20 US states oppose H1B visa fee hike: హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇతర దేశాలో పాటూ అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే కంపెనీలు అన్నీ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై కోర్టుకెళ్లాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 20 రాష్ట్రాలు దావా వేశాయి. దీనికి కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహించారు. లక్ష డాలర్ల ఫీజును నిలిపేయాలని దావాలో పేర్కొన్నారు. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని అందులో పేర్కొన్నారు. వలసల చట్టంలో కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని వాదించారు. అటార్నీ జనరల్ రాబ్ బోంటా విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్కు లేదన్నారు.
కొరత మరింత పెరుగుతుంది..
కాగా, వీసాల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంది. గతంలో హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. పరిమితులు, ఫీజులను నిర్ణయించింది. ఏళ్లుగా అమల్లో ఉన్న హెచ్1బీ వీసా ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయనకు ఆ అధికారం లేదని, ఏ అధ్యక్ష పరిపాలన ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరగరాయలేదని కంపెనీలు వాదిస్తున్నాయి. రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ అధ్యక్షుడు విస్మరించరు అని బోంటా చెబుతున్నారు. ఈ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం ప్రభుత్వం, ప్రైవేటు యజమానులపైనా ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో కార్మిక కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్-1బీ వీసాదారుల కొరత ఉందని.. ఇప్పుడు అది మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని రాబ్ బొంటా పేర్కొన్నారు.
టారిఫ్స్పైనా ట్రంప్కు చుక్కెదురు..
మరోవైపు, భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో కూడా ఆయనకు అమెరికా ప్రతినిధుల సభలో చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్స్ చట్టవిరుద్ధమని.. ఇవి అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ఇండో-యూఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

