్యమం ఇప్పుడు రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. యువతలో దీనికి వస్తున్న స్పందన, ఆద‌ర‌ణ‌, ప్రధాన రాజకీయ పార్టీల్లో కనిపిస్తున్న అసౌకర్యం, దానిపై వస్తున్న ఆరోపణలు… ఇవన్నీ కలిసి భారత రాజకీయాల్లో కొత్త దశకు సంకేతాలు ఇస్తున్నాయి.

నేపాల్‌లో జెన్ జీ ఎందుకు రోడ్డెక్కింది?
నేపాల్ గత కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరత, అవినీతి, నిరుద్యోగం, పాత తరహా నాయకత్వంతో బాధపడుతోంది. అక్కడి యువత ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వ్యవస్థ మాత్రం మారడం లేదు. అదే అవినీతి. అదే అధికార కేంద్రీకరణ. అదే కుటుంబ రాజకీయాలు. నేపాల్‌లో యువత ఒక ప్రత్యేక రాజకీయ ఆవేదనను నిర్మించుకుంది. వాళ్లు సంప్రదాయ పార్టీలను పూర్తిగా తిరస్కరించారు. “పాత నాయకత్వం దేశ భవిష్యత్తును తినేసింది” అనే భావన యువతలో బలంగా పెరిగింది. ఆందోళనల్లో పాల్గొన్న యువతలో చాలా మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారే. వాళ్లు రాజకీయ సిద్ధాంతాల కోసం కాకుండా, “గౌరవప్రదమైన భవిష్యత్తు” కోసం రోడ్డెక్కారు. నిరుద్యోగం వాళ్లలో కోపాన్ని పెంచింది. అవినీతి ఆ కోపానికి దిశ ఇచ్చింది. సోషల్ మీడియా ఆ కోపాన్ని ఉద్యమంగా మార్చింది. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన‌ అంశం కనిపిస్తుంది. పాత రాజకీయ ఉద్యమాలు క్యాడర్ ఆధారంగా పెరిగేవి. కొత్త జెన్ జీ ఉద్యమాలు ఆల్గరిథమ్ ఆధారంగా పెరుగుతున్నాయి. ఒక వైరల్ వీడియో కొన్ని ల‌క్ష‌ల‌, కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఒక హ్యాష్‌ట్యాగ్ రాత్రికి రాత్రే ఉద్యమాన్ని జాతీయ చర్చగా మార్చేస్తోంది. నేపాల్ యువత స‌రిగ్గా అదే చేసింది. వాళ్లు తమ కోపాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాజకీయ శక్తిగా మార్చారు.

మ‌న యువతలో అసహనం ఎందుకు?
భారతదేశంలో పరిస్థితి కాస్త భిన్నంగా క‌నిపిస్తున్నా.. యువత మానసిక స్థితి మాత్రం నేపాల్‌కు చాలా దగ్గరగా ఉంది. భారతీయ జెన్ జీ రాజకీయాలపై ఆసక్తి కోల్పోలేదు. కానీ సంప్రదాయ రాజకీయ పార్టీలపై నమ్మకం కోల్పోతోంది. వాళ్లు రాజకీయ సభలకు, స‌మావేశాలకు పెద్ద సంఖ్య‌లో వెళ్లకపోవచ్చు. కానీ రాజకీయ మీమ్స్ చూస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో చదవకపోవచ్చు. కానీ నాయకుల బాడీ లాంగ్వేజ్‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు, గుంభ‌నంగా విశ్లేషిస్తున్నారు. వాళ్లు ఇప్పుడు “నాయకుడి భాష”ను చూస్తున్నారు. “ఆ నాయకుడు నిజంగా కోపంగా ఉన్నాడా? లేక నటిస్తున్నాడా?” అని అంచనా వేస్తున్నారు. ఈ తరానికి రాజకీయాలంటే కేవలం సిద్ధాంతం కాదు. రాజకీయాలంటే “పర్సనల్ కనెక్ట్”. అందుకే జెన్ జీ సంప్రదాయ నాయకుల కన్నా సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వ్యక్తులవైపు ఆకర్షితమవుతోంది.

స‌రిగ్గా ఇక్కడే కాక్‌రోచ్ జనతా పార్టీ రంగప్రవేశం చేసింది.
కాక్‌రోచ్ జనతా పార్టీ: వ్యంగ్యం నుంచి వైరల్ రాజకీయాల వరకు
కాక్‌రోచ్  జనతా పార్టీ పేరు మొదట వినగానే చాలామంది దాన్ని సరదాగా తీసుకున్నారు. కానీ ఆ పార్టీ సోషల్ మీడియా ప్రభావం పెరిగేకొద్దీ రాజకీయ వ్యవస్థలో అసహనం కూడా పెరిగింది. అభిజీత్ దీప్కే ఈ ఉద్యమానికి ముఖచిత్రంగా మారాడు. అతను సంప్రదాయ రాజకీయ భాషను పూర్తిగా తిరస్కరించాడు. అతను సూటిగా మాట్లాడాడు. వ్యవస్థను ఎగతాళి చేశాడు. అవినీతిపై వ్యంగ్యంతో దాడి చేశాడు. అదే యువతకు కనెక్ట్ అయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన మానసిక అంశం ఉంది. జెన్ జీ ఇప్పుడు “పాలిటికల్ కరెక్ట్‌నెస్” కంటే “రా ఎమోషన్”ను ఎక్కువగా నమ్ముతోంది. వాళ్లు మేకప్ చేసిన రాజకీయ ప్రసంగాల కంటే కొంత అసభ్యంగా అనిపించినా.. నిజాయితీగా మాట్లాడే వ్యక్తుల్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అభిజీత్ దీప్కే అదే మూడ్‌ను పట్టుకున్నాడు. ఈ ఉద్యమం చాలా వేగంగా సోషల్ మీడియాలో వ్యాపించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఏకంగా కోటిమంది వ‌ర‌కు ఫాలోవ‌ర్లు వ‌చ్చేశారు. అయితే ఉద్యమం బలపడే కొద్దీ ప్రతిఘటన కూడా మొదలైంది.

“పాకిస్థాన్ ఫాలోవర్లు” ఆరోపణలు: రాజకీయ వ్యూహమా?
కాక్‌రోచ్  జనతా పార్టీపై వచ్చిన పెద్ద ఆరోపణల్లో ఒకటి… వారి సోషల్ మీడియా ఫాలోవర్లలో 40 శాతం పాకిస్థాన్ నుంచి ఉన్నారన్నది. ఈ ఆరోపణ వెంటనే జాతీయ చర్చగా మారింది. కానీ ఇక్కడ ప్రశ్న వేరే ఉంది. ఒక డిజిటల్ ఉద్యమాన్ని రాజకీయంగా ఎదుర్కొనే బదులు, దాని దేశభక్తిని ప్రశ్నించడం ఎందుకు ప్రారంభమైంది? భారత రాజకీయాల్లో ఇది చాలా పాత వ్యూహం. వ్యవస్థను ప్రశ్నించే కొత్త శక్తిని ముందుగా “సీరియస్ కాదు” అంటారు. తర్వాత “విదేశీ ప్రభావం” అంటారు. చివరికి “దేశ భద్రతకు ముప్పు”గా చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ల ఎక్స్ (పాత ట్విట్ట‌ర్‌) ఖాతాను బ్లాక్ చేశారు. అంతేకాదు.. అభిజీత్ దీప్కే తన సోష‌ల్ మీడియా ఎకౌంట్ హ్యాక్ అయిందని కూడా ప్రకటించాడు. ఇది కేవలం సైబర్ సమస్య మాత్రమే కాదు. ఇది డిజిటల్ రాజకీయాల కొత్త యుద్ధరంగం. ఈ తరహా ఉద్యమాలు ఇప్పుడు వీధుల్లో మాత్రమే కాదు, ఆల్గ‌రిథమ్‌ల మధ్య కూడా పోరాడుతున్నాయి.

బెంగళూరులో “హ్యూమన్ చైన్” వివాదం
బెంగళూరు పోలీసులు కాక్‌రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన మానవహారానికి అనుమతి నిరాకరించారు.  ఈ ఘటన మరో అంశాన్ని బయటపెట్టింది. భారత రాజకీయ వ్యవస్థ ఇప్పుడు డిజిటల్ ఉద్యమాలపై అప్రమత్తంగా ఉంది. సంప్రదాయ పార్టీలు నియంత్రించ‌లేని ఉద్యమాలంటే అధికార వ్యవస్థకు అసౌకర్యం కలుగుతోంది. ఎందుకంటే ఈ ఉద్యమాలకు స్పష్టమైన నాయ‌క‌త్వం ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. వీటికి కేంద్ర కార్యాలయం ఉండకపోవచ్చు. వీటి నాయకత్వం కూడా పూర్తిగా వికేంద్రీకృతంగా ఉండొచ్చు. అందుకే వీటిని అణచివేయడం అంత సుల‌భం కానే కాదు. ఒక‌రిద్ద‌రు అనుకుంటే నిమిషాల వ్య‌వ‌ధిలోనే కొన్ని వేలు, ల‌క్ష‌ల మంది వ‌చ్చేస్తారు. పోలీసుల బ‌ల‌గాలు చాలా కొద్ది సంఖ్య‌లోనే ఉంటాయి. కొన్ని వేల మందిని వాళ్లు నియంత్రించ‌డం దాదాపుగా సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందులోనూ ఏమైనా అల్ల‌రి, అల‌జ‌డి చేస్తూ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లేలా ప్ర‌వ‌ర్తిస్తే అప్పుడు పోలీసులు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, చాలా శాంతియుతంగా మాన‌వ‌హారం చేస్తామంటే దాన్ని ఎలా అడ్డుకుంటారో చూడాలి.

జోసెఫ్ విజయ్: జెన్ జీ మానసికతను అర్థం చేసుకున్న నాయకుడు
జోసెఫ్ విజయ్ తమిళనాడులో కొత్త తరహా రాజకీయ కమ్యూనికేషన్‌కు ఉదాహరణగా నిలిచాడు. అతను సంప్రదాయ రాజకీయ భాషను ఉపయోగించలేదు. అతను “మేము పోటీ చేస్తాం” అనలేదు. “నేనే సీఎం అవుతాను” అన్నాడు. స‌రిగ్గా ఈ భాష యువతకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే జెన్ జీ ఇప్పుడు “డిఫెన్సివ్ పాలిటిక్స్”ను ఇష్టపడటం లేదు. వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని ఇష్టపడుతున్నారు. వాళ్లు “విన్నర్ ఎనర్జీ” కోరుతున్నారు. సోషల్ మీడియాలో విజయ్ అదే మూడ్‌ను నిర్మించాడు. అతని ప్రచారంలో ఒక ముఖ్యమైన అంశం కనిపించింది. అతను యువతను ఓటర్లుగా కాకుండా “మూవ్‌మెంట్ భాగస్వాములుగా” ట్రీట్ చేశాడు. అదే అతనికి డిజిటల్ స్పేస్‌లో భారీ మద్దతు తెచ్చింది.

రేవంత్ రెడ్డి: వ్యక్తిగత బ్రాండ్ నిర్మాణం
రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో అదే తరహా వ్యక్తిగత రాజకీయ బ్రాండింగ్‌ను నిర్మిస్తున్నారు. “2034 వరకు నేనే సీఎం” అనే వ్యాఖ్య సాధారణ రాజకీయ ప్రకటన కాదు. అది ఒక సైకాలజికల్ పొజిషనింగ్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ పేరుకంటే తన వ్యక్తిగత నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది జెన్ జీ రాజకీయాల్లో చాలా కీలకమైన అంశం. ఇప్పుడు యువత పార్టీలను కాదు, వ్యక్తులను ఫాలో అవుతోంది. రేవంత్ రెడ్డి మరో ముఖ్యమైన విషయం గ్రహించారు. యువతకు ఉద్యోగాలే ప్రధాన రాజకీయ అంశం. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు, వయో పరిమితి పెంపు, ప్రభుత్వ రంగంలో నియామకాల వంటి అంశాలపై ఆయన దూకుడుగా మాట్లాడుతున్నారు. అస‌లు తెలంగాణ ఏర్పాటు జ‌రిగిందే నిధులు, నీళ్లు, నియామ‌కాలు అన్న నినాదం ఆధారంగా. కానీ దాదాపు ద‌శాబ్ద కాలం పాటు పాలించిన టీఆర్ఎస్ (ప్ర‌స్తుత బీఆర్ఎస్) హ‌యాంలో నియామ‌కాల విష‌యాన్ని స‌రిగ్గా ప‌ట్టించుకోలేద‌న్న ఆగ్ర‌హం ఓయూ విద్యార్థులలో గ‌ట్టిగా క‌నిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దూకుడుగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. యువతలో “ఈ నాయకుడు మమ్మల్ని చూస్తున్నాడు” అనే భావనను పెంచుతున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్?
భారత రాజకీయాల్లో ఇప్పటివరకు బీజేపీ డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఆధిపత్యం చాటింది. సోషల్ మీడియాను రాజకీయ ఆయుధంగా మార్చిన తొలి పెద్ద పార్టీ అదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా కేవలం పార్టీల చేతుల్లో లేదు. ఇప్పుడు ప్రతి వైరల్ వ్యక్తి ఒక రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ప్రతి మీమ్ పేజ్ ఒక రాజకీయ నేరేటివ్‌ను నిర్మించగలదు. ప్రతి యూట్యూబ్ లైవ్ ఒక మినీ రాజకీయ సభలా మారుతోంది. ఇది సంప్రదాయ పార్టీలకు ప్రమాదకరం. బీజేపీ మీద‌ ఈ ఉద్య‌మం రెండు విధాలుగా ప్రభావం చూపొచ్చు. ఒకవైపు యువతలో ఉన్న వ్యవస్థపై కోపం అధికార పార్టీపై పడే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ఇప్పటికీ బలమైన డిజిటల్ నెట్‌వర్క్ కలిగి ఉండటం వల్ల ఈ ఉద్య‌మాన్ని తమవైపు మళ్లించే ప్రయత్నం చేయొచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి  పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ పాత రాజకీయ భాష నుంచి పూర్తిగా బయటకు రాలేదు. యువత కోరుతున్న “రా ఎనర్జీ” కాంగ్రెస్ కమ్యూనికేషన్‌లో తక్కువగా కనిపిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి వంటి నాయకులు పార్టీ ప‌రంగా ఎద‌గ‌డం కాకుండా.. వ్యక్తిగత బ్రాండింగ్ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నారు.

వీళ్లంతా ప్ర‌జాప్ర‌తినిధులా?
ప్ర‌జ‌లు ఎన్నుకున్న త‌ర్వాత నాయ‌కుల‌లో అవినీతి క‌నిపిస్తే దాన్ని ప్ర‌శ్నించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎప్ప‌టినుంచో మంత్రి కావాల‌ని ఆశ‌ప‌డుతూ వివిధ పార్టీలు మారుతూ ఎమ్మెల్యేగానే మిగిలిపోయిన ఒక సీనియ‌ర్ నాయకుడు (స్వ‌తంత్ర భార‌త‌దేశ తొలి ప్ర‌ధాని పేరు పెట్టుకున్నారు) అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లోనే దాదాపు రూ.200 కోట్ల వ‌ర‌కు ఇసుక‌, మ‌ట్టి అక్ర‌మ వ్యాపారాలతో సంపాదించార‌ని ఆయ‌న సొంత పార్టీ మ‌నుషులే సోష‌ల్ మీడియాలో చెబుతున్నారు. ఈ త‌ర‌హా వాళ్లు అధికారం వ‌చ్చాక అక్ర‌మాలు చేసి డ‌బ్బు సంపాదిస్తున్నారు.

రెండోర‌కం ఉన్నారు. వీళ్లు అక్ర‌మాలు చేసి, కొన్ని ప‌దుల సంఖ్య‌లో కేసులు త‌మ‌పై వేసుకున్న త‌ర్వాత కూడా పెద్ద‌ల స‌భ రూపంలో పార్ల‌మెంటులో అడుగుపెడుతున్నారు. హెటెరో సంస్థ మీద ప‌ర్యావ‌ర‌ణ విష‌యంలో లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లున్నాయి. ప‌ర్యావ‌ర‌ణాన్ని విధ్వంసం చేస్తూ త‌మ సామ్రాజ్యాన్ని విస్త‌రించుకున్నార‌ని ఆరోప‌ణ‌లొచ్చిన బండి పార్థ‌సార‌థి రెడ్డి ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు. అలాగే, రాంకీ గ్రూపు సంస్థ‌ల మీద కూడా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసులు, వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు లెక్క‌లేదు. నేడో రేపో ప‌ద‌వీకాలం ముగిసిపోతున్న రాజ్య‌స‌భ స‌భ్యుల‌లో ఆ సంస్థకు చెందిన ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి ఒక‌రు. రిల‌య‌న్స్ గ్రూపు త‌మ‌కు పార్ల‌మెంటులో ప్రాతినిధ్యం ఉండాల‌ని ఎప్పుడూ భావిస్తుంది. త‌మ కార్పొరేట్ ప్ర‌యోజ‌నాల కోసం చాలా సుల‌భంగా త‌మ‌వాళ్ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతుంది. అలా ప‌దే ప‌దే రాజ్య‌స‌భ‌లో వేర్వేరు కోటాల‌లో ప్ర‌వేశిస్తున్న వ్య‌క్తి.. ప‌రిమ‌ళ్ న‌త్వానీ. వీళ్లంతా అస‌లు ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను ఏమాత్రం లెక్క‌చేస్తారు? అన్న ఆగ్ర‌హం ప్ర‌జ‌ల్లో, ముఖ్యంగా జెన్ జీలో చాలా తీవ్రంగా ఉంది.

జెన్ జీ రాజకీయాల అసలు లక్షణాలు
1. సిద్ధాంతాల కంటే భావోద్వేగం:  జెన్ జీ ముందుగా “ఎమోషన్”ను చూస్తోంది. తర్వాతే సిద్ధాంతం గురించి ఆలోచిస్తోంది.

2. పార్టీ కంటే వ్యక్తి: ఇప్పుడు యువత పార్టీ జెండాను కాదు, నాయకుడి వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతోంది.

3. వైరల్ కమ్యూనికేషన్: ఒక నిమిషం వీడియో ఇప్పుడు గంటల రాజకీయ ప్రసంగం కంటే ఎక్కువ ప్రభావం చూపుతోంది.

4. వ్యంగ్యం రాజకీయ ఆయుధం: మీమ్స్ ఇప్పుడు కేవలం వినోదం కాదు. అవి రాజకీయ ప్రతిఘటన.

5. సంప్రదాయ మీడియాపై అనుమానం: జెన్ జీ టీవీ చర్చల కంటే సోషల్ మీడియా క్రియేటర్లను ఎక్కువగా నమ్ముతోంది.

భారత రాజకీయాల భవిష్యత్తు ఎటు?
నేపాల్‌లో యువత ప్రభుత్వాన్ని కదిలించింది. భారతదేశంలో కూడా అదే అసంతృప్తి పెరుగుతోంది. కానీ భారత్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పెద్దది. చాలా సంక్లిష్టమైనది. అందుకే ఇక్కడ మార్పు ఒక్కసారిగా రాకపోవచ్చు. కానీ మార్పు మొదలైంది. కాక్‌రోచ్ జనతా పార్టీ పెద్ద రాజకీయ పార్టీగా మారకపోవచ్చు. కానీ అది ఇప్పటికే ఒక పెద్ద రాజకీయ ప్రశ్నను లేవనెత్తింది  “భారత యువత సంప్రదాయ రాజకీయాలను ఇంకా నమ్ముతోందా?” ఈ ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ యువత ప్రవర్తన ఒక విషయాన్ని మాత్రం చాలా స్ప‌ష్టంగా, కుండ బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ చెబుతోంది. వాళ్లు ఇప్పుడు “ప్రత్యామ్నాయం” కోసం చూస్తున్నారు. అందుకే కొత్త రాజకీయ భాష పుడుతోంది. కొత్త నాయకత్వ నమూనాలు వస్తున్నాయి. కొత్త డిజిటల్ ఉద్యమాలు పెరుగుతున్నాయి. భారత రాజకీయ వ్యవస్థ ఈ తరంగాన్ని అర్థం చేసుకుంటే మార్పును స్వీకరిస్తుంది. అర్థం చేసుకోకపోతే ఈ చిన్న ఉద్య‌మ‌మే భవిష్యత్తులో పెద్ద రాజకీయ భూకంపంగా మారే అవకాశం ఉంది.

జెన్ జీ ఇక ప్రేక్షకులు కారు… వాళ్లు ఇప్పుడు రాజకీయ స్క్రిప్ట్ రాస్తున్నారు. నాయ‌కుల త‌ల‌రాత‌లు మార్చేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. అందుకే బొద్దింక వ‌స్తోంది.. బ‌హుప‌రాక్‌!

(స‌మ‌యం)
(స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News