Sunday, September 22, 2024
Homeఓపన్ పేజ్Villages: పలుచనైపోతున్న పల్లెలు

Villages: పలుచనైపోతున్న పల్లెలు

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, భారత దేశం ఆత్మ పల్లెల్లో ఉందని జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. ఒకప్పుడు పాడిపంటలకు, స్వచ్ఛతకు, ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలమైన మన గ్రా మాలు నేడు వాటి ఔన్నత్యాన్ని, వైవిధ్యాన్ని కోల్పోయి వెల వెలబోతున్నాయి. భారత దేశంలో సుమారు 6 లక్షల పైచి లుకు గ్రామాలున్నాయి. అయితే గ్రామ జనాభా మాత్రం పోనుపోను పలుచనై పోతోంది. 1991లో 74.22శాతం ఉన్న గ్రామ జనాభా, 2001కి 72.08శాతానికి, 2011కి 68.72 శాతానికి, 2021కి 64.61శాతానికి పడిపోయి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పట్టణ జనాభా మాత్రం ఎగబాగుతూ వచ్చింది. మనది ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. అయితే వ్యవసాయ రంగం దేశీయంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటోంది. ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం నేడు గిట్టుబాటు కాని వ్యవహారంగా తయారైంది. దీనికితోడు కరువు కాట కాలు వెంటాడుతున్నాయి. దాంతో వ్యవసాయంపై ఆధార పడిన రైతులు, రైతుకూలీలు పల్లెలు వదిలి పట్టణబాట పట్టుతున్నారు. దేశీయంగా మొత్తం కర్షకుల్లో 85 శాతా నికి పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఇలా రైతులు, కూలీలు, చేతివృత్తులవారు జీవనాధరం లేక పల్లెలు వదిలి పోతుంటే, ఉద్యోగ ఉపాధులకై కొందరు, గ్రామాల్లో మౌలిక వసతులు కొరవడి మరికొందరు పట్టణాలకు వలస వెడుతున్నారు. ఇంకా నగరాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బాగా ఆర్జన చేస్తున్న పిల్లలున్న తల్లిదండ్రులు కొంత మంది సుఖజీవనానికై పట్టణాలకు వెళ్తున్నారు.
వలసలతో సమస్యలు
ఉపాధిని వెతుక్కుంటూ వలసవెళ్తున్న పల్లెవాసులతో పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి.అంతకంతకు ఎక్కువవుతున్న వలసలతో అక్కడగృహవసతి, తాగునీరు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ఓ ప్రణాలికా, పద్ధతీ లేని పట్టణీకరణ అనేక సమస్యలకు దారితీస్తోంది.నగరాలకు వలసవెళ్ళినా, నైపుణ్యాలు లేనివారికి వెంటనే ఉద్యోగాలు దొరకడం లేదు. అక్కడ చాలీచాలని ఆదాయాలతో బతుకులు వెళ్ళ దీస్తు న్నారు. మరోవైపు నిరుద్యోగమూ పెరుగుతోంది. పట్టణాల్లో సామాజిక జీవనంలో భిన్నత్వం, వేగవంతమైన మార్పులు, మనుషుల మధ్య సన్నిహిత సంబంధాలు లేక పోవడం వల్ల వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మరోపక్క పల్లెల్లో జనాభా తగ్గి పల్లెభారతం జీవకళ కోల్పోతోంది.పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు, సాగుబడి పనులతో సందడిగా ఉండాల్సిన గ్రామాలు.. జనంలేక వెలవెలబోతున్నాయి.ఒకప్పుడు నిండైన ఇళ్ళు, మెండైన జనాభాతో అలరారిన అనేక గ్రామాలు ఇప్పుడు విసిరేసినట్లు అక్కడక్కడ ఇళ్ళు, అరకొర జనాభాతో బోసి పోతున్నాయి.కొన్ని గ్రామాల్లో అయితే వీధికి ఒకటో, రెండో ఇళ్ళుమాత్రమే ఉంటున్నాయి. అలాంటి చోట్ల ప్రజలు రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అంతేగాక పల్లెల్లో సామాజిక పరంగా, సాంస్కృతికపరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. పల్లెల్లో ఒకప్పుడు ఏ ఇంట్లో శభకార్యం జరిగినా ఊరుఊరంతా భాగం పంచుకునేవారు. అలాంటి ఆనం దాల ఆత్మీయ సువాసనలు నేడు కరువైపోయాయి. ఒక ప్పటి పల్లెవాసుల అనుబంధం, కలివిడితనం మృగ్యమైపో యాయి. ఇపుడు పల్లెవృత్తులన్నీ పడకేసాయి. ఒకనాడు పల్లెల్లో రైతులు, రైతుకూలీలు, చేతివృత్తుల వారు నివసించిన గృహాలు, వారు వాడిన పనిముట్లువగైరాలు రానురాను కనుమరుగవుతున్నాయి. దేశార్థికాభివృద్ధికి చోదకశక్తులుగా నిలవాల్సిన గ్రామాలు ఇప్పుడు పలు సమస్యలతో కునారిల్లుతున్నాయి.
గ్రామాల పరిపుష్టీకరణ చర్యలు అవసరం
వలసలను నిరోధించేలా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధికల్పనకు పెద్దపీట వేయాలి. స్థానిక వన రుల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేలా చర్యలు గైకొనాలి.గ్రామాల ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన సేద్య రంగం నేడు ఎన్నో ఒడుదొడుకులకు గురవుతోంది. సాగు రంగం సంక్షోభంతో సేద్యం వదిలేసి రైతులు, రైతుకూలీలు ఊళ్ళకు ఊళ్ళే ఖాళీచేసి పట్టణాలకు తరలిపోతున్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధరలు కల్పించి అన్నదాతలను, ఉపాధి కల్పించి కూలీలనూ ప్రభుత్వాలు విధిగా ఆదుకోవాలి.కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతిన్న ప్పుడు, ఫసల్‌ బీమాతో పాటు ప్రభుత్వాలు కూడా తగు నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలి. వ్యవసాయరంగంలో యాంత్రీకరణ, సాంకేతికత వినియో గంపై దృష్టి సారించాలి. అలాగే దేశీయంగా సేద్యంతో పాటు వివిధ గ్రామీణవృత్తులు, కుటీర పరిశ్రమలు, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటివాటికి అధిక ప్రాధా న్యమివ్వాలి. వ్యవసాయరంగం అభివృద్ధి చెందితేనే దారి ద్య్ర నిర్మూలన జరిగి గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరు గవుతాయి. రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వాలు తీసు కొంటున్న చర్యలువారి అసలైన పురోగతికి తోడ్పడంలేదు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం హామీ నెరవేరనేలేదు. పెట్టుబడిమాత్రం రెట్టింపు అయ్యిందే తప్పఆదాయం పెరగనేలేదు.అందుకే సేద్యరం గం తేరుకునేలా, రైతాంగం పుంజుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకార్యాచరణను చేపట్టడం తక్షణావసరం.
గ్రామాల్లో ముఖ్యంగా యువ జనాభాబాగా తగ్గి పోతోంది. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వారు పట్ట ణాలకు వెళుతున్నారు. ఈ తరహా వలసలను అరికట్టే దానికి గ్రామాల్లో అంకుర సంస్థల స్థాపనకు ప్రభుత్వం యువకులను ప్రోత్సహించి వారికి పూర్తి రాయితీలు కల్పించాలి.పల్లెపట్టులనుంచివలసలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతో కీలక మైనది. ఇది శ్రమజీవులకు ఉన్న ఊళ్ళోనే ఏడాదికి కనీసం 100రోజులపాటు పని కల్పించాలని నిర్దేశించిన పథకం. అయితే దీనికినిధుల కేటాయింపుల్లో కేంద్రంఏటా కోతలు విధిస్తోంది. 2020-21లో రూ. 1,11,169 కోట్లు కేటా యించిన ఈ పథకానికి, 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ. 60,000కోట్లు మాత్రమే కేటాయించడం విచార కరం. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. పల్లెల్లో చాలా నిరుపేద కుటుంబాలు ఉపాధి హామీ పనులతోనే నెట్టుకొస్తున్నాయి. అందువల్లదీనికి నిధు లు పెంచి, తద్వారా స్థానిక రహదారులు, తాగునీరు, నీటి పారుదల, పారిశుద్ధ్యం వంటి మౌలికవసతుల పనుల్ని చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామాల్లో మెరు గైన పాలనకుదోహదపడే పంచాయితీరాజ్‌ వ్యవస్థనేడు నిధులు లేమితో నిర్వీర్యంఅవుతోంది. పంచాయితీలకు సరిపడా నిధులు, విధులు కేటాయించిస్థానికసుపరిపాలన సాధనకు ప్రభుత్వం నడుం కట్టాలి.మన దేశంలో ఇప్పటికీ కనీస వసతులు లేని గ్రామాలు చాలా ఉన్నాయి.రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం.. ఇలా ఎన్నో విషయాల్లో ఇబ్బందులున్నాయి.ఇవన్నీ ప్రభుత్వాలు పరి ష్కరించాల్సిన ప్రధాన సమస్యలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల గ్రామాల్లో నెలకొన్న అసలు సమస్యలను పరిష్కరించి,పల్లె భారతాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఎంతైనా ఉంది. పల్లెలకు జవసత్వాలు సమకూరితేనే వలస లకు అడ్డుకట్ట పడుతుంది.
పీ.వీ.ప్రసాద్‌

  • 9440176824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News