Sunday, June 1, 2025
Homeఇంటర్నేషనల్ప్రకృతి విలయం.. అకాల వరదలకు 117 మంది మృతి..!

ప్రకృతి విలయం.. అకాల వరదలకు 117 మంది మృతి..!

నైజీరియాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. నైజర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణాన్ని ముంచెత్తిన వరదలు అక్కడి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇప్పటివరకు కనీసం 117 మంది మృతిచెందినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. మరికొంతమంది గల్లంతవుతున్న ఘటనలతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులపై స్పందించిన నైజర్ రాష్ట్ర రాజధాని మిన్నాలోని ఆపరేషన్స్ కార్యాలయ అధికారి హుస్సేని ఇసా.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

- Advertisement -

పలువురు ఇంకా ప్రమాదంలోనే ఉన్నారని పేర్కొన్నారు. గంటల తరబడి కురిసిన భారీవర్షాలు, ఆనకట్టలు తాళలేక పోవడం వల్ల మోక్వా పట్టణం వరద నీటిలో మునిగిపోయింది. వరద ప్రభావంతో అనేక ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధితులకు తాత్కాలిక నివాసంతో పాటు ఆహారం, చిన్నారుల కోసం పాలు అందిస్తోంది.

ఇదే పట్టణంలో గత సెప్టెంబర్‌లోనూ వరదలు తాకాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఆనకట్టలు విరిగిపోవడం వల్ల పరిస్థితి మరింత విషమమైంది. గత ఏడాది 2024లో సంభవించిన వరదల్లో 1,200 మందికిపైగా మృతి చెందారు. లక్షలాదిమంది గృహాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇవి నైజీరియాలో దశాబ్దాల కాలంలో ఎదురైన అతి తీవ్రమైన వరదలుగా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ పేర్కొంది.

ఇకపోతే, ఇప్పటికీ 36 రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉందని నైజీరియా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని ప్రాణనష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News