Friday, September 20, 2024
Homeహెల్త్Eye care: కంటి ఆరోగ్యం ..

Eye care: కంటి ఆరోగ్యం ..


కంటి సంరక్షణ, కంటి ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఇందుకోసం ప్రాధమికమైన కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా అనుసరించాలి. అవేమిటంటే…
 అతినీలలోహిత కిరణాల నుంచి, అలాగే కాటరాక్టు ఏర్పడకుండా అడ్డుకోవడంలో సన్ గ్లాసులు ఎంతో ప్రయోజనకరం. అందుకే నాణ్యమైన సన్ గ్లాసులను కళ్లకు ఎప్పుడూ పెట్టుకోవాలి. స్క్రీన్ మీద పనిచేసేటప్పుడు బ్లూ కోటింగ్ యాంటిరిఫ్లక్షన్ లెన్సులను తప్పనిసరిగా వాడాలి. బ్లూకోటింగ్ అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటాయి. అలాగే స్లీప్-వేక్ సైకిల్ కూడా సరిగా ఉంటుంది.
 డైట్ లో తోటకూర, పాలకూర, బ్రొకోలీ వంటివాటిని తప్పనిసరిగా తీసుకుంటుండాలి. వీటిల్లోని ల్యూటిన్, జెక్సాన్థిన్ లు కాటరాక్టు పాలబడకుండా కాపాడతాయి. ల్యూటిన్ వర్ణద్రవ్యాల వ్రుద్ధిని ఉద్దీపనం చేస్తుంది. అవి ప్రమాదకరమైన అతినీలలోహితకిరణాలను అడ్డుకుంటాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, జింకు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల వయసుతో వచ్చే మాక్యులర్ డీజనరరేషన్ రిస్కు తగ్గుతుంది.

- Advertisement -

సూర్యకాంతి వల్ల కలిగే హాని నుంచి యాంటాక్సిడెంట్లు రక్షిస్తాయి. గుడ్డు సొన, దోసకాయ, చిలకడదుంప, కేరట్, బ్లూబెర్రీస్, యెల్లో పెప్పర్స్, ఉల్లి, వెల్లుల్లి, సాంబారు ఉల్లిపాయలు వంటి వాటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఉండే సల్ఫర్, సెస్టైన్, లెసిథిన్ లు కళ్లల్లో కాటరాక్టు రిస్కు తలెత్తకుండా నియంత్రిస్తాయి.
 పొడికళ్లల్లో ఇరిటేషన్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందులోనూ కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేటి తరుణంలో కళ్లల్లో ఇరిటేషన్, డ్రైనెస్ సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇవి తలెత్తకుండా ఉండాలంటే కళ్లకు బాగా విశ్రాంతినివ్వాలి. కళ్లను నీళ్లతో తరచూ కడుక్కుంటుండాలి. ఇలా చేస్తే కళ్లల్లో డ్రైనెస్ తో పాటు ఇరిటేషన్ కూడా పోతుంది. పొడికళ్లతో ఎక్కువగా బాధపడుతున్నవాళ్లు కళ్లల్లో డ్రాప్స్ వేసుకుంటే మంచిది. ఐడ్రాప్స్ కంటిలో తేమను పెంచుతాయి. ఇలాంటి వాళ్లు కంటి వైద్యుల సలహాతో తగిన ఐడ్రాప్స్ వాడడం మంచిది.

 చాలామంది కంప్యూటర్లకు అతుక్కుపోయి నిత్యం గంటలకొద్దీ స్క్రీన్ల ముందు పనిచేయాల్సివస్తోంది. ఇలాంటప్పుడు ప్రతి 20 నిమిషాల కొకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి బ్రేకు తీసుకుని 20 సెకన్లపాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై మీ ద్రుష్టిసారిస్తుండాలి. ఇలా చేయడంవల్ల కంటికి కాస్త సాంత్వన
లభిస్తుంది. అలాగే ఫాంట్ సైజును పెద్దవిగా పెట్టుకుని పనిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటిపై శ్రమ పడదు. స్ర్కీన్ పై ఎలాంటి మచ్చలు ఏర్పడకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే స్క్రీన్ పై అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి నిత్యం వర్కు మొదలెట్టబోయేముందు పొడిగుడ్డతో స్క్రీన్ ను శుభ్రంగా తుడుచుకుంటే మంచిది.
 ప్రతి ఏడాది నిపుణులైన నేత్రవైద్యులతో తప్పనిసరిగా కంటిపరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడంవల్ల కంటి సమస్యలు వెంటనే బయటపడి తగిన చికిత్సతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News