Air Force Jet Crashes Into School: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ఓ పాఠశాల ప్రాంగణంలో కూలి 19 మంది మరణించారు. మరో 164 మంది గాయపడ్డారు. ఉత్తర ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో ఉన్న మైల్స్టోన్ స్కూల్లో జరిగిన ఈ ఘటన, దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
సోమవారం మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో, బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 జెట్ విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్ అయ్యింది. కొద్ది నిమిషాల్లోనే యాంత్రిక లోపం కారణంగా ఈ విమానం ఉత్తరా ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ రెండంతస్తుల భవనంపై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆకాశంలో దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో 4 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఉన్నారు.
సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే, బంగ్లాదేశ్ అగ్నిమాపక బృందాలు, ఆరు అంబులెన్స్లతో సహా తొమ్మిది యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాలిన గాయాలతో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులు, పెద్దలను బయటకు తీసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి తరలించారు. ఈ ఘటనలో విమానం నడిపిన పైలట్ కూడా మరణించారని వైమానిక దళం పేర్కొంది.
Military training jet crashed into school campus in #dhaka Bangladesh, media reported
Bangladesh Air Force F-7 BJI aircraft hit Uttara's Milestone School & College campus today citing country's Inter Services Public Relations Directorate..Killed 1 person
On #crash #Bangladesh pic.twitter.com/O9seQrI6XX— Nikita Sareen (@NikitaS_Live) July 21, 2025
ప్రభుత్వ స్పందన
ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇది దేశానికి తీవ్ర బాధాకరమైన క్షణం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించాను” అని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని యూనస్ హామీ ఇచ్చారు.
ఈ విషాదానికి గుర్తుగా, బంగ్లాదేశ్ మంగళవారం రోజుని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను సగం ఎత్తు వరకే ఎగురవేయనున్నారు.


