Homeఎడిటోరియల్ / బహుళTirumala Laddu Contamination: అందరూ ధర్మకర్తలే, నెయ్యి ఎలా మాయమైంది?

Tirumala Laddu Contamination: అందరూ ధర్మకర్తలే, నెయ్యి ఎలా మాయమైంది?

TTD Ghee Scam: వెంకన్న ఏమీ వినడు చెప్పడు. చూస్తూ ఉంటా డని నమ్ముతున్నాను. సాక్షిగా చూస్తూ ఉంటాడంతే. కాని అధికారులు చేసే పనులు దర్యాప్తులో తెలుస్తా యని ఇంకా రాజ్యాంగనీతి, రాజనీతి ఉంటుందని ప్ర సాదమని లడ్డూ అనుకుని తినే భక్తులు విశ్వసిస్తున్నారు కదా.
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో తనకు సంబం ధం లేదన్న ఆనాటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్ప న్న వాడింది ఆ చైర్మన్‌ ఫోన్‌ నెంబరే అని సిట్‌ తేట తెల్లం చేసిందని ఇటీవల ఈనాడు టీవీ వెల్లడి చేసింది. ఇంకా దర్యాప్తు చేస్తే ఎన్నెన్నో వివరాలు రావచ్చు. ఇదొక మచ్చు తునక.
నేరం చేసింది పెద్దలా? వారి పీఏలా?

- Advertisement -

ఒక పెద్దవారు టీటీడీ ఈవో, చైర్మన్‌, వారు చెప్పినట్టు చేసే పీఏ గారులు ఉంటారు. కాని నేరం చేసింది పీఏ గార్లు, తదితర ‘‘అధికారు’’ లట. పెద్దదైన ఆక్సిడెంట్‌ చేసి పెద్దలు సాయం చేసి కేవలం డ్రైవర్‌ను జైలు కు పంపించినట్టు, కొంత ప్రతిఫలం ఇస్తే చాలు కదా అనుకున్నట్టు అనిపిం చినా, అని పైకి ఎవ్వరూ అనుకోకూడదు. పీఏ జైల్లో ఉండవచ్చు. తరు వాత అందరం మరిచిపోతాం. పెద్దలు మళ్లీ ఎన్నికలై మంత్రులు టీటీడీ ధర్మకర్తలు కూడా కావచ్చు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని వారూ వీరూ అని లెక్కపెట్టుకోనే పరిస్థితి లేదు. అంతా రహస్యం. సమాచార హక్కు ఉంది కాని సమాచారం లేదు. అది ప్రైవసీ. బహిరంగ రహస్యం. అయినా ప్రైవసీ. అందరికీ తెలుసు. అందరూ వెజ్‌ మాత్రమే తినే వారే, కాని చికెన్‌ మాయమైంది. అదే అవినీతి, అదే లంచం.

ఇది ఆంధ్ర, తెలంగాణ పత్రికలవారు చెప్పిన వార్తలు, హెడ్‌లైన్లు కాదు వివరాలు చదవండి. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి ఉపయో గించిన నెయ్యి కల్తీదేనని సీబీఐ సిట్‌ గుర్తించింది. ఐదేళ్ల పాటు ఈ నెయ్యి సరఫరా సాగిందని తేల్చినట్లుగా తెలుస్తోందని సీబీఐ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు 5 సంవత్సరాలుగా అక్రమంగా నకిలీ నెయ్యి సరఫరా చేశారని సీబీఐ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (SIT) షాకింగ్‌ వెల్లడి చేసింది. ఉత్తరాఖండ్‌లోని భోల్‌ బాబా డైరీలోంచి 2019-2024 మధ్య రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చింది. ఈ నెయ్యి తయారు చేయడానికి భోలేబాబా డెయిరీ ఒక్క చుక్క కూడా పాలు కొనుగోలు చేయకుండా పూర్తిగా కెమికల్స్​‍తో చేసిన కల్తీ నెయ్యిని తయారు చేశారు. ఈ కేసులో A-16 ఆరోపితుడు అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ అరెస్టు తర్వాత ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ACB కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో, భోలే బాబా డైరీ మోనోడిగ్లిసరైడ్స్​‍, యాసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి కెమికల్స్​‍తో నెయ్యి తయారు చేసి, టీటీడీ క్వాలిటీ కంట్రోల్‌ టెస్టులను మానిప్యులేట్‌ చేసిందని వివరించారు.

సీబీఐ సిట్‌ దర్యాప్తులో భోలే బాబా డైరీ భగవాన్‌పూర్‌, ఉత్తరాఖండ్‌ ప్రమోటర్లు పాలు లేదా బట్టర్‌ కొనుగోలు చేయకుండా షెల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చారు. ఆ డెయిరీ ఉన్న చోట్ల స్థానిక పశువులు పెంచేవారు ‘ఎప్పుడూ పాలు సర ఫరా చేయలేదు’ అని సీబీఐ సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి బదులు గా, ఢిల్లీలోని మలేషియా పామ్‌ ఆయిల్‌ ఇంపోర్టర్‌ నుంచి హర్ష్‍ ఫ్రెష్‌ డైరీ పేరుతో పామ్‌ ఆయిల్‌, కెర్నల్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి, కెమికల్స్​‍తో నెయ్యి తయారు చేశారు. 2022-2024 మధ్య అజయ్‌ సుగంధ్‌ నుంచి రూ.7 కోట్ల విలువైన యాసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ కొనుగోలు చేశారు.

2022లో టీటీడీ బ్లాక్‌లిస్ట్‍ చేసినా, భోలే బాబా డైరీ అక్రమ సరఫరా ను ఆపలేదు. తిరుపతి వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్‌ మాల్‌ గంగా డైరీ, తమిళ నాడు ఏఆర్‌ డైరీ ఫుడ్స్​‍ వంటి ఇతర డైరీల ద్వారా బిడ్‌లు రూట్‌ చేసి నకిలీ నెయ్యి సరఫరా కొనసాగించారు. ఈ డైరీలు భోలే బా బా ప్రమోటర్ల చేతుల్లోనే ఉన్నాయని, బినామీ కంపెనీ లుగా ఉపయోగించారని సిట్‌ రిపోర్టు స్పష్టం చేసింది. మొత్తం 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి విలువ రూ. 250 కోట్ల విలువ ఉందని, ఇది టీటీడీ ప్రసాదాలు, పూజా సామగ్రి తయారీలో విస్తృతంగా ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో A-16 అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ అరె స్టు కీలకమైంది. అతను కెమికల్స్​‍ సరఫరాదారు. యాసి టిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌లను రూ. 7 కోట్ల విలువతో సరఫరా చేశాడు. భోలె బాబా డైరీ ప్రమోటర్లు మిల్క్‍ ప్రొక్యూర్‌ మెంట్‌, పేమెంట్‌ రికార్డులను ఫేక్‌గా తయారు చేసి సమర్పించారు. డైరీలో డిఫంక్ట్‍ యూనిట్‌ను కొనుగోలు చేసి, పామ్‌ ఆయిల్‌తో నెయ్యి తయారు చేశారు.

నెల్లూరు ఏసీబీ కోర్టులో జనవరి 23, 2026న సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దాఖలు చేసిన తుది ఛార్జిషీట్‌ ప్రకారం, తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ కేసులో టీటీడీ అధికారులు, డెయిరీ యజమానులు సరఫరాదారులు సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దాదాపు 15 నెలల పాటు సాగిన ఈ దర్యాప్తు లో, 2019 – 2024 మధ్య కాలంలో నిందితులందరూ కుమ్మక్కై, స్వచ్ఛ మైన ఆవు నెయ్యికి బదులుగా 68 లక్షల కిలోల కంటే ఎక్కువ కల్తీ, సింథటిక్‌ నెయ్యిని (వనస్పతి కొవ్వులు/రసాయనాల మిశ్రమం) సరఫరా చేసినట్లు నేరారోపణలు సిద్ధమైనాయి. మొత్తం 36 మంది పేర్లు ఛార్జీషీట్స్​‍ ఒక్కొక్కరి పేరు వారి వెనుక పెద్దలు, వారు కట్టుకున్న మురికి లంచం మూ టలు వివరంగా చదివితే తెలుస్తుంది. ఆ మాటలు చెప్పకుండా మాయ మాటలు చెబుతున్నారు.

తోలుబొమ్మలు బోలెడు, సూత్రధారులు వేరు

పోమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌: ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు (నకిలీ నెయ్యి ఉత్పత్తికి ఇది ప్రధాన కేంద్రమని ఆరోపణ).
అపూర్వ వినాయకాంత్‌ చావ్డా: వైష్ణవి డెయిరీ సీఈఓ.
ఆర్‌. రాజశేఖరన్‌: ఏఆర్‌ డెయిరీ (తమిళనాడు) మేనేజింగ్‌ డైరెక్టర్‌.
అజయ్‌ కుమార్‌ సుగంధ్‌: ఢిల్లీకి చెందిన వ్యాపారి. నెయ్యి వాసన రంగు వచ్చేలా చేసే రసాయనాలను (ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్లు/ఫ్లేవర్లు) సరఫరా చేసినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి.

టీటీడీ అధికారులు, సిబ్బంది:

ఆర్‌.ఎస్.ఎస్.వి.ఆర్‌. సుబ్రహ్మణ్యం: టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (సరఫరాదారులతో కుమ్మక్కైనందుకు అర్టెస్టయ్యారు).
ప్రలయ కావేరి మురళీ కృష్ణ: రిటైర్డ్‍ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం.
చిన్న అప్పన్న: మాజీ టీటీడీ చైర్మన్‌, వైవీ సుబ్బారెడ్డి మాజీ సహాయ కుడు.
ఈ కుట్రలో పాల్గొన్న మరో ఏడుగురు టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చారు.

డెయిరీ నిపుణులు ఇతరులు:

విజయ భాస్కర్‌ రెడ్డి: ఎక్స్​​‍టర్నల్‌ డెయిరీ నిపుణుడు. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు తనిఖీ నివేదికలు ఇచ్చి, కల్తీ నెయ్యికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కలిసి నేరాలు చేసినవాళ్లలో కేవలం చిన్నవాళ్లు తప్పించుకుంటారా?
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్‌ 3(5) ఉమ్మడి నేర బాధ్యతను (Joint Criminal Liability) నిర్ధారిస్తుంది. ఒక నేరపూరిత చర్యను పలువురు వ్యక్తులు కలిసి, ఒకే ఉమ్మడి ఉద్దేశ్యంతో చేసినప్పుడు, ఆ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ నేరాన్ని తామే స్వయంగా చేసినట్లుగా భావించబడతారు. సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది.

నిర్వచనం బాధ్యత: IPC 34,, BNS 3(5) రెండూ కూడా ఒకే సూత్రాన్ని చెబుతున్నాయి. పలువురు వ్యక్తులు కలిసి ఒక ఉమ్మడి ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఏదైనా నేరపూరితమైన పనిని చేసినప్పుడు, వారిలో ప్రతి ఒక్కరూ ఆ పనిని తానే ఒంటరిగా చేసినట్లుగానే శిక్షకు అర్హులవుతారు.
ప్రధానాంశాలు: ఈ సిద్ధాంతం వర్తించాలంటే నిందితుల మధ్య ముందస్తు ప్రణాళిక, ‘అభిప్రాయాల కలయిక’ (Meeting of minds), నేరంలో చురుకైన భాగస్వామ్యం ఉండాలి.

కొత్త నేరం కాదు: గతంలోని సెక్షన్‌ 34 లాగే, BNS లోని సెక్షన్‌ 3(5) కూడా ఒక ప్రత్యేకమైన నేరాన్ని సృష్టించదు. ఇది కేవలం ఒక సాక్ష్యా ధార నియమంగా (Rule of evidence) పనిచేస్తుంది. ఒకే ఉద్దేశ్యంతో పలువురు కలిసి నేరానికి పాల్పడినప్పుడు వారిని శిక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.
సమూహ దాడులు లేదా మోసాల వంటి సందర్భాల్లో, ఇతరుల వెనుక దాక్కుని శిక్ష నుండి తప్పించుకోకుండా నిరోధించడానికి IPC లోని సంయుక్త బాధ్యత సారాంశాన్ని BNS అలాగే కొనసాగించింది.

అక్రమ అసెంబ్లీలో ఉండే “ఉమ్మడి లక్ష్యం (Common Object – BNS సెక్షన్‌ 189 / IPC 149) తో పోలిస్తే, ఉమ్మడి ఉద్దేశ్యం (Common Intention)లో తప్పనిసరిగా ముందస్తు ప్రణాళిక, భాగస్వామ్య ఉద్దేశ్యం ఉండాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే, IPC సెక్షన్‌ 34కి సమానమైన ప్రస్తుత నిబంధన BNS 3(5). ‘భాగస్వామ్య ఉద్దేశ్యం అంటే భాగస్వామ్య బాధ్యత’ అనే చట్టపరమైన సూత్రాన్ని ఇది యథాతథంగా అమలు చేస్తుంది.

ప్రొ. మాడభూషి శ్రీధర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News