దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, అర్జెంటీనా తీర ప్రాంతాలను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం, అర్జెంటీనా నగరం ఉషుయా నుండి దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
భూకంపం అనంతరం చిలీ ప్రభుత్వం మగల్లానెస్ ప్రాంతం మరియు చిలీ అన్టార్కిటిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలను తీర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జెంటీనాలోని టియెర్రా డెల్ ఫ్యూగో ప్రావిన్స్లో సముద్రంలో నావికా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారుల సూచనలను పాటించాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినట్లు సమాచారం అందలేదు.
ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వాతావరణ శాస్త్రజ్ఞులు ఈ భూకంపాలను భూ గర్భంలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికలతో సంబంధం ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.