Monday, July 8, 2024
Homeఓపన్ పేజ్Tilak: తిలక్‌ అమృతం కురిసిన రాత్రి పరామర్శ

Tilak: తిలక్‌ అమృతం కురిసిన రాత్రి పరామర్శ

నిగూడమైన అర్ధాన్ని కలిగి సాధారణ పదానికి భి న్నంగా ఉండి మనస్సును రంజింపజేసేది, అలా గే మనిషిని ఆలోచింపజేసే రచన ఏదైనను కవిత్వం పరిధి లోకి వస్తుందంటారు లాక్షణికులు, ఇది వ్యక్తి యొక్క ‘సృజ నాత్మక‘ ఆలోచనలపై ఆధారపడి ఉండే విభిన్న ‘ప్రక్రియ‘. అందుకే మహాకవి శ్రీశ్రీ ‘కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వం’ అంటారు. చూసిన సంఘటన లేదా సన్నివేశాన్ని బట్టి వ్యక్తి (కవి) స్పందిస్తాడు, రసాస్వాదన చేస్తాడు, అనంతరం ఒక ప్రక్రియ ద్వారా రసాభివ్యక్తీకరణ చేస్తాడు. ఒక నినాదం ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృ త్వం’ ఫ్రెంచి విప్లవానికి (1789) నాంది పలికితే, ఒక పుస్తకం ‘అమ్మ’ (మాక్సింగోర్కి) ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేయగల్గిన రచన అది. అందుకే నిద్రా మత్తులో వున్న సమాజాన్ని తట్టిలేపడానికి చైతన్యం పొం దిన ఒక వ్యక్తి లేదా ఒక పుస్తకం చాలు ‘విప్లవం’. సృష్టిం చడానికి.
తెలుగు సాహిత్యంలో సమాజాన్ని ప్రభావితం చేయ గలిగే రచనలు చాలానే వచ్చాయి. ఇక కవుల విషయానికి వస్తే, ఒకరని చెప్పలేం, ఎవరిని తక్కువ చేసి చూడలేం, ఎవరి ‘శైలి’ వారిది ఎవరి సృజనాత్మక రచన వారిది. నన్న య్య, పాల్కుర్కి మొదలుకొని నేటితరం ఆధునిక కవుల వరకు విభిన్న శైలిలో కావ్యచరన చేస్తున్న వారే, ఎవరి గురించి ఏమని వ్రాయగలం. ఆధునిక కవిత్వంలో ఎవరి శైలి వారిదే, ఒకరిది ‘భావకవిత్వం’ ఐతే మరొకరిది ‘అభ్యు దయ కవిత్వం’, ఇంకొకరిది విప్లవ కవిత్వం, ఇలా ఒక్కొ క్కరు ఒక్కొక్క శైలితో, వాదాలతో 1980 వరకు ఒక రకం గా, ఎనబై తర్వాత నూతన ఒరవడిని ఏర్పర్చుకొన్నది. తెలుగు సాహిత్యంలో ఇటు ‘భావ కవిత్వాని’కి అటు ‘అ భ్యుదయ కవిత్వాని’కి మధ్యేమార్గంగా సాహిత్యాన్ని కొన సాగించినవారు కొందరు వారిలో ‘దేవరకొండ బాలగంగా ధర్‌ తిలక్‌’ కూడా ఒకరు. తిలక్‌ నాన్నకి జాతీయోద్యమ నాయకులు ఐన ‘బాలగంగాధర్‌ తిలక్‌” గారంటే ఎనలేని ప్రేమ ఆ ప్రేమతోనే తన పుత్రుడికి ‘బాలగంగాధర్‌ తిలక్‌’ అని పేరు పెట్టేలా పురిగొల్పినది. అలా ‘తిలక్‌’ గా తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. వీరు పశ్చిమ గోదా వరి జిల్లా తణుకు తాలూకా దగ్గర మండపాక‘లో 1921 ఆగష్టు 1న జన్మించారు. శ్రీశ్రీ యుగం నడుస్తున్న కాలం లోనే తిలక్‌ అంతర్వాహినిగా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించి అందరి మన్ననలు పొందారు. నా కవిత్వం కాదొక తత్వం, మరికాదు మీరనే మనస్తత్వం, కాదు ధనిక వాదం, సామ్యవాదం’ అని తన కవిత్వాన్ని తానే నిర్వచించుకొన్న గొప్ప కవి.
అంతటి గొప్ప సృజనాత్మక రచన చేసినందుకే ‘అమృతం కురిసిన రాత్రి’ కవిత్వానికి ఆంధ్రప్రదేశ్‌ సాహి త్య అకాడమీ అవార్డు మరియు ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ (1971) అవార్డు పొందిన ఉత్తమ కవితా సంపుటి. నాకు ఇష్టమైన కవులలో తిలక్‌ కూడా ఒకరు. అందుకే ‘అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలోకి ఒకసారి ఇలా వెళ్లి అలా వద్దాం.
నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించ లేను. ఈ విపంచికను శ్రుతి కలుపలేను, ఈరోజు నాకు విషాదస్మృతి, విధి తమస్సులు మూసిన దివాంధరుతి
నా యెడద మ్రోడైన ఒక దుస్థితి.
నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు
కింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెనకింద
నిండు చూలాలు
ప్రసవించి మూర్చిలిన దృశ్యాన్ని!
నేను చూశాను నిజంగా తల్లిలేక తండ్రిలేక తిండిలేక
ఏడుస్తూ ఏడుస్తూ
ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణి;
తిలక్‌ గారి ‘ఆర్త గీతం’ శీర్షికతో వున్న దీర్ఘ కవితలో నివి ఈ వాక్యాలు. ఈ కవితను 1956 లో రాసినట్లుగా పేర్కొన్నారు. ఆనాటి దేశంలోని పరిస్థితులకు ప్రతిబిం బాలు అవి. దేశంలోని పేదరికం, సామాజిక అసమాన తలు బహుశా వారిని తీవ్రంగా కలిచివేసి ఉండవచ్చు, అందుకే దేశం గూర్చి గొప్పగా చెప్పలేను, అలా అని ఎవరి ఆదేశాన్నో. పాటించలేను లేనిది వున్నట్లుగా భ్రమించి గొప్పగా చెప్పలేను, ఉన్నది లేనట్లుగా కూడా చెప్పలేను అంటూ ఎంతో ఉద్వేగంతో వ్రాసిన కవిత అది. ‘నేను చూశాను నిజంగా తల్లిలేక తండ్రి లేక తిండిలేక ఏడుస్తూ ఏడుస్తూ’ అనే వాక్యాలు నేటి వర్తమాన పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చు. నేటికి కూడా మూడు పూట ల తిండిదొరకని అన్నార్థులు ఎంతమంది లేరు దేశంలో. ఆకలితో అల్లాడి మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి నేను చూశాను అన్న వాక్యాలు కదిలిస్తాయి. ఈ వాక్యాలు చదివిన తర్వాత నాకు మహాకవి శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం లోని ‘బిక్షు వర్షీయసి’ కవితలోని దారి ‘పక్క చెట్టుకింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్గొకతే, మూలు గుతూ, ముసురుతున్న ఈగలతో వేగలేక ‘ఆ అవ్వే మరణి స్తే ఆ పాపం ఎవరి’దని వెర్రిగాలి ప్రశ్నిస్తు వెళ్ళిపోయింది అంటాడు. ఈ కవితను శ్రీశ్రీ గారు 13.08.1934 లో వ్రాసినట్లుగా మహాప్రస్థానంలో పొందుపరిచారు. అంటే బహుశా శ్రీశ్రీ గారిని ప్రేరణగా తీసుకొని ఈ కవితను వ్రాసి ఉంటాడేమో లేదా నిజంగా తిలక్‌ గారు ఆనాటి పరిస్థితులను చూసి చలించి ఉండవచ్చు రెండు అభిప్రా యాలలో ఏదైన ఒక్కటి సరైనది కావచ్చు అనేది నా అభి ప్రాయము. ఈ కవితలోనే తిలక్‌ చివరగా ఇలా అంటాడు ఈ ‘ఆర్తి’ ఏ సౌదారంతరాలకు పయనింపగలదు? ఏ రాజకీయవేత్త గుండెలను సృశించగలదు? ఏ భోగవంతుని విచారింప జేయగలదు? ఏ భగవంతునికి నివేదించుకొన గలదు? అంటూ ముగించటం కోసమెరుపు.
మైడియర్‌ సుబ్బారావ్‌ కనిపించడం మానేశావ్‌
ఏవిటీ ‘పోస్టుమాన్‌’ మీద గేయం వ్రాయాలా? అందమైన అమ్మాయి మీద కాని
చందమామ మీద కాని
వంద్యుడైన భగవంతుడి మీద కాని అ వంద్యుడైన ధీర నాయకుడు మీద కాని
పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే
ఎక్కడి పోస్టుమానో యీ గోల
ఈ సాయంత్రం వేళ
కొందరికి పరిచయమైన నవ్వు కొందరికి తలపంకిం చిన నవ్వు కొన్ని వైపులకి చూడనే చూడవు అందరికీ నువు ఆప్తబంధువువి అందరికీ నువ్వు వార్త నందిస్తావు
కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం అవు తూంటుంది.
ఈ కవితను ఎవరిని ఉద్దేశించి తిలక్‌ గారు వ్రాశారో అర్ధమయి ఉంటుంది. ఇంకెవ్వరు ప్రతి ఊర్లో అందరికి తలలో నాలుకలా, అందరికి చుట్టంలా, వ్యవహరించే ‘పోస్టు మ్యాన్‌’: గురించి. నిజంగా పోస్టు మ్యాన్‌/ ‘తపాలా బంట్రోతు’ గూర్చి ఎవరు ఆలోచిస్తారు. ఉత్తరమో, మని యార్డరో తెచ్చి ఇస్తే ఆప్యాయతగా పలకరించి, అతను ఇచ్చిన దానిని తీసుకొని మర్చిపోతాం. అలాంటిది ‘తపా లా బంట్రోతు’ పై కవిత రాయటం అంటే అతనితో గల సాన్నిహిత్యమో, వృత్తిపట్ల అతను చూయించే క్రమశిక్షణో తిలక్‌ గారిని కట్టిపడేసి ఉంటాయి. పద్దెనిమిది ఏళ్ల పడుచు అమ్మాయి జాబు (ఉత్తరం) కోసం నిరీక్షణ, ఏ బిర్లానో, దాల్మియానో లేదా దలైలామా, యుద్ధం, రాజులు రాజ్యా లు, చందమామ, భగవంతుడు, ధీర నాయకుడు మొదలైన వారి మీద వ్రాస్తే చదువుతారు కాని నీ మీద వ్రాస్తే ఎవరు చదువుతారు? అని అనటం ఆశ్చర్యం కల్గించక మానదు ఎవరికైనా. గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ తన కొడుకు యోగక్షేమాలు ఎలా ఉన్నాయో తెల్సుకోవాలి అని జాబు కోసం నిరీక్షిస్తూ చూడటం, అస్సాం రైఫిల్సులో పని చేస్తున్న సైనికుడి వద్ద నుండి జాబు కోసం తల్లిదం డ్రుల నిరీక్షణ ఇలా ఒకటేమిటి ఒక ఊర్లో చాలా మంది ‘తపాల బంట్రోతు‘ కోసం ఎదురు చూసేవారు ఆరోజుల్లో, ఈ రోజుల్లో ‘సెల్‌ ఫోన్‌’ అందుబాటులోకి వచ్చింది. ఎన భైలలో మాత్రం ‘నిరుద్యోగి‘తో మొదలుకుంటే ‘నిరుపేద’ వరకు ‘తపాల బంట్రోతు’ కోసం నిరీక్షించేవాడే. ‘తపాలా బంట్రోతు’ గొప్ప దీర్ఘ కవిత ఇది. బహుశా ఆ తర్వాత ఎవరైన ఈ అంశంపై వ్రాశారో లేదో తెలియదు కాని తపాల బంట్రోతు దినచర్య, అతని ఆహార్యం గూర్చి కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో, అలాగే ఈ కవితలో ‘మూడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ వనమహోత్సవ దినం, బిర్లా, దాల్మియా, సినిమా, దలైలామ అంటూ రాశారు. మూడోవ పంచవర్ష ప్రణాళిక కాలం (1961-1966) ఈ కవితను తిలక్‌ రాసినది మాత్రం 1959 సం.లో (అమృతం కురిసిన రాత్రి పేజీ నెం.59) మూడవ పంచవర్ష ప్రణాళి కను ఎందుకు పేర్కొన్నారనేది నాకు అర్థం కాని విషయం. అలాగే ఇండియా – చైనా యుద్ధం (1962 లో) వచ్చింది. యుద్ధం. అనే పదం సహజంగా వాడినది కావొచ్చు అలాగే ఏడవ వనమహోత్సవం 1950 జులై (1- 7)లో చేపట్టి నట్లు ఆధారాలు తెలిపుతున్నాయి. ఈ విషయంలో కొంత సంశయం నాకు.
అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు.
నేను మాత్రం
తలుపు తెరచి ఇల్లు విడిచి.
ఎక్కడికో దూరంగా కొండదాటి కోనదాటి.
వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను.
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు.
ఆకాశం మీద అప్సరసలు వారి పాదాల తారా మంజీ రాలు వారి ధమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు పృథు వక్షోజ నితంబ భారలై
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి.
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.
తిలక్‌ గారి అద్భుతమైన కాల్పనిక భావ కవిత్వానికి ఓ మచ్చుతునక ఈ కవిత. పై వాక్యాలు ‘అమృతం కురిసిన రాత్రి‘ శీర్షికతో వున్న కవితలోనివి. కాల్పనిక కవిత్వం ఒక కాలిదాసుకు అల్లసాని పెద్దన్నకు మాత్రమే కాదు, ఈ కాలపు కృష్ణ శాస్త్రికి, విశ్వనాధ వారికి మరియు మహాకవి శ్రీశ్రీకి మాత్రమే కాదు తను రాయగలడని నిరూపించిన కవిత ఇది ఉహకు రెక్కలు వస్తే అంతుండదు, అంతా అనం తమే, అందరు నిద్రపోతున్నారు. కాని తను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండా, కోనలు దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాడు. అక్కడ ఆకాశంలో అప్సరసలు ఒయ్యారంగా పరుగెత్తుతు న్నారు, వారి పాదాలు తరామంజీరాలవలే ఉన్నవి. తనని చూసి కిలకిల నవ్వి వారే మాట్లాడుకొంటున్నారట. ఏమని అంటే అందమైనవాడు ఆనందం మనిషైనవాడు కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు. కాళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు, ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు అని. భావకవిత్వా నికి పరాకాష్ట ఈ పదాల అల్లిక, నాకైతే ఇది చదివిన తర్వాత కృష్ణశాస్త్రి గారి ‘స్వేచ్ఛ గానం’లో ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు? కలవిహంగమ పక్షముల తేలియాడి తారకామణులలో తారనై మెలగి మాయమయ్యెదను నా మధురగానమున’ అన్న వాక్యాలు గుర్తుకు వచ్చాయి. తిలక్‌ గారి అమృతం కురిసిన రాత్రి కవితకు కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షంలోని ‘స్వేచ్ఛాగానం‘ కవితకు సారుప్యత లేనప్పటికి ‘అమృతం కరిసిన రాత్రి‘ కవితలో కూడా అటువంటి 5 ఋతువర్ణన కనిపిస్తుంది. ఈ కవితను తను చనిపోవడానికి (1966) ముందే ఊహించి రాయటం గొప్ప విషయం. ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడనని ముందే ఊహించి చెప్పటం (1962 లోనే) గొప్ప విషయం. అందుకే తన కవిత్వం గూర్చి తన మాటల్లోనే నా అక్షరాలు ప్రజా శక్తులా వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలూ వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పుకు న్నాడు. ఇందులో భావం ఏదైనా మొదటిది తన వస్తువు అని రెండవది శైలి గురించి అని ఉండవచ్చు అంటారు. ‘కుందుర్తి ఆంజనేయులు’ గారు. మొత్తం మీద చూస్తే అభ్యుదయ భావనా కాల్పనికోద్యమ కాలం నాటి శబ్ద సౌందర్యమూ రెండింటి కలబోత తిలక్‌ కవిత్వం. శ్రీశ్రీ ప్రభంజనం ముందు తిలక్‌, గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి వారు కనపడనప్పటికి వారి శైలితో రచనలు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం విశేషం. వీరి రచనలు కథానిక సంపుటాలు తిలక్‌ కథలు – 1967, సుందరి సుబ్బారావు 1961, ఊరి చివర ఇల్లు – 1961, నాట కాలు సుశీల పెళ్లి – 1961, సాలె పురుగు నాటికలు సుచి త్ర ప్రణయం – 1961, ఇరుగు పొరుగు – 1960, సుప్త శీల – 1967, పొగ, భరతుడు, లేఖ సాహిత్యం తిలక్‌ లేఖలు – 1968, కవితా సంపుటాలు ప్రభాతము – సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు. అమృతం కురిసిన రాత్రి మొదలైనవి.
తిలక్‌ కవిత్వం, శ్రీశ్రీ గారి కవిత్వం ఇప్పుడున్న పరిస్థి తులకు అక్షరాల అన్వయించుకోవచ్చు అనుభూతివాద కవిత్వం పక్కనపెడితే చాలా వరకు నేటి వర్తమాన పరిస్థి తులు కూడా 1950 నాటి మాదిరిగానే ఉన్నాయి. ఇప్పటికి కొంతమంది జీవితాల్లో పెద్దగా భౌతికమైన మార్పు ఐతే వచ్చినట్లుగా అనిపించటం లేదు. ఇది కాదనలేని వాస్తవం కూడా. ‘కుందుర్తి’ గారు అన్నట్లుగా తిలక్‌ మహా గట్టి వాడు. వచన కవితా ప్రక్రియను సుసంపన్నం చేసిన వారి లో తిలక్‌ కు కూడా ప్రత్యేక స్థానం వుంది. అందుకే శ్రీశ్రీశ్రీ తిలక్‌ నుద్దేశించి గాలి మూగదయింది. పాట బూడిదయి పోయింది. వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభా రవి మరికనిపించడా? కోకిలవలె కూజించే కాలధ్వని కీసర వలె గర్జించేరణధ్వని ఇక వినిపించదా అన్నట్లు 1966 జులై 1న తన 45వ ఏటనే సాహిత్యాన్ని మనకు ఇచ్చి తను మాత్రం కీర్తి శేషులయ్యారు.
డా॥మహ్మద్‌ హసన్‌
– 9908059234

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News