Mental Disorders in India: దేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 ఏళ్లలోపు వారిలోనే సంభవిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. చిన్న వయసులోనే మానసిక ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుందో నిపుణులు వివరించారు.
ప్రతి మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ చాలా ముఖ్యం. మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే.. అది బాడీతో పాటు ఇతర కార్యకలాపాలపైనా ప్రభావం చూపిస్తుంది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ డేటా ప్రకారం, దేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే సంభవిస్తున్నాయి. డేటా మాలిక్యులర్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. మానసిక రుగ్మతల్లో 34.6 శాతం 14 సంవత్సరాల కంటే ముందే, 48.4 శాతం 18 సంవత్సరాల కంటే ముందే, 62.5 శాతం 25 సంవత్సరాల వయస్సులోపు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ గణాంకాలు చాలా మంది రోగులకు, మానసిక అనారోగ్యం యుక్తవయస్సు రాకముందే ప్రారంభమై క్రమంగా వారి ఆరోగ్యం క్షీణిస్తోందని చెబుతున్నాయి.
25 సంవత్సరాల వయస్సులోనే, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ADHD), ఆందోళన, రుగ్మతలు వంటి చాలా కేసులు నిర్ధారణ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ కేసులు కూడా మునుపటి కంటే చిన్న వయస్సులోనే నిర్ధారణ అవుతున్నాయని చెబుతున్నారు. ఈ మానసిక రుగ్మతలను చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి తీవ్రమైన సమస్యగా మారవచ్చని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వెల్లడించింది. .
పిల్లలు చదువుకుంటున్న, తమ కెరీర్లను నిర్మించుకుంటూ, సమాజానికి దోహదపడుతున్న వయస్సులో పేలవమైన మానసిక ఆరోగ్యం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2011- 2021 మధ్య, 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో పదే పదే మానసిక ఒత్తిడి 101.7 శాతం పెరిగిందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యువతలో మానసిక అనారోగ్యాలు పెరగడానికి ప్రధాన కారణం సకాలంలో చికిత్స లేకపోవడం, అనారోగ్యాల గురించి అవగాహన లేకపోవడం అని చెబుతున్నారు. కౌమారదశలో ప్రారంభమయ్యే మానసిక రుగ్మతలకు చిన్న వయస్సులోనే చికిత్స చేయకపోతే వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
వేగవంతమైన సామాజిక మార్పు సైతం యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని.. జీవిత అనుభవాలను గణనీయంగా మార్చివేసిందని నిపుణులు చెబుతున్నారు. నేటి యువత డిజిటల్ యుగంలో గడుపుతూ ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని, ఉపాధి, రిలేషన్స్ గురించి అనిశ్చితిని ఎదుర్కోవడంతో ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వెల్లడించారు.
ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మేల్కొనడం ప్రారంభించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రోజూ వ్యాయామం, యోగా చేయాలని.. సోషల్ మీడియాను వీలైనంత తక్కువగా వినియోగించాలని సూచిస్తున్నారు.

