Yashoda Hospitals Autism Spectrum Disorder: ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (ASD)పై అవగాహనను పెంపొందించడం, సమగ్ర విధాన పరమైన మార్పులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెల్లెక్టువల్ డిసెబిలిటీస్(NIEPID) సహకారంతో నేషనల్ ఆటిజం స్టేక్ హోల్డర్స్ సమ్మిట్– 2026ను నిర్వహించింది. ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ఆటిజం సంరక్షణతో పాటు సాధికారతను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హాజరై సదస్సును ప్రాంభించారు.
ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ఏప్రిల్ 11, 12 తేదీల్లో యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ బ్రాంచ్లో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 500 మందికిపైగా ప్రముఖ పిల్లల నాడీ వైద్య నిపుణులు, న్యూరోసైంటిస్టులు, థెరపిస్టులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ఆటిజం ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, మెడికల్ సర్వీస్, డాక్టర్. ఎ. లింగయ్య, పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్ విభాగం డైరెక్టర్, చైల్డ్ & అడోలసెంట్ న్యూరాలజిస్టు డాక్టర్. లోకేష్ లింగప్ప మార్గదర్శకత్వంలో, NIEPID డైరెక్టర్ డాక్టర్. బి.వి. రామ్ కుమార్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీలో డెవలప్మెంట్లో పీడియాట్రిషన్, CDC క్లినికల్ ఇన్ఛార్జ్ డాక్టర్. అమూల్య మైసూర్, మెడికల్ జెనెటిస్ట్ డాక్టర్. సారా బైలూర్, సీనియర్ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్. సోమశేఖర్ ఉన్నారు.
సదస్సులతో సమగ్ర సమాజ నిర్మాణం
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ, నేషనల్ ఆటిజం స్టేక్ హోల్డర్స్ సమ్మిట్- 2026లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆటిజం అనేది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదని మానవ మేధస్సు వైవిధ్యానికి ప్రతిబింబమని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సమగ్ర విధానాలను అమలు చేయడం ద్వారా అవగాహన దశను దాటి ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాన అవకాశాలతో కూడిన సమగ్ర సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆమె తెలిపారు.
సదస్సులో పిల్లల అభివృద్ధి, ప్రవర్తనా సమస్యల ప్రారంభ గుర్తింపు, చికిత్స కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఛైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (CDC)ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రం పిల్లలు, వారి కుటుంబాలకు అంచనా, థెరపీ, నిరంతర సహాయం అందించేందుకు మల్టీడిసిప్లినరీ నిపుణులను ఒకచోట చేర్చిందని కలెక్టర్ హరిచందన వెల్లడించారు.
సమాజం బాధ్యతగా చూడాలి
డాక్టర్. ఎ. లింగయ్య మాట్లాడుతూ, ఆటిజాన్ని సమాజం మొత్తం బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందని, అవగాహన, ప్రారంభ నిర్ధారణ, నాణ్యమైన చికిత్సపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఆటిజం సంరక్షణలో మల్టీడిసిప్లినరీ విధానం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి సదస్సులు నిపుణుల మధ్య జ్ఞాన మార్పిడికి వేదికగా నిలిచి, మెరుగైన చికిత్స ఫలితాలకు దారితీస్తాయని చెప్పారు. విద్య, ఉపాధిలో అందుబాటు, సమగ్ర విధానాలు, సామాజిక అంగీకారం ద్వారా ఆటిజం ఉన్న వ్యక్తులకు సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సమ్మిట్ ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన భావించారు.
Also Read: https://teluguprabha.net/telangana/nalgonda-news/diesel-theft-gang-arrested-in-nalgonda-district/

ప్రారంభ దశలో జోక్యం కీలకం
డాక్టర్. లోకేష్ లింగప్ప మాట్లాడుతూ, ఆటిజం వంటి సంక్లిష్ట న్యూరోడెవలప్మెంటల్ సమస్యలకు తొలిదశలో గుర్తింపు, సమగ్ర చికిత్స ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రారంభ దశలో చేసే జోక్యం.. పిల్లల అభివృద్ధి, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ సమ్మిట్ వైద్య నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి, ఆరోగ్యం, విద్య, విధాన రంగాల్లో సహకారాన్ని పెంపొందించే ఒక ముఖ్య వేదికగా నిలిచిందని డాక్టర్. లోకేష్ లింగప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

