India Vs Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక ప్రకటనతో వార్తల్లో నిలిచారు. బ్రిక్స్ దేశాలు లేదా వాటితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాలపై అమెరికా ఇంకో 10 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది ఏప్రిల్ 2న అమెరికా అమలు చేసిన సుంకాల నిర్ణయానికి కొనసాగింపుగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా, దానికి ప్రతిస్పందనగా ట్రంప్ తాజా ప్రకటన వెలువడినట్లు అంచనా. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్రంప్, “బ్రిక్స్కు అనుకూలంగా వ్యవహరించే దేశాలపై అదనపు సుంకాలు తప్పవు. ఎలాంటి మినహాయింపులు ఉండవు,” అని స్పష్టం చేశారు.
బ్రిక్స్ సంస్థ 2009లో ప్రారంభమైంది. ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా సభ్యులుగా చేరగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికా వచ్చి చేరింది. ఇటీవల ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇండోనేషియా వంటి దేశాలు కూడా ఇందులో చేరాయి. ఏప్రిల్ 2న అమెరికా కొన్ని దేశాలపై సుంకాలు ప్రకటించింది. వాటికి వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా మూడు నెలల పాటు వాటి అమలును వాయిదా వేసింది. ఆ గడువు జూలై 9న ముగియనుంది. ప్రస్తుతం యూకే, చైనా, వియత్నాం మాత్రమే అమెరికాతో సుంక ఒప్పందాలు చేసుకున్నాయి. మిగతా దేశాలు ఇంకా ఆ ఒప్పందాల్లో భాగం కావడం లేదు. భారత్ విషయానికి వస్తే, వ్యవసాయం మరియు పారిశ్రామిక రంగాల్లో అమెరికా మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్ ఇంకా తుదినిర్ణయం తీసుకోకపోవడం విశేషం. రేపటిలోగా అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం.