Donald Trump: ఇరాన్తో యుద్ధం ముగిసిపోయినట్టేనని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవలె ఇరుదేశాలు స్వీట్జర్లాండ్లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో-2026 సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వేదికగా మాట్లాడుతూ ఇరాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందని, ఆ దేశంతో శాంతి ఒప్పందం ముగిసిపోయిందన్నారు.
నాటో సదస్సులో ట్రంప్..
ఇకపై ఇరాన్తో ఎలాంటి చర్చలు ఉండబోవని, ఆ చర్చలు జరపడం కూడా సమయం వృథా అని ధ్వజమెత్తారు. దీంతో ఇరాన్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. నాటో చీఫ్ మార్క్ రుట్టెతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరాన్ తో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం పూర్తిగా రద్దయినట్లేనా అని ఓ విలేఖరి ట్రంప్ని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నా ఉద్దేశంలో అయితే అంతా అయిపోయినట్టే. ఇకపై వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు.
ఇరాన్ తో చర్చలు వృథా
వారితో చర్చలు జరపడం సమయం కూడా వృథానే. వారు నీచులు. నీచులు అంటే ఏంటో మీకు తెలుసా? మానసిక రోగులు. వారిని నడిపించే నాయకులు కూడా మానసిక రోగులే. వారు అత్యంత క్రూరులు. వారు చాలా కఠినమైన, హింసాత్మకమైన మనస్తత్వంతో ఉన్నారు. వారి చేతికి అణ్వాయుధం చిక్కితే కచ్చితంగా దానిని వాడేస్తారు. అందుకే నా పరంగా ఈ ఒప్పందం ముగిసిపోయింది’ అని ట్రంప్ అన్నారు. ఒకవేళ అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చలు కొనసాగించవచ్చని, అయితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే దానిపై నాకు నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు.
ఇరాన్ పై మంగళవారం రాత్రి అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం బహ్రెయిన్, కువైట్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై సరికొత్త రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడులపై స్పందించిన ట్రంప్.. గత రాత్రి ఇరాన్ లోని కొన్ని శక్తులపై దాడులు నిర్వహించామని, గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ రాకెట్ దాడులకు దిగడం వల్లనే తాము తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

