Saturday, November 15, 2025
Homeహెల్త్Dry Eye Syndrome: :ఏసీ చల్లదనం.. కళ్లకు కల్లోలం! - రోజంతా ఎయిర్ కండిషనర్‌లో ఉంటున్నారా?

Dry Eye Syndrome: :ఏసీ చల్లదనం.. కళ్లకు కల్లోలం! – రోజంతా ఎయిర్ కండిషనర్‌లో ఉంటున్నారా?

Health risks of air conditioning : ఉక్కపోత నుంచి సేదతీరడానికి ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని ఆశ్రయిస్తున్నారా? ఆ చల్లని గాలిలో గంటల తరబడి పనిచేయడం హాయిగా అనిపిస్తోందా? అయితే మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా? మంటగా, దురదగా అనిపిస్తోందా? అయితే మీ ఆఫీసులోని ఏసీనే అసలు కారణం కావచ్చు! కేవలం వేడి నుంచి ఉపశమనమే అనుకుంటున్న ఈ చల్లదనం మన కళ్లకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతోంది? ‘డ్రై ఐ సిండ్రోమ్’ అంటే ఏమిటి? దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

- Advertisement -

వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడకం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ కృత్రిమ చల్లదనం మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన కళ్లకు పెను సవాలు విసురుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి ఏసీలో గడపడం వల్ల ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఏసీ గదిలోని గాలిలో ఉండే తేమను పీల్చేస్తుంది, ఫలితంగా వాతావరణం పొడిగా మారుతుంది. ఇది మన కళ్లలోని సహజమైన తేమను కూడా ఆవిరి చేసి, కళ్లు పొడిబారేలా చేస్తుంది. దీనికి తోడు, రోజుకు 6 నుంచి 7 గంటల పాటు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల స్క్రీన్లను చూడటం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

డ్రై ఐ సిండ్రోమ్’ లక్షణాలివే: కళ్లలో మంట, దురద, కళ్లు ఎర్రబడటం, చూపు మందగించడం, తరచూ నీళ్లు కారడం, కళ్లలో పుసులు ఏర్పడటం, వెలుతురును చూడలేకపోవడం వంటివి ‘డ్రై ఐ సిండ్రోమ్’ ప్రధాన లక్షణాలు. ఏసీ వల్ల కంటి దురద, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయని annallergy.org అధ్యయనంలో పేర్కొంది. ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్, కాలుష్యం, నిద్రలేమి వంటివి కూడా ఈ రుగ్మతను పెంచుతాయి.

ఏసీతో పొంచి ఉన్న ఇతర ముప్పులు
చర్మ సమస్యలు: వాతావరణంలో తేమ తగ్గడం వల్ల కళ్లతో పాటు చర్మం కూడా పొడిబారి, నిర్జీవంగా మారుతుంది.
నిర్జలీకరణం (Dehydration): ఏసీ చల్లదనానికి దాహం వేయకపోవడంతో తగినంత నీరు తాగరు. ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యేలా చేస్తుంది.
శ్వాసకోశ ఇబ్బందులు: ఏసీ ఫిల్టర్లను సరిగా శుభ్రం చేయకపోతే, అందులో చేరే దుమ్ము, ధూళి, ఫంగస్ కారణంగా అలెర్జీలు, ఆస్తమా వంటి శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
రోగనిరోధక శక్తి క్షీణత: చల్లని ఏసీ గది నుంచి అకస్మాత్తుగా బయటి వేడి వాతావరణంలోకి వెళ్లినప్పుడు, ఉష్ణోగ్రతలో వచ్చే మార్పును శరీరం తట్టుకోలేక రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల సులభంగా జలుబు, ఫ్లూ బారిన పడతారు.
కీళ్లు, కండరాల నొప్పులు: ఏసీ చలికి ఎక్కువసేపు ఉండటం వల్ల కీళ్లు, కండరాలలో బిగుసుకుపోయినట్లు అనిపించడం, ఆర్థరైటిస్ సమస్య తీవ్రమవడం జరగవచ్చు.
బద్ధకం, అలసట: నిరంతరం ఏసీ గాలికి గురికావడం వల్ల శరీరం బద్ధకంగా మారి, చురుకుదనం తగ్గుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీ ఉష్ణోగ్రతను 24-26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూసుకోవాలి. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు హానికరం. ఏసీ నుంచి వచ్చే గాలి నేరుగా ముఖానికి, కళ్లకు తగలకుండా చూసుకోవాలి. గదిలో తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు ఒక గిన్నెలో నీళ్లు పెట్టడం లేదా హ్యూమిడిఫైయర్లను ఉపయోగించడం మంచిది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తరచూ నీళ్లు, పండ్ల రసాలు వంటివి తాగుతూ ఉండాలి.
కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు తరచూ కనురెప్పలు ఆర్పుతూ ఉండాలి. పొడి వాతావరణంలో రక్షణ కళ్లద్దాలను వాడటం శ్రేయస్కరం అని nih.gov అధ్యయనం సూచిస్తోంది. వైద్యుల సలహా మేరకు కళ్లు తడిగా ఉండేందుకు లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడవచ్చు.

నిర్లక్ష్యం చేస్తే చూపుకే ఎసరు : ‘డ్రై ఐ సిండ్రోమ్’ను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే, అది కంటి ముందు పొర అయిన కార్నియాను దెబ్బతీసి, శాశ్వతంగా చూపును దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే కంటి చుక్కల మందులతో సులభంగా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే శస్త్రచికిత్స వరకు వెళ్లాల్సి రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad