Curry Leaves Benefits: ప్రకృతిలో లభించే అనేక మూలికలు మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. వాటిని సరైన విధంగా ఉపయోగిస్తే శరీరానికి కావలసిన శక్తి మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అలాంటి విలువైన మూలికల్లో మన రోజువారీ వంటింటిలో దాదాపు ఎప్పుడూ కనిపించే కరివేపాకు ఒకటి. ఎక్కువమంది దీన్ని కేవలం రుచికోసం వంటల్లో వేసుకుంటారు. కానీ పరగడుపున కరివేపాకు తినడం శరీరానికి ఎన్నో వైద్య ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు కరివేపాకులు నమలడం..
ఉదయం లేవగానే నోరు కడగకముందు ఒకటి లేదా రెండు కరివేపాకులు నమలడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఇది సాధారణ అలవాటుగా కనిపించినా, దీని వల్ల గుండె సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు వంటి అనేక సమస్యలపై మంచి ఫలితాలు ఉంటాయి.
కొలెస్ట్రాల్ అధికమైతే..
శరీరంలో కొలెస్ట్రాల్ అధికమైతే అది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా ఈ సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. అయితే ఉదయం పరగడుపున కరివేపాకు తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ధమనులు శుభ్రంగా ఉండటంతో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/dark-chocolate-health-benefits-explained/
మధుమేహం..
కరివేపాకు మధుమేహం బాధపడుతున్న వారికి కూడా చాలా ఉపయోగకరం. ఇందులో ఉన్న యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి, షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అందువల్ల మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో దీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియ సమస్యలతో..
జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కరివేపాకు సహజమైన పరిష్కారం. పరగడుపున దీన్ని నమలడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. శరీరం తేలికగా, ఆరోగ్యంగా అనిపించడానికి ఇది ఉపకరిస్తుంది.
బరువు తగ్గాలనుకునే…
బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం ఐదు కరివేపాకులు నమిలి గోరువెచ్చని నీరు తాగితే కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అదేవిధంగా దీన్ని నిమ్మరసంతో లేదా స్మూతీలో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన శరీర బరువు తగ్గడమే కాకుండా శరీర శక్తి కూడా తగ్గకుండా ఉంటుంది.


