Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Chikungunya Crisis: చైనాలో చికున్‌గున్యా చిచ్చు.. రంగంలోకి 'ఏనుగు' దోమలు!

Chikungunya Crisis: చైనాలో చికున్‌గున్యా చిచ్చు.. రంగంలోకి ‘ఏనుగు’ దోమలు!

Global health security : చైనాలో మరో మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. కొవిడ్‌ను తలపించే రీతిలో చికున్‌గున్యా జ్వరం వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. వేల సంఖ్యలో కేసులు, కఠిన ఆంక్షలతో చైనా అతలాకుతలమవుతోంది. ఈ వైరస్ కట్టడికి డ్రాగన్ కంట్రీ ఓ వినూత్న అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంతకీ ఏమిటా అస్త్రం…? దోమను అంతం చేసేందుకు మరో దోమనే రంగంలోకి దించడం వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి..? ఈ చికున్‌గున్యా ప్రపంచానికి ఎంత ప్రమాదకరం..?

- Advertisement -

కఠినమైన ఆంక్షలు :  ప్రపంచం ఇంకా కొవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే, చైనాలో చికున్‌గున్యా వైరస్ కొత్త ఆందోళనలకు తెరలేపింది. ముఖ్యంగా, దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో ఈ వ్యాధి పంజా విసురుతోంది. జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు 7,000 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఫోషన్ నగరం ఈ వ్యాధికి కేంద్రంగా మారడంతో, ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, చైనా ప్రభుత్వం కొవిడ్-19 సమయంలో అమలు చేసిన కఠినమైన ఆంక్షలను తిరిగి విధిస్తోంది.

‘ఎలిఫెంట్ ‘ దోమలతో వినూత్న పోరాటం: చికున్‌గున్యా వ్యాప్తికి కారణమైన ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ దోమలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఫాగింగ్, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణతో పాటు, ‘ఏనుగు దోమలు’ (Elephant Mosquitoes)గా పిలవబడే ‘టెక్సోరెంకైటిస్’ (Toxorhynchites) జాతి దోమలను భారీ సంఖ్యలో ప్రభావిత ప్రాంతాలలో వదులుతున్నారు. ఈ ఏనుగు దోమల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి మనుషులను కుట్టవు, పైగా ఇతర దోమల లార్వాలను తిని బతుకుతాయి. ఒక ఏనుగు దోమ లార్వా, తన జీవితకాలంలో సుమారు 100 వరకు ఇతర దోమల గుడ్లను తినగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జీవ నియంత్రణ పద్ధతి ద్వారా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని చైనా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు: చికున్‌గున్యా కేవలం చైనాకే పరిమితం కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16 దేశాలలో సుమారు 2.4 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారని, 90 మంది మరణించారని తెలుస్తోంది. ముఖ్యంగా, అమెరికా ఖండంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. బ్రెజిల్‌లో అత్యధికంగా 1,85,553 కేసులు నమోదు కాగా, బొలీవియా, అర్జెంటీనా, పెరూ వంటి దేశాలలో కూడా వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హిందూ మహాసముద్రంలోని లా రీయూనియన్, మయోట్టే, మారిషస్ వంటి దీవులలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో, చైనాలో చికున్‌గున్యా వ్యాధి ప్రబలడంతో, అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad