కాల్పుల విరమణపై హమాస్తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది. 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సంతకం చేసిందని వైట్హౌస్ తెలిపింది. బందీల విడుదల, ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల, దీనికి బదులుగా చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, అలాగే మృతదేహాలను అప్పగించాలని హమాస్ దగ్గర అమెరికా ప్రతిపాదన పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. యుద్ధం ముగించే ఆలోచన అమెరికా దగ్గర లేదని.. కేవలం బందీల కోసమే అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిందని.. తగిన సమయంలో స్పందిస్తామని హమాస్కు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపాడు.
అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. తొలి ఒప్పందం ప్రకారం అంతా బాగానే జరిగింది. తొలి ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో తిరిగి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేసింది. దీంతో భారీగా నష్టం జరిగింది. అయితే తాజాగా మరోసారి బందీల విడుదలకు అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ అంగీకరించినా.. హమాస్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ అంటోంది.
ప్రస్తుతం హమాస్ దగ్గర 50 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. అందులో 20 మంది సజీవంగా ఉన్నట్లు నమ్ముతోంది. అయితే ఇటీవల బాధిత కుటుంబాలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. బందీల ఒప్పందానికి అంగీకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదన పెట్టింది. అయితే ఇది కేవలం బందీలు-ఖైదీల విడుదలకు మాత్రమే పరిమితమని.. యుద్ధం ముగింపునకు కాదని హమాస్ భావించి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
ఇక ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 22 కొత్త యూదు ఆవాసాల ఏర్పాటుకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఇజ్రాయెల్ ప్రకటించింది. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్బ్యాంక్ను ఆక్రమించింది. అప్పటినుంచి అక్కడికి ఇజ్రాయెలీ పౌరులను తరలిస్తూ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ పౌరుల కోసం వందల సంఖ్యలో అపార్టుమెంట్లు నిర్మించింది. అయితే ఈ తరలింపును వెస్ట్బ్యాంక్లోని 30 లక్షల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.