After Nepal, ‘Nepo Baby’ Fury Erupts in Flood-Hit Philippines: ఒకవైపు ప్రకృతి సృష్టించిన జల ప్రళయం.. మరోవైపు అవినీతి రాజకీయ నాయకులు, వారి పిల్లల విలాసవంతమైన జీవితాలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఫిలిప్పీన్స్ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారీ వర్షాలు, వరదలతో దేశం అతలాకుతలం అవుతుంటే, ప్రజాధనంతో ‘నెపో బేబీలు’ (రాజకీయ, వ్యాపార ప్రముఖుల పిల్లలు) జల్సాలు చేస్తుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలే నేపాల్లో ఇదే తరహా ప్రజా ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేసిన నేపథ్యంలో, ఫిలిప్పీన్స్లో కూడా అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయా అన్న చర్చ మొదలైంది.
ALSO READ: Khalistani threats : కెనడాలో మళ్లీ ఖలిస్థానీ రగడ.. భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులు!
కొన్ని వారాలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఫిలిప్పీన్స్లోని అనేక నగరాలు, పట్టణాలు నీట మునిగాయి. రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్నాయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో, వరద నియంత్రణ వ్యవస్థలు ఘోరంగా విఫలమవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. వరద నియంత్రణ కోసం కేటాయించిన నిధులను రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారని, ‘దొంగ ప్రాజెక్టుల’ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
“నేను కష్టపడి పనిచేస్తాను, ప్రతి నెలా నా జీతం నుంచి పన్నులు కడుతున్నాను. కానీ, ఆ డబ్బుతో అవినీతిపరులు, వారి పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలిస్తే ద్రోహానికి గురైనట్లు అనిపిస్తోంది,” అని మనీలా సమీపంలోని అపాలిట్ పట్టణానికి చెందిన క్రిస్సా టోలెంటినో అనే టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం, పాఠశాలకు వెళ్లడానికి ఆమె పడవను ఉపయోగించాల్సి వస్తోందని వాపోయారు.
ALSO READ: Trump controversy: ట్రంప్ సంచలన ప్రకటన: యాంటీఫా సంస్థ ఉగ్రవాద సంస్థగా గుర్తించబడుతుందా?
ప్రజాగ్రహం పెల్లుబకడానికి మరో కారణం పసిఫికో, సారా డిస్కాయా అనే జంట. ఒకప్పుడు సామాన్య జీవితం నుంచి అపర కుబేరులుగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వీరు, ఇప్పుడు మూడు డజన్ల లగ్జరీ కార్లతో విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తున్న వీడియోలు బయటకు రావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. “మీ షాపింగ్లకు, విదేశీ పర్యటనలకు నిధులు సమకూర్చిన పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు చెప్పండి,” అంటూ నెటిజన్లు వారిపై విరుచుకుపడుతున్నారు.
పరిస్థితి తీవ్రతను స్వయంగా దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అంగీకరించారు. ఆయన తనిఖీకి వెళ్లిన ఒక వరద నియంత్రణ డ్యామ్ అసలు ఉనికిలోనే లేదని తేలడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. వరద నియంత్రణ నిధులలో ఏకంగా 70 శాతం అవినీతికే పోయిందని ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికా సంఘం అంగీకరించడం గమనార్హం. ఈ పరిణామాలతో పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు రాజీనామాలు చేయగా, కాంట్రాక్టర్లపై విచారణ కొనసాగుతోంది. నేపాల్లో మాదిరిగానే, ఫిలిప్పీన్స్లో కూడా ఈ ‘నెపో బేబీల’పై పెల్లుబికిన ఆగ్రహం ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.


