Trump Supports to Iran Protestors: ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగ్గుమన్న ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించాలని, త్వరలోనే సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా తీరుపై రష్యా, చైనా దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇరాన్ ప్రభుత్వంపై గత రెండు వారాలుగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో సుమారు 2,000 మంది వరకూ మరణించినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ నిరసనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతు ప్రకటిస్తూ.. ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని.. త్వరలోనే మీకు సహాయం అందుతుందని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/indiramma-housing-scam-hyderabad-collectorates/
ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలు ప్రస్తుతం అక్కడి మతపరమైన పాలనకు పెద్ద సవాలుగా మారగా.. ఆందోళనల్లో సుమారు 2,000 మంది మరణించారని ఇరాన్ ప్రభుత్వ అధికారి అంగీకరించారు. ఈ విధ్వంసానికి ‘ఉగ్రవాదులే’ కారణమని, మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో నిరసనకారులకు మద్దతు తెలుపుతూ.. ఇరాన్ దేశ అధికారులతో తలపెట్టిన అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. నిరసనకారులపై హత్యలు ఆగే వరకు ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరపబోనని.. ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశంపై అయినా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇరాన్ నుంచి చైనా, భారత్, టర్కీ, యూఏఈ వంటి దేశాలు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో రష్యా, చైనా.. అమెరికా తీరును వ్యతిరేకిస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/international-news/world-economic-forum-davos-2026-trump-zelenskyy-agenda/
అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన రష్యా.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడింది. ఇరాన్పై సైనిక దాడులు మధ్యప్రాచ్యానికి, ప్రపంచ భద్రతకు పెను విపత్తు అని పేర్కొంది. చైనా సైతం ట్రంప్ తీరును వ్యతిరేకించింది.

