Cloves Milk For Good Health: లవంగాలు లేనిదే నాన్వెజ్ వంటకం ఉండదు. వాటి ఘాటు మహిమ అలాంటిది. కానీ తినేటప్పుడు నోటికి తగిలితే మాత్రం తీసి అవతల పారేస్తాం. మళ్లీ ఏ జలుబో, దగ్గు వంటిది తగిలితే మాత్రం నోట్లో దవడకి పెట్టుకుని చప్పరిస్తాం. ఓ సారి ఇష్టంగా, మరోసారి కష్టంగా ఉండే లవంగాలు కేవలం ఘాటు, రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి దివ్య ఔషధం. అదెలాగో చూద్దాం.
లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ డైరెక్టుగా నమలలేని వాళ్లు.. లవంగాలను పాలలో వేసి మరిగించి తాగితే ఉపయోగకరంగా ఉంటుంది. అద్భుతమైన ఔషధంగా పనిచేసే ఈ మిశ్రమం.. ఆయుర్వేదంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/these-are-the-super-foods-for-gut-health/
వర్షాకాలం, చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో లవంగాలు ఓ యుద్ధమే చేస్తాయి. పాలలో లవంగాలను వేసి మరిగించి తాగితే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం మన శరీరానికి దోహదపడుతుంది. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉండటం వల్ల.. ఈ మిశ్రమం రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
పాలు, లవంగాలు మిశ్రమం వల్ల సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గడంతో పాటు.. జ్వరం నుంచి త్వరగా బయటపడతారు. ముఖ్యంగా రాత్రిపూట పాలు, లవంగాల మిశ్రమం గోరువెచ్చగా తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర, మంట వంటి సమస్యలకు ఉపశమనం. బ్రాంకైటిస్ నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఊపిరితిత్తుల వాపులు తగ్గుతాయి.
Also Read: https://teluguprabha.net/health-fitness/these-four-foods-control-blood-pressure-naturally/
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండేందుకు లవంగాలు, పాల మిశ్రమం దోహదపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు.. జీర్ణాశయంలో పలు ఎంజైమ్లు అందుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండటం ద్వారా.. శరీరంలోని వాపులను నిర్మూలిస్తుంది. తద్వారా ఒళ్లు నొప్పుల బాధ తగ్గుతుంది.
ముఖ్యంగా కీళ్ల నొప్పుల సమస్యలు, నిద్ర లేమితో బాధపడుతున్న వారికి పాలు, లవంగాల మిశ్రమం మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవ్వడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
లవంగాల్లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం దొరుకుతుంది. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి లివర్ వాపులకు గురి కాకుండా కాపాడుతుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత లవంగాలు, పాల మిశ్రమం తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
అయితే రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పొట్టలో తరచూ అసౌకర్యం ఏర్పడే వారు, అలర్జీలు ఉన్నవారు ఈ లవంగాలు, పాల మిశ్రమం తీసుకోకూడదని గమనించాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓసారి డాక్టర్ను సంప్రదించిన తర్వాత పాలు, లవంగాల మిశ్రమం తీసుకోవడం శ్రేయస్కరం.


