56 Dead In Sri Lanka Floods and Landslides: శ్రీలంక (Sri Lanka) దేశాన్ని భారీ వర్షాలు, వరదలు (Floods), కొండచరియలు (Landslides) అతలాకుతలం చేశాయి. గత వారం ప్రారంభమైన ఈ తీవ్ర వాతావరణం గురువారం మరింత ఉధృతమైంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 56కు పెరిగింది. మరో 600లకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభుత్వం శుక్రవారం (నవంబర్ 28) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
టీ తోటల ప్రాంతాల్లో ఘోర నష్టం
ఈ ప్రకృతి విపత్తు కారణంగా అత్యధిక ప్రాణనష్టం మధ్య పర్వత ప్రాంతంలోని టీ తోటల ప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియా జిల్లాల్లో జరిగింది. రాజధాని కొలంబో నుండి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క గురువారం రోజునే 25 మందికి పైగా కొండచరియలు విరిగిపడి మరణించారు.
ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) ప్రకారం.. బదుల్లా, నువారా ఎలియా ప్రాంతాల్లో మరో 21 మంది గల్లంతయ్యారు, 14 మంది గాయపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడి మరణాలు సంభవించాయి. అకాల వర్షాలు, బలమైన గాలులకు ‘దిత్వ’ అనే తుఫాను ప్రభావం కారణమని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రైళ్లు, రోడ్లు మూసివేత
భారీ వర్షాల కారణంగా నదులు, రిజర్వాయర్లు ఎక్కువగా పొంగిపొర్లాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి రవాణాకు అంతరాయం ఏర్పడింది. రాళ్లు, బురద, చెట్లు రోడ్లు రైలు పట్టాలపై పడటంతో పాటు పట్టాలు వరద నీటిలో మునిగిపోవడంతో అధికారులు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
గురువారం నాడు జరిగిన సంఘటనల్లో.. తూర్పు పట్టణం అంపారా సమీపంలో వరద నీటికి కొట్టుకుపోయిన కారు దృశ్యాలు స్థానిక టెలివిజన్లో చూపించారు. ఆ కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు. వందలాది కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించడానికి సైన్యం, నౌకాదళం రంగంలోకి దిగాయి. వైమానిక దళ హెలికాప్టర్ గురువారం వరదల్లో చిక్కుకున్న ఇంటి పైకప్పుపై ఉన్న ముగ్గురు వ్యక్తులను రక్షించింది. నావికాదళం పోలీసులు పడవలను ఉపయోగించి నివాసితులను తరలించారు.
ALSO READ: UAE Visa Ban: పాకిస్థాన్కు యూఏఈ గట్టి షాక్.. భిక్షాటన, నేరాల కారణంగా వీసాల జారీ బంద్!

